
దూరాభారం.. గిరిజనులకు నరకం
సాక్షి.పాడేరు: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలు రేషన్సరుకులు పొందేందుకు నరకయాతన పడుతున్నారు. ఎండీయూ వాహనాలను రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిలో డీఆర్ డిపోల్లో సరుకులు పంపణీ చేస్తుండడంతో కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి, రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. బియ్యం బండి గ్రామాలకు రాదని తెలుసుకున్న రేషన్కార్డుదారులు దూరంగా ఉన్న డిపోలకు సోమవారం పరుగులు తీశారు.జిల్లాలోని 671 రేషన్ డిపోలు ఉండగా..వాటిలో 370 వరకు తెరచుకున్నాయి.మిగిలిన డిపోలకు బియ్యం,పంచదార సరఫరా జరగకపోవడంతో పాటు సాంకేతిక సమస్యలతో తెరవలేదు.మారుమూల గ్రామాల్లోని మినీ డీఆర్ డిపోలలో ఇంకా బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు. పెదబయలు మండలం మారుమూల పెదకోడాపల్లి డీఆర్ డిపో వద్ద గిరిజనుల ఇబ్బందులు వర్ణనాతీతం.డిపో పరిధిలోని అన్ని గ్రామాలు 3 నుంచి 15కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.15 కిలోమీటర్ల దూరంగా ఉన్న ఉర్రాడ నుంచి మహిళలు ఆటోలో వచ్చి నిత్యావసరాలు పొందారు.ఇరువైపులా ఆటోకు లగేజీతో కలిసి రూ.150 చెల్లించారు. గొచ్చరి,బురదపాడు గిరిజనులు,వృద్ధులు రెండు గంటల పాటు కాలినడకన పెదకోడాపల్లికి చేరుకుని సరుకులు పొందారు.తరువాత నడిచే ఓపిక లేక రూ.100 చెల్లించి ఆటోలో తమ గ్రామాలకు వెళ్లారు.కొన్ని గ్రామాల గిరిజనులు బైక్లపై బియ్యం తరలించారు.డబ్బులు లేని వారు మాత్రం కాలినడకతోనే బియ్యాన్ని మోసుకువెళ్లారు. ఇదే మండలంలోని మారుమూల కిముడుపల్లి,గాదేపల్లి డిఆర్ డిపోలు రెండవ రోజు కూడా తెరవలేదు. ఈనెల కూడా కందిపప్పు పంపిణీ జరగలేదు.
రేషన్ సరుకులు పొందేందుకు పాట్లు
మోత బరువుతో మైళ్ల కొద్దీ నడక యాతన
రెండో రోజూ రేషన్ పంపిణీలో
అవే ఇబ్బందులు