రాజకీయ కక్షతో వందలాది పింఛన్లు రద్దు
అవ్వాతాతలు, దివ్యాంగులతో కూటమి సర్కారు ఆటలు
వెన్నుపూస విరిగినా జాలి లేదు
ఆమె పేరు నల్లబెల్లి రాజేశ్వరి. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామం. ఆమెకు వెన్నుపూస సమస్య ఉంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. వికలాంగుల సర్టిఫికెట్ దాఖలు చేయగా పింఛన్ మంజూరయింది. గత ఏడాది జూన్ వరకు పింఛన్ అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ ఆగిపోయింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించారు. ఆమెలాంటి దీనురాలికి కూడా నిర్దయగా పెన్షన్ తొలగించారు.
రాజకీయ కక్షతోనే..
ఆమె పేరు త్రినాథ. గొలుగొండ మండలం పాకలపాడు గ్రామం. ఆమెకు పుట్టుక నుంచి ఒక కన్ను లేదు. 18 ఏళ్లుగా వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నారు. వికలాంగుల సర్టిఫికెట్ కూడా ఉంది. కేవలం రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలన్న నెపంతో పింఛను తొలగించారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.
కొత్త పింఛను కోసం దరఖాస్తు తీసుకోలేదు
నా భర్త ఏడాదిన్నర క్రితం మరణించాడు. అప్పట్లో దరఖాస్తు చేస్తే ఎన్నికల కోడ్ అని ఇవ్వడం మానేశారు. కొత్త ప్రభుత్వం వచ్చేక మంజూరు చేస్తారేమోనని ఆశపడ్డాను. ఈ రోజు వరకు పింఛను మంజూరు చేయలేదు. చాలాసార్లు సచివాలయానికి వెళ్తే కొత్త పింఛను కోసం దరఖాస్తు తీసుకోవడం లేదు. కొత్తవి మంజూరు చేస్తే కబురు చేస్తాంలే అని తిప్పి పంపేశారు. ఇంటి యజమానిని కోల్పోయిన మాకు పింఛను మంజూరు చేయడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో తెలియడం లేదు.
– కిల్లాడ హైమావతి, పాములవాక, కోటవురట్ల మండలం
ఏడాది నుంచి కోరుతున్నా
నా భర్త చనిపోయి ఏడాది అవుతోంది. నాకు వితంతు పింఛను ఇవ్వాలని ఏడాది నుంచి కోరుతున్నా. సచివాలయానికి వెళ్తే ఇప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు తర్వాత చూద్దామని పంపేశారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. పనుల్లోకి వెళ్లలేకపోతున్నా. పిల్లన్ని బడిలోకి పంపుతున్నాను. అమ్మఒడి ఇవ్వడం లేదు. వాళ్లని మాన్పించేసి కూలి పనులకు పంపడం ఇష్టంలేక నేనే కష్టపడుతున్నాను. ఏడాది నుంచి పింఛను మంజూరు కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నాను.
– రావి సత్యవతి, మూలపర, నక్కపల్లి మండలం
ఒకటో తేదీ వచ్చిందంటే చాలు పింఛనుదారుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. తమ పేరు ఉంటుందో ఊడుతుందోనన్న భయం వెంటాడుతుంది. గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా లబ్ధి చేకూరిస్తే, ఇప్పుడు రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తున్నారు. తమ పార్టీ సానుభూతిపరులైతేనే కూటమి సర్కారు కరుణ దక్కుతుంది. నెలకు సుమారు వంద వంతున ఏడాది కాలంలో 10,136 పింఛన్లు తొలగించారు. లబ్ధిదారుల ఏరివేతలో భాగంగా దివ్యాంగులు సైతం మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్లు సమర్పించాలని హుకుం జారీ చేశారు. ఒకటో తేదీన తెలతెలవారుతుండగా వలంటీరు ఇంటికే వచ్చి, ప్రేమగా పలకరించి, పెన్షన్ అందించిన రోజులను తలచుకొని అవ్వాతాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
నక్కపల్లి: వృద్ధాప్య పింఛన్ కావాలంటే.. మీ ఇళ్ల వద్దకు రాలేం.. వీధుల్లోకి రావాల్సిందే.. ఒకటో తేదీన ఎక్కడో ఉంటే కుదరదు.. ఊర్లో ఉండాల్సిందే.. మేము పింఛన్లు ఇస్తున్న గ్రామ సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయం వద్దకు రావాలి.. ప్రతి నెలా పింఛన్లు బట్వాడా చేస్తున్న ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు ఇది. వైఎస్సార్సీపీ పాలన కంటే గొప్పగా చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లను ఒకటో తేదీ లేదా దానికి ఒక రోజు ముందుగానే ఇస్తున్నప్పటికీ పింఛన్దారులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఒకటో తేదీన పింఛన్ అందుకోకపోతే మరో రోజు ఇస్తారని భరోసా ఉండటం లేదు. ఆ రోజు ఎంత అత్యవసర పని ఉన్నా పింఛన్దారులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. పైగా అందరినీ ఒకచోట ఉంచి గంటలకొద్దీ పింఛన్లు ఇవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు.
