
మహిళల చెస్ టైటిల్ హేమిషా కై వసం
విశాఖ స్పోర్ట్స్: జిల్లా మహిళల చదరంగం చాంపియన్షిప్ను ఎన్.హేమిషా కై వసం చేసుకుంది. జి.కుమారి రన్నరప్గా నిలిచింది. ఆదివారం శ్రీ కశ్యప్ జూనియర్ కళాశాలలో ఆల్ విశాఖ చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. మొత్తం 63 మంది మహిళా చదరంగ క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ఆరుగురు ఫిడే ర్యాంకింగ్ సాధించిన వారు ఉండటం విశేషం. టోర్నీలో రెండో ర్యాంక్తో (1656 ఫిడే రేటింగ్) బరిలోకి దిగిన జి.కుమారి, చివరిదైన ఆరో రౌండ్లో మూడో ర్యాంక్తో ఆడిన ఎన్.హేమిషా (1490 రేటింగ్)తో డ్రాగా ముగించింది. పాయింట్లలో సమానంగా నిలిచినప్పటికీ, టైబ్రేకర్స్లో కుమారి వెనుకబడటంతో హేమిషా విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో టి.బంధవిక, డి.దివ్య (1463), హెచ్ఎస్ బుష్రా ఐదు పాయింట్లు సాధించినప్పటికీ, టైబ్రేకర్లలో వెనుకబడి జిల్లా జట్టుకు ఎంపిక కాలేకపోయారు. ఎరీనా కాండిడేట్ మాస్టర్ ఎం.మనస్వి(1489)తో పాటు ప్రవల్లిక, ఆశ్రిత, లలిత్యా నాలుగున్నరేసి పాయింట్లతో టోర్నీని ముగించారు. ఆసక్తికరంగా ఫిడే రేటర్ మనస్వికి జిల్లా జట్టులో స్థానం దక్కలేదు. మరోవైపు ఆరీనా ఫిడే మాస్టర్ ఎన్.గొర్లి పోటీలకు హాజరు కాకపోవడం గమనార్హం. ఈ చాంపియన్షిప్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి ఎన్టీఆర్ జిల్లాలో జరగనున్న ఏపీ అంతర్ జిల్లాల మహిళల చాంపియన్షిప్కు అర్హత లభించింది.