
వరదొస్తే దారెటు?
2024 వరద ముంపులో చింతూరు, చట్టి గ్రామాలు
● విలీన మండలాల ప్రజల్లో గుబులురేపుతున్న వాతావరణశాఖ హెచ్చరికలు
● సమర్థంగా ఎదుర్కొనేందుకు
సమాయత్తం కాని ప్రభుత్వం
● కానరాని ముందస్తు సమీక్షలు
● కనీసం బఫర్ స్టాక్ను సిద్ధం చేయని అధికార యంత్రాంగం
ముందస్తు కసరత్తు చేపట్టని కూటమి సర్కార్
చింతూరు/వీఆర్పురం/కూనవరం: గోదావరి, శబరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సిద్ధం కాకపోవడంతో విలీన మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చే వరదలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జూన్, జూలై మాసాల్లోనే ప్రారంభమైపోతున్నాయి. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందుగానే సమీక్ష సమావేశాలు నిర్వహించాల్సిన అధికారులు వీటిపై దృష్టిసారించిన దాఖలాలు కానరావడం లేదు. వరదల సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారులను ముందుగానే అప్రమత్తం చేసి ప్రణాళికపరమైన చర్యలు చేపట్టేది. 2022లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని 2023లో అప్పటి అధికారులు ముందుగానే వీఆర్పురం, కూనవరం మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. దీంతో వరదలు సంభవించిన సందర్భంలో సురక్షితంగా వాటిలోకి తరలివెళ్లారు.
● వరద వస్తే గతంలో మాదిరిగా కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తగ్గుముఖం ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా వరదలకు ముందుగానే ప్రతి మండలంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి సిద్ధంగా ఉంచాలి.
● నాలుగు మండలాల్లోని వరద ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లాంచీలు, నాటు పడవలు, నిత్యావసరాలకు సంబంధించి జీసీసీ ద్వారా మూడు నెలలకు సరిపడా బఫర్స్టాకును ముందుగానే సిద్ధం చేయాలని పలువురు సూచిస్తున్నారు.
● వరద సమయంలో చుట్టూ దారులు మూసుకుపోవడంతోపాటు గ్రామాల్లోకి నీరు వచ్చేస్తోంది. దీంతో ఆశ్రయం కష్టంగా ఉంటోంది. ఎత్తయిన, అటవీప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకునేందుకు టార్పాలిన్లతోపాటు టార్చిలైట్లు, లాంతర్లు, కొవ్వొత్తులు, కిరోసిన్తో పాటు వంటనూనె, కూరగాయలు, పాలప్యాకెట్లు అందించాలి.
● వరదలకు రహదారులు ముంపునకు గురికాకముందే నిత్యావసర సరకుల నిల్వలను ఆయా మండలాలకు తరలించాలి. నిత్యావసరాల తరలింపుతో పాటు ఇతరత్రా పనులు సజావుగా చేపట్టేందుకు ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయాలి.
కంటిమీద కునుకు లేకుండా..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మించిన స్పిల్వే, ఎగువ, దిగువ కాపర్ డ్యాంల కారణంగా ఇక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వీటి కారణంగా బ్యాక్వాటర్ ఇప్పటికే ఏటా వర్షాకాలంలో వీఆర్పురం, కూనవరం, ఎటపాక మండలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో భద్రాచలంలో రెండో హెచ్చరిక అయిన 53 అడుగులకు నీరు చేరాక విలీన మండలాల్లోని గ్రామాలు వరద తాకిడికి గురయ్యేవి. ప్రస్తుతం స్పిల్వేతో పాటు కాపర్ డ్యాంల కారణంగా మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు చేరేసరికే విలీన మండలాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో గోదావరి, చింతూరు, వీఆర్పురం మండలాల్లో శబరినది వరదముంపు కారణంగా రహదారుల పైకి వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి.
2022లో వచ్చిన వరదలకు భద్రాచలంలో 72.4 అడుగుల వరదనీరు నమోదుకాగా 25 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. దీని కారణంగా నాలుగు మండలాల్లో సుమారు 150 గ్రామాలు ముంపునకు గురికాగా 232 గ్రామాలపై ప్రభావం చూపింది. సుమారు 27 వేల కుటుంబాలకు చెందిన 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
వాగులు పొంగితే..
చింతూరు మండలంలో సోకిలేరు, జల్లివారిగూడెం వాగులు పొంగినప్పుడల్లా చింతూరు, వీఆర్పురం మండలాల మధ్యతోపాటు, మరో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.
కుయిగూరువాగు పొంగితే ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలతో పాటు మండలంలోని నాలుగు గ్రామాలకు, చిడుమూరు వాగు వల్ల ఆంధ్రా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య, చంద్రవంక వాగు పొంగితే చింతూరు, కూనవరం మండలాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కూనవరం మండలంలో పోలిపాక, కోతులగుట్ట వద్ద వరదనీరు రహదారి పైకి చేరుతోంది. దీనివల్ల భద్రాచలం, చింతూరు, ఎటపాక మండలంలో రాయినపేట, నెల్లిపాక, నందిగామ, మురుమూరు ప్రాంతాల్లో వరదనీరు రహదారిని ముంచెత్తుతోంది.
వీఆర్పురం మండలంలో కన్నాయిగూడెం, రామవరం, అడవి వెంకన్నగూడెం, ఇప్పూరు వద్ద రహదారిపైకి వరదనీరు ఎగదన్నడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి.

వరదొస్తే దారెటు?