
శభాష్.. పోలీస్
గూడెంకొత్తవీధి: రోడ్లు భవనాల శాఖ పాడైన రోడ్లకు కనీసం మరమ్మతులు చేయడంలోను విఫలం కావడంతో చివరకు ఆ బాధ్యతను పోలీసు శాఖ తీసుకుంది. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా చొరవ చూపడంతో ఆర్వీ నగర్ నుంచి లంకపాకల వరకు రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. పెద్ద పెద్ద గోతులను కంకర, మట్టి వేసి పూడ్చుతున్నారు. అనంతరం రోలింగ్ చేస్తున్నారు. దీంతో వర్షాలు కురిసినా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతోంది. ఏడాది కిందట కురిసిన వర్షాలకు సీలేరు అంతర్రాష్ట్ర రహదారి పాడైంది. రహదారి నిర్మాణం చేపట్టాలని అరకు ఎంపీ తనూజరాణి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆమె నిధులు మంజూరు చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఇంత వరకు పైసా విదల్చలేదు. పాడైన రహదారిలో ప్రయాణికుల కష్టాలను చూసిన ఏఎస్పీ మిశ్ర, చింతపల్లి సీఐ వరప్రసాద్ కనీసం మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చారు. 12 కిలోమీటర్ల మేర పొడవైన అంతర్రాష్ట్ర రహదారిని సోమవారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. పోలీసులు చేస్తున్న పనిని వాహన చోదకులు అభినందిస్తున్నారు
అంతర్రాష్ట్ర రహదారికి మరమ్మతులు
కంకర, మట్టితో గోతుల పూడ్చివేత
చింతపల్లి ఏఎస్పీ చొరవ
నెరవేరని మంత్రి సంధ్యారాణి హామీ

శభాష్.. పోలీస్