
త్వరితగతిన ప్రజా సమస్యల పరిష్కారం
పాడేరు : ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుండి జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్తో కలిసి ఆయన 93 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీకోసంలో స్వీకరించిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీదారులు అందజేసిన వినతుల పరిష్కారంపై 1100 నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేష్, హౌసింగ్ పీడీ బి. బాబునాయక్, డీఆర్డీఏ పీడీ మురళి, ఎస్టీవో కృష్ణారావు, టీడబ్ల్యూ ఇన్చార్జి డీడీ రజని పాల్గొన్నారు.
14న మెగా రక్తదాన శిబిరం
ఈనెల 14న కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని సూచించారు.

త్వరితగతిన ప్రజా సమస్యల పరిష్కారం