
జీసీసీ బంక్లపై బకాయిల భారం
రంపచోడవరం: గిరిజన సహకార సంస్థ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులకు బకాయిలు గుదిబండలా మారాయి. ఈ బంకుల్లో పెట్రోల్,డీజిల్ కొట్టించుకున్న ప్రభుత్వ శాఖలు సకాలంలో నగదు చెల్లించడం లేదు. ఏళ్ల తరబడి బకాయిలు పెట్టడంతో జీసీసీకి వచ్చిన లాభాలు ఆవిరైపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో యథేచ్ఛగా కొంతమంది బంక్ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీసీసీకి లాభాల మాట ఎలా ఉన్న... సంస్థ నిధులతో మిగతా శాఖ అధికారులు, సిబ్బంది వాహనాల్లో ఇష్టానుసారం షికార్లు చేస్తున్నారు. రంపచోడవరం డివిజన్లో రంపచోడవరం, అడ్డతీగలలో జీసీసీ బంక్లు నిర్వహిస్తోంది. రాజవొమ్మంగిలో కొత్త బంక్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. చింతూరు పరిధిలో ఒక జీసీసీ బంక్ ఉంది.
రూ.20 లక్షల బకాయి
పందిరిమామిడిలో జీసీసీ నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్కు వివిధ శాఖలు రూ. 20 లక్షలు బకాయి పడ్డాయి. ఏడాదిన్నర కాలంగా చెల్లించడం లేదు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరైన తరువాత వాటిని జీసీసీకి చెల్లిస్తారు. అంత వరకు ప్రభుత్వ వాహనాలకు పెట్రోల్, డీజిల్ను అరువు (కూపన్) పద్ధతిన కొట్టాల్సిందే. గిరిజన సహకార సంస్థ కొంత సొమ్మును గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీసీఎంస్)కి వ్యాపార నిర్వహణకు చెల్లిస్తుంది. ఆ సొసైటీ ద్వారా బంక్లకు నిర్వహిస్తోంది. జీసీసీ సొమ్ముతో పెట్రోల్ కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ శాఖల వాహనాలకు వేసిన పెట్రోల్ సొమ్ము సకాలంలో రాకపోవడంతో సంస్థకు వచ్చిన లాభాలు ఏవీ కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలకు కూపన్లు ద్వారా అరువు కొడుతున్న పెట్రోల్, డీజిల్ను కొంత మంది ఉద్యోగులు తమ సొంత వాహనాలకు వినియోగిస్తుండగా, మరికొంత మంది ప్రభుత్వ వాహనాల్లో కొట్టించి సొంత పనులకు వినియోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. భారీగా బకాయిలు పడిన కొన్ని ప్రభుత్వ శాఖల వాహనాలకు పెట్రోల్,డీజిల్ వేయలేమంటూ జీసీసీ అధికారులు తేల్చిచెప్పినట్టు తెలిసింది. బంకుల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కూడా చేతివాటం ప్రదర్శస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బంక్ పెట్రోల్తో సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఆ సొమ్మును రొటీన్ చేస్తూ లాభాలను జేబుల్లో వేసుకుంటున్నారని తెలిసింది. కొన్నేళ్ల కిందట భారీగా అక్రమాలకు పాల్పడడంతో పందిరిమామిడి జీసీసీ బంక్లో పనిచేసి ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు.
నగదు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్న వివిధ శాఖలు