నాటి బాధలు అన్నీ ఇన్నీ కావు
అవ్వా తాతలకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల వ్యవహారంలో పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. పెన్షన్ల కోసం పండుటాకులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. 2019కు ముందు టీడీపీ ప్రభుత్వంలో వృద్ధులకు ఇచ్చే ఐదొందల పింఛను అందుకోవడానికి రోజంతా కార్యదర్శి కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద, రచ్చబండ వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఒకవేళ సదరు ఉద్యోగి ఆరోజు రాకపోతే మళ్లీ అతను వచ్చేదాకా రోజూ కార్యాలయాలకు వచ్చి వేచి చూడాల్సి వచ్చేది. పదే పదే తిరగాల్సి రావడంతో పింఛన్లు తీసుకోడానికి వచ్చే వారిలో ఎంతోమందికి వడదెబ్బ తగలడం, ఎక్కువ సేపు వేచి ఉండలేక నీరసపడి అనారోగ్యం పాలవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇక పింఛన్లు తీసుకోగానే, వాటిలో నుంచి వందో యాభయ్యో మామూళ్ల కింద చెల్లించాలి. పింఛనుదారుల్లో ఎవరైనా చనిపోతేనే మరొకరికి కొత్తగా మంజూరు చేసేవారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే పింఛన్లు మంజూరు చేసేవారు. తొలి నెల పింఛన్లు గ్రామంలో టీడీపీ నాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. కొత్త పింఛన్లను ఏడాదికొక మారు జన్మభూమి కార్యక్రమంలో మంజూరు చేసేవారు. అవికూడా ఊరికి నాలుగో, ఐదో అంతే..
జగనన్న ప్రభుత్వంలో కష్టాలు తప్పాయి..
పింఛన్ల పంపిణీలో అవ్వాతాతల అగచాట్లను స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దే వలంటీర్ల సహాయంతో అందజేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ వేకువజామునే ఇంటి వద్దకు వలంటీర్లను పంపి పింఛన్లు అందజేసి దేశ చరిత్రలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఎవరి నుంచి ఒక్కపైసా ఆశించకుండా పింఛను మొత్తం అందజేసేవారు. ఎవరైనా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే అక్కడకెళ్లి పింఛను ఇచ్చే సదుపాయం కల్పించారు. కరోనా సంక్షోభంలోనూ పింఛన్దారుల ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఆరు మాసాలకొకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.
ఏడాది నుంచి మళ్లీ ఇక్కట్లు మొదలు
కూటమి అధికారంలోకి రావడంతోనే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ అవ్వాతాతల కష్టాలు మొదలయ్యాయి. సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు బట్వాడా చేస్తున్నారు. వీధిలో ఒక చోట కూర్చొని పంపిణీ చేస్తున్నారు. దాంతో పింఛను తీసుకునేందుకు అవ్వాతాతలు అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్నా, కొత్తగా ఒక్క పింఛను మంజూరు చేయలేదు. భర్త చనిపోతే అతడు పొందే పింఛనును భార్యకు వెంటనే ఇవ్వలేదు. పింఛన్ల కోసం కటాఫ్ తేదీ పెట్టి అర్హులకు అన్యాయం చేశారని పలువురు బాధితులు వాపోతున్నారు. జిల్లాలో వివిధ కేటగిరీల కింద 2.54 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లను అందజేస్తోంది. పింఛను తీసుకునే భర్త చనిపోతే వారి భార్యల పేరున మంజూరు చేయడంలోనూ ప్రభుత్వం కక్కుర్తి ప్రదర్శించింది. పైగా స్పౌజ్ పెన్షన్ మంజూరు కోసం 2023 డిసెంబరు 1 నుంచి 2014 అక్టోబరు 31వ తేదీ వరకు కటాఫ్ పెట్టింది. ఇలా జిల్లాలో 3,168 మందికి మాత్రమే వితంతు పింఛన్లు మంజూరు చేసింది.
జిల్లాలో మొత్తం సామాజిక పింఛన్లు 2,54,962
ఉంటుందో
ఊడుతుందోనన్న బెంగ
కూటమి అధికారంలోకి
వచ్చాక రద్దయినవి
10,136
వాన కురిసినా, ఎండ కాసినా వెళ్లి తెచ్చుకోవాల్సిందే..
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్
ప్రతి నెలా పెన్షన్ టెన్షన్