
ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభాలు
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్బీఎస్ నంద్
పాడేరు : లాభదాయకమైన ప్రకృతి విధానంలో వ్యవసాయంపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్బీఎస్ నంద్ సూచించారు. బుధవారం పట్టణంలోని జిల్లా వ్యవసాయ శిక్షణ కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమం ముగింపులో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ద్రవ, ఘన జీవామృత తయారీ విధానం, జీవ వైవిధ్యం అధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రత్యక్షంగా రైతులకు, పరోక్షంగా భూమికి ఎంతో మేలు కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రామ్మోహన్రావు, ఎల్. భాస్కర్రావు, వ్యవసాయ శాఖ అనుబంద విభాగాల ఏడీఏ, ఎంఎంఏ, ఏవో, హెచ్వోలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.