
25 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు
సాక్షి,పాడేరు: విశాఖలో ఈనెల 21వతేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సమక్షంలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవంలో 25వేల మంది విద్యార్థులతో ప్రత్యేకంగా 108 సూర్య నమస్కారాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో యోగాంధ్ర, విద్యార్థులకు యోగా శిక్షణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా గిరిజన విద్యార్థులతో యోగా సాధన చేయిస్తున్నామన్నారు. ఇప్పటికే అరకులోయలో 21,800మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు చేయించి ప్రపంచ రికార్డును సాధించామని, ఇదే స్ఫూర్తితో విశాఖ వేదికగా 25వేల మంది విద్యార్థులతో యోగా చేయిస్తామన్నారు.ఈనెల 12వతేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయని, ప్రతిరోజు 30 నుంచి 40నిమిషాలు సూర్య నమస్కారాలపై యోగా సాధన చేయించాలన్నారు. ప్రధాన మంత్రి సమక్షంలో జరగనున్న విద్యార్థుల సూర్య నమస్కారాల యోగాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. వారి సమగ్ర వివరాలతో నివేదిక తయారుచేసి పోలీసుశాఖకు అందజేసి, సెక్యూరిటీ క్లియరెన్స్ పొందాలన్నారు. విద్యార్థులను విశాఖకు తరలించడానికి రవాణా, ఆహారం, వసతి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల యోగాకు ఆంఽధ్ర విశ్వవిద్యాలయం మైదానాన్ని కేటాయించారని, వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. యోగాంధ్రలో భాగంగా జిల్లాలో 19 మంది యోగా గురువులు, 112మంది యోగా మాస్టర్ ట్రైనీలు, 3,367మంది ట్రైనర్లుగా నమోదు అయ్యారన్నారు. ఇప్పటివరకు నమోదైన 3,49,141మందికి యోగా శిక్షణ విజయవంతంగా జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,జిల్లా యోగా నోడల్ అధికారి లోకేశ్వరరావు, డీఎస్పీ సహబాజ్ అహ్మద్,డీఈవో బ్రహ్మజీరావు, గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీ ఎల్.రజనీ, ఏటీడబ్ల్యూవోలు జయనాగలక్ష్మి, మల్లికార్జునరావు, వెంకటరమణ, పలుశాఖల అధికారులు, హెచ్ఎంలు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
ఈనెల 21న ప్రధానమంత్రి మోదీ సమక్షంలో ప్రదర్శన
విశాఖ వేదికగా గిన్నిస్ రికార్డు లక్ష్యం
కలెక్టర్ దినేష్కుమార్

25 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు