
మోసాలను ఎండగడతాం..
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని వైఎ స్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు.
వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి
సాక్షి,పాడేరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ మోసాలపై జిల్లాలో బుధవారం నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాలైన పాడేరు,అరకులోయ,రంపచోడవరంలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలు,అనుబంధ విభాగాల ప్రతి నిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో గిరిజనులకు ఒరిగిందేమి లేదన్నారు.సూపర్సిక్స్ పథకాలను కూడా అమలు చేయకుండా మోసం చేసిందని పేర్కొన్నారు.అరకు ఎన్నికల సభలో జీవో నంబర్ 3 పునరుద్ధరణపై, నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతో భర్తీ చేసేందుకు చంద్రబాబు హామీ ఇచ్చి, నిలబెట్టుకోలేదన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి దగా చేశారని తెలిపారు. ఇంటి వద్దే బియ్యం,ఇతర నిత్యావసరాలు పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం కక్షగట్టి రద్దు చేయడం దారుణమని తెలిపారు.గిరిజనులంతా మూడు రోజుల నుంచి నిత్యావసరాలు పొందేందుకు జీసీసీ డిపోలకు కాలినడకన వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఏడాది పాలనలో పేద ప్రజలకు అన్యాయమే జరిగిందన్నారు.ప్రజలంతా కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారని తెలిపారు.
అరకులోయటౌన్: నియోజకవర్గ కేంద్రం అరకులోయలో ఈనెల 4వ తేదీ బుధవారం నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపడుతున్న వెన్నుపోటు దినం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలన్నారు. గిరిజన ప్రాంతంలో శతశాతం ఉద్యోగాలను గిరిజన నిరుద్యోగులతో భర్తీ చేస్తానని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారం పొందిన తరువాత విస్మరించారని ఆరోపించారు. క్యాంప్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్కు వినతి పత్రం సమర్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు

మోసాలను ఎండగడతాం..

మోసాలను ఎండగడతాం..