
రీసర్వేలో నిర్లక్ష్యం సహించను
సాక్షి,పాడేరు: జిల్లాలో భూముల రీసర్వేను రెవెన్యూ అధికారులు మరిచిపోతున్నారని కలెక్టర్ ఎ.ఎస్.దినే ష్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండలాల రెవెన్యూ,సర్వే అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.జూన్ నెలాఖరు నాటికి మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రంపచోడవరం డివిజన్లో మ్యుటేషన్లు,రీసర్వే పనులు సంతృప్తికరంగా జరగడం లేదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.పోరంబోకు భూముల్లో ఆక్రమణలు తొలగించి, అభ్యంతరం లేని భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు. గతంలో జారీ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను పునః పరిశీలన చేయాలని, వేరేచోట ఇళ్ల స్థలాలు,ఇళ్లు ఉంటే గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని ఆదేశించారు. సబ్కలెక్టర్లు సౌర్యమన్పటేల్, కల్పశ్రీ, డీఆర్వో పద్మలత, సర్వే ఏడీ దేవేంద్రుడు, అన్ని మండలాల తహసీలార్లు, సర్వేయర్లు,వీఆర్వోలు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్కుమార్ ఆగ్రహం