రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో ఒక్కరే దిక్కు | - | Sakshi
Sakshi News home page

రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో ఒక్కరే దిక్కు

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

మరో వైద్యుడు లేక ఇబ్బందులు

కొయ్యూరు: రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెల రోజులుగా రెండో వైద్యుని పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేసిన వైద్యురాలు స్నేహలతారెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అన్నమయ్య జిల్లాలో జరిగిన కౌన్సెలింగ్‌ ద్వారా మరో పోస్టింగ్‌ పొందారు. ఆమె వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఖాళీని భర్తీ చేయలేదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.

ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక్కరే వైద్యుడు ఉండటంతో పెరిగిన ఓపీ రోగులను చూడటంతో పాటు, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో, తాత్కాలికంగా యూ.చీడిపాలెంకు చెందిన ఒక వైద్యుడిని ఇక్కడకు డిప్యూటేషన్‌పై నియమిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. త్వరలో జరగబోయే రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇక్కడకు కచ్చితంగా వైద్యుని నియమిస్తామని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement