
మిరియం సాగుపై అవగాహన
చింతపల్లి: మిరియంలో మేలైన సాగు పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి హిమబిందు సూచించారు. బుధవారం విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్టు, చింతపల్లి,అంబాజీపేట పరిశోధనం స్థానం వారు సంయుక్తంగా గిరిజన రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మిరియం సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడి నిచ్చే రకాలు, నాటే విధానం, సోకే తెగుళ్లు, నివారణపై ఆమె రైతులకు అవగాహన కల్పించారు. జీవనియంత్రణ కారకాలతో తెగుళ్లు నివారణ చర్యలను శాస్త్రవేత్త డాక్టర్ నీరజ వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కొండవంచులు, ఎర్రబంద, తురుతుంపాడు, రోలంగి, గొందిపాకలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.