
ఆర్టీసీ పార్సిల్ సర్వీస్లో బట్టల మూట మాయం
● ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
● చిరు వ్యాపారి ఆవేదన
సీలేరు : రాజమండ్రికి చెందిన ఓ బట్టల వ్యాపారి మారుమూల గిరిజన గ్రామాలు తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే వ్యాపారి 50 వేల రూపాయలు బట్టలమూట మాయమవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రికి చెందిన మహమ్మద్ షరీఫ్ అనే వ్యాపారి ఈ నెల 7న రాజమండ్రి ఆర్టీసీ పార్సిల్ కౌంటర్ వద్ద సీలేరుకు బుక్ చేసి, అదేరోజు బస్కు పంపించారు. అప్పటికే సీలేరులో వ్యాపారం చేస్తున్న మహమ్మద్ అలీ బస్సు దగ్గరకు వెల్లి బట్టల మూట ఇవ్వాలని డ్రైవర్ను అడగగా బస్సులో మూట ఏమీ లేదని, రాజమండ్రిలో ఇవ్వలేదని చెబుతూ దానికి సంబంధించిన రసీదును తీసుకోండి అని ఇచ్చాడు.
మూట ఇవ్వకుండా రశీదును ఎలా ఇచ్చారని డ్రైవరును ప్రశ్నించగా సదరు డ్రైవరు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. రాజమండ్రి పార్సిల్ కౌంటర్లో సీలేరు బస్సుకు మూట వేసినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిందని, కానీ సీలేరుకు ఆ బట్టల మూట రాలేదని బాధితుడు వాపోయాడు. దీనిపై సంబంధిత ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని తక్షణమే ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు మహమ్మద్ షరీఫ్ డిమాండ్ చేశారు.