జోన్ గిఫ్ట్
దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గెజిట్ విడుదల 3,413 కి.మీ పరిధిలో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ కేకే లైన్పై కేంద్రం నిర్ణయంతో అసంతృప్తి
సాక్షి, విశాఖపట్నం: రైల్వే జోన్ కోసం విశాఖ వాసులు దశాబ్దాలుగా ఎదురుచూసిన కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రకటన వెలువడిన ఏడేళ్ల తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి వీఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ గెజిట్ తీపి కబురు కంటే చేదు నిజాలనే ఎక్కువగా మోసుకొచ్చింది. కీలకమైన ఆదాయ వనరుల పంపిణీ, విభజన అంశాల్లో కేంద్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ‘కామధేనువు’ లాంటి కేకే లైన్ మొత్తాన్ని ఒడిశాలోని రాయగడ డివిజన్కు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆర్థికంగా దెబ్బకొట్టిన విభజన
వాల్తేరు డివిజన్ విభజన తీరు ఏపీకి తీరని అన్యాయం చేసేలా ఉంది. ఇనుప ఖనిజం రవాణా ద్వారా భారీ ఆదాయం తెచ్చే కిరండూల్ మార్గాన్ని రాయగడకు కేటాయించడం ద్వారా కొత్త జోన్ ఆర్థిక వెన్నెముకను కేంద్రం విరిచేసింది. విశాఖకు కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే మార్గాలను మాత్రమే ఇచ్చారు. అంటే, రాబడి వచ్చే మార్గాలన్నీ పక్క రాష్ట్రానికి.. ఖర్చులు పెరిగే మార్గాలు మాత్రం విశాఖకు అన్నట్టుగా ఈ విభజన సాగింది.


