
ఘనంగా పాణిహాటి మహోత్సవం
భీమునిపట్నం: భీమిలి సాగరసంగమం సమీపంలో హరేకృష్ణ మూమెంట్(గంభీరం) ఆధ్వర్యంలో సోమవారం పాణిహాటి మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ముందుగా సామూహిక సంకీర్తనలతో ప్రారంభమైంది. అనంతరం బలరామకృష్ణుని విగ్రహాలకు పాలు, వివిధ నదుల నుంచి సేకరించిన జలాలు, పంచామృతాలు, పూలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నిష్కించిన భక్త దాస మాట్లాడుతూ ఈ ఉత్సవానికి ఒక ప్రత్యేక చరిత్ర, గుర్తింపు ఉన్నాయని వివరించారు. హరేకృష్ణ మూమెంట్ వ్యవస్థాపకులు శ్రీచైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువులు కోల్కతా సమీపంలోని పాణిహాటి గ్రామం వద్ద కృష్ణతత్వాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశారన్నారు. అందులో భాగంగా గంగానది తీరంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించగా.. అప్పటి నుంచి దీనిని నదీ తీరాల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు గోస్తని నది తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందరూ చక్కని జీవన ప్రయాణాన్ని సాగించాలంటే కృష్ణతత్వాన్ని అనుసరించాలని భక్త దాస సందేశమిచ్చారు. అంబరీష్ దాసతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.