
హామీలపై ప్రశ్నించేందుకే ‘వెన్నుపోటు దినం’
● ఎంపీ డాక్టర్ తనూజారాణి
అరకులోయటౌన్: ఈనెల 4వ తేదీ నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపై ప్రశ్నించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా అరకులోయలో భారీ ర్యాలీ జరిపి, తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని చెప్పారు.