
గర్భశోకం
● ప్రాణం తీసిన ఈత సరదా ● వరాహ నదిలో మునిగి ఇద్దరు అన్నదమ్ములు మృతి ● తల్లిదండ్రులకు తీరని వేదన
కోటవురట్ల: మాటలకందని విషాదం.. పగవారికి సైతం రాకూడని ఉత్పాతం.. వరాహ నదిలో మునిగి ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.. ఉన్న పిల్లలిద్దరూ కన్నుమూయడంతో తల్లిదండ్రులు అంతులేని వేదనతో కన్నీరుమున్నీరయ్యారు. మీరే లేకపోతే ఇక మాకెందుకు ఈ బతుకు అంటూ వారు విలపిస్తున్న తీరు అందరి మనసులను కలచివేసింది. ఈ హృదయ విదారక ఘటన కోటవురట్ల శివారు జానకీరాంపురంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుర్ల దేవా (14), సుర్ల హిమవంత్ (10), అల్లు నాయుడులతోపాటు కె.వెంకటాపురానికి చెందిన పోలుపర్తి మోహన్ ఉదయం 8 గంటల సమయంలో గ్రామాన్ని ఆనుకుని ఉన్న వరాహ నదిలోకి ఈత కొట్టేందుకు దిగారు. ఒకచోట లోతు ఎక్కువగా ఉండడంతో అన్నదమ్ములైన దేవా, హిమవంత్ గోతిలో పడి మునిగిపోయారు. మిగతా ఇద్దరు పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే అన్నదమ్ములిద్దరూ ఊపిరాడక మృతి చెందారు. అల్లు నాయుడు బాగానే ఉండగా పోలుపర్తి మోహన్ను స్థానిక సీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. పిల్లలు ఈతకు వెళ్లే సమయానికి మృతుల తల్లిదండ్రులు సుర్ల రాము, సుర్ల లక్ష్మి ఉపాధి పనికి వెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుల్లో పెద్దవాడైన దేవా చిన్నతనం నుంచి తాతగారి ఊరు రోలుగుంట మండలం రొంగలిపాలెంలో ఉంటూ రోలుగుంటలో చదువుకుంటున్నాడు. ఇటీవల తలుపులమ్మతల్లి పండగ జరగడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. సెలవులు కావడంతో తమ్ముడు హిమవంత్, మిగతా పిల్లలతో కలిసి నదిలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుల తండ్రి సుర్ల రాము ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి మృతదేహాలకు స్థానిక సీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ సత్యనారాయణరాజు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్, సర్పంచ్ బి.అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆర్ఎస్ లక్ష్మీనరసింహరాజు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్ మాట్లాడుతూ పిల్లలిద్దరినీ కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

గర్భశోకం

గర్భశోకం

గర్భశోకం