
ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన
చింతపల్లి: తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వస్తాయని గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ బాలం పడాల్పై చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ కార్యదర్శి వండలం బాలయ్య,వైస్ చైర్మన్ చిన్నబాయి,గిరిజన సంఘం మండల నాయకులు సాగిన చిరంజీవి ఆధ్వర్యంలో తహఽసీల్దారు కార్యాలయం ఎదుట పలువురు సోమవారం ఆందోళన చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి, ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఆదివాసీ ట్రస్ట్ కార్యదర్శి బాలయ్య, వైస్ చైర్మన్ చిన్నబ్బాయి, సీపీఎం నాయకుడు పాండి ధనుంజయ మాట్లాడుతూ 2024లో కోరాబు బాలం పడాల్ సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ను ఏర్పాటు చేశారన్నారు.ట్రేడింగ్ మార్కెట్ పేరిట రూ.12,220 చెల్లించిన వారికి జీవితాంతం నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని, రూ.1,000 చెల్లిస్తే ఆరు నెలల తరువాత రూ.లక్ష చెల్లిస్తామని చైర్మన్ బాలం పడాల్ నమ్మబలికి చెప్పి మోసం చేశారని వారు ఆరోపించారు. ఇలా నగదు చెల్లించిన వందలాది మంది గిరిజనులు మోసపోయారని తెలిపారు.తక్కువ మందికి మాత్రమే నెలకు రూ.మూడు వేల చొప్పున చెల్లించి ఎక్కువ మందిని మోసం చేశారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని వారంతా ఆందోళన చేపట్టారు. ఈ విషయమై చైర్మన్ బాలంపడాల్ను వివరణకోరగా ట్రస్ట్కు సభ్యులు భారీగా విరాళాలు ఇచ్చారని, ఆ ట్రస్ట్ కార్యదర్శి బాలయ్య, వైస్ చైర్మన్ చిన్నబ్బాయిల వ్యక్తిగత ఖాతాల్లో రూ.80 లక్షలు, నగదు రూపంలో రూ.58.20లక్షలు ఉన్నాయని చెప్పారు. అవి చెల్లించమని అడిగితే కావాలనే తనపై నిందలుమోపుతున్నారని తెలిపారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.