
అయోమ‘యోగాంధ్ర’
యలమంచిలి రూరల్: యోగాంధ్ర పేరిట ప్రభుత్వం చేస్తున్న హంగామా అధికారులు, ఉద్యోగులను అయోమయానికి, తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమం అమలవుతున్న తీరు సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్టుంది. నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజలను భాగస్వాములను చేయాలని సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతోపాటు సచివాలయాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏ ఒక్కర్నీ వదలడం లేదు. కొద్ది రోజులుగా మిగతా విషయాలు పక్కన పెట్టి కేవలం యోగా మంత్రం జపిస్తున్నారు. దీంతో అధికారులు తీవ్రంగా నలిగిపోతున్నారు. యోగాంధ్ర యాప్ రిజిస్ట్రేషన్ల నుంచి గ్రామ, మండల స్థాయి పోటీల నిర్వహణ వరకూ ఎంపీడీవో, తహసీల్దార్ స్థాయి అధికారులకు టార్గెట్లు నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ లక్ష్యాలను ఎలా చేరుకోగలమంటూ అధికారులు మధనపడిపోతున్నారు. గ్రామ సెక్రటరీలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, యోగాంధ్ర మాస్టర్ ట్రైనీలు ఇలా అందరిపైనా తీవ్ర పనిభారం, ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్లు, యోగా ప్రొటోకాల్ ఆసనాల శిక్షణను అధికారులు నయానో, భయానో పూర్తి చేశారు.
ఇవేం పోటీలు
జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 ఏళ్లు పైబడి అంటూ మూడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో, యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు గ్రూపునకు చెందిన కొందరు 35 ఏళ్ల వయస్సున్న వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడిందని వారంతా పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నిరంతరం సాధన చేసే వారు, యోగా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందే వారు మాత్రమే వేయగల ఆసనాలను మాత్రమే పోటీల జాబితాలో పొందుపర్చడంతో ఆ జాబితాను చూసిన వారందరూ విస్మయం చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో.. క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని, తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. కానీ పోటీలో ఎక్కువమంది పాల్గొన్నట్టు చూపించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం వంటి ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణ మత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడాసనం ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులతోపాటు యోగా మాస్టర్ ట్రైనీలు, ఎంపీడీవోలు గ్రామాల్లోకి వెళ్లి పోటీల్లో పాల్గొనాల్సిందిగా అందరినీ ప్రాధేయపడవలసి వస్తోంది. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అన్పించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
వెబ్తోనే టైం సరి
యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతి రోజూ కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబెక్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్దీ సమయం వృథా అవుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కిందిస్థాయి ఉద్యోగులను గ్రామాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాలంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇపుడు యోగాంధ్ర కార్యక్రమం కోసం నెల రోజులపాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణల్లో తలలు పట్టుకుంటున్నారు. యోగాసనాలు నేలపై వేయకూడదు. మ్యాట్లు, లేదా కార్పెట్లు వంటివి ఉండాలి. కానీ యోగాంధ్ర కోసం అధికారుల మాట కాదనలేక కటిక నేలపై కూడా ఆసనాలు చేస్తున్న ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. యోగాంధ్ర కార్యాచరణతో చాలా పని ఒత్తిడితో సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులంతా నరకం చూస్తున్నారు. చివరకు రోజూ కార్యాలయంలో రాత్రి 10 గంటల వరకూ కూడా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారులు తీవ్రంగా మధనపడుతున్నారు.
యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి దివ్య ఔషధం... ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది... కానీ అధికారులు, ఉద్యోగులు మాత్రం గత పక్షం రోజులుగా ‘యోగాంధ్ర’ ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఒక పక్క శిక్షణ కార్యక్రమాలు... మరో పక్క ఫొటోలను అప్లోడ్ చేయడం...ఇంకో పక్క అభ్యర్థులను ఒప్పించే, టార్గెట్లను పూర్తిచేసే పనులు, సర్వేలు, టెలీకాన్ఫరెన్స్లు ఇలా తలకు మించిన పనులతో సతమతమవుతున్నారు. కింది స్థాయి నుంచి ఒకటే హైరానా పడుతున్నారు.... సాధ్యం కాని ఆసనాలతో పోటీలకు ఎలా సిద్ధం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
సాధ్యం కాని ఆసనాలతో పోటీలు ఎలా ?
యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా ఐదు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా చేస్తోంది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీల రిజిస్ట్రేషన్, యోగా ప్రొటోకాల్ ఆసనాలను పూర్తి చేసినప్పటికీ, జిల్లా స్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కాని, అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాల్లో పేర్కొనడంతో, కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
తీవ్ర స్థాయిలో ఉద్యోగులపై పని ఒత్తిడి
యోగాంధ్ర సర్వే, లక్ష్యాలు, టెలీకాన్ఫరెన్సులతో తిప్పలు
సాధ్యం కాని ఆసనాలతో పోటీ ఎలా
అంటున్న ప్రజలు

అయోమ‘యోగాంధ్ర’

అయోమ‘యోగాంధ్ర’

అయోమ‘యోగాంధ్ర’