
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
● కలెక్టర్ విజయ కృష్ణన్
గొలుగొండ: యోగాతోనే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మండలంలోని కృష్ణదేవిపేట గ్రామంలో సోమవారం ఉదయం ఆమె యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం తదితర మండలాల నుంచి వచ్చిన ప్రజలు ఉదయం 7 నుంచి 8.15 గంటల వరకు యోగాసనాలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి యోగా గురువులు మండల స్థాయిలో శిక్షణ ఇస్తున్నారన్నారు. మండల స్థాయిలో శిక్షణ తీసుకున్న వారు గ్రామ స్థాయిలో నేర్పాలన్నారు. నర్సీటప్నం ఆర్డీవో వి.వి. రమణ, వైద్య, గ్రామ సచివాలయం, ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సర్పంచ్ లోచల సుజాత పాల్గొన్నారు.
అల్లూరికి నివాళి : మన్యం వీరుడు అల్లూరి సమాధికి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఘన నివాళులర్పించారు. అల్లూరి పార్కులో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ముందుగా అల్లూరి, గంటం సమాధుల వద్ద జ్యోతి వెలిగించారు. ఇక్కడ సమాధుల వద్ద యోగా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఐటీఐల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
నర్సీపట్నం: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశాలకు ఈనెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ఐటీఐ ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసాచారి తెలిపారు. మొత్తం 456 మంది విద్యార్థులు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకున్నారని, అర్హులైన అభ్యర్థులకు మొబైల్ ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కౌన్సెలింగ్కు నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐలో హాజరు కావాలన్నారు. 5వ తేదీన 1 నుంచి 149 ర్యాంకులు, 6న 150 నుంచి 300, 7న 301 నుంచి 456 ర్యాంకుల అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు.