
యాంత్రీకరుణ ఏదీ?
జిల్లాలో కూలీల కొరత నేపథ్యంలో సాగు పనుల్లో యంత్రాల వినియోగానికి గిరిజన రైతులు అలవాటు పడ్డారు. ఇలాంటి తరుణంలో అన్నదాతకు ప్రభుత్వాలు అండదండగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీ జరగకపోవడంతో యాంత్రీకరణను పక్కన బెట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి,పాడేరు: యంత్రాలతో వ్యవసాయ పనులకు గిరిజన రైతులు అలవాటు పడ్డారు. పవర్ టిల్లర్లు, వీడర్లతో దుక్కి, దమ్ము పనులు చేస్తున్నారు. అయితే గిరిజన గ్రామాల్లో రైతులందరికీ యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని అద్దెకు తెచ్చుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా సుమారు 500 వరకు పవర్ టిల్లర్లు, వీడర్లను 50శాతం రాయితీపై గిరిజన రైతులకు పంపిణీ చేసింది. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రాయితీపై పంపిణీ చేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. దీంతో గిరిజన రైతులంతా దుక్కి పశువులతో సాగు పనులకు స్వస్తి పలికి యంత్రాలతోనే వ్యవసాయ పనులు చేస్తున్నారు. తోటి గిరిజనులు కూడా అద్దె ప్రాతిపదికన వీటిని వ్యవసాయానికి ఉపయోగించేవారు. ప్రస్తుతం 60 శాతం మేర గిరిజన రైతులంతా వ్యవసాయంలో యాంత్రీకరణపై వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం వారిని నిరాశకు గురి చేస్తోంది.
ఆది నుంచి నిర్లక్ష్యమే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ యంత్రాలు,పరికరాలు పంపిణీ జరగలేదు. పవర్ టిల్లర్లు, వీడర్లు,ట్రాక్టర్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని గిరిజన రైతులు ఎదురుచూసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కొంతమంది గిరిజన రైతులు పవర్ టిల్లర్లు, వీడర్లను అద్దెకు తీసుకువచ్చి వ్యవసాయ పనులు చేపట్టారు. మిగతా రైతులు గతంలో మాదిరిగానే పశువులతో దుక్కి, దమ్ము పనులు చేసుకున్నారు.
ఆ ఊసేదీ?
ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో కూటమి ప్రభుత్వం టిల్లర్లు, వీడర్లు, ఇతర యంత్రాల పంపిణీకి ఎలాంటి చర్యలు చేపట్ట లేదని గిరిజన రైతులు వాపోతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో చాలా ప్రాంతాల్లో దుక్కి పనులకు గిరిజన రైతులు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన టిల్లర్లు, వీడర్లే వీరికి ఆధారమయ్యాయి.
సొంతంగా కొనుగోలు
గిరిజన రైతులు ప్రైవేట్ మార్కెట్లోనే పవర్ టిల్లర్లు, వీడర్లను సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. మైదాన ప్రాంతాలతో పాటు పాడేరు, హుకుంపేట, చింతపల్లి, అరకులోయలో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉండడంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాఫీ, మిరియాల అమ్మకాలతో ఆదాయం పొందిన రైతులంతా రూ.లక్ష వరకు ఖర్చుపెట్టి వీడర్లు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది రైతులు పశువులను అమ్మి యంత్ర పరికరాలను కొంటున్నారు. వీడర్లు రూ.80వేల నుంచి రూ.లక్ష, పవర్ టిల్లర్లు రూ.2లక్షల వరకు ధరలు ఉన్నాయి. ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసి ఉంటే కొంతమేర లబ్ధి చేకూరేదని రైతులు వాపోతున్నారు.
రాయితీపై పంపిణీకి నోచుకోనివ్యవసాయ యంత్ర పరికరాలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో
లబ్ధి పొందిన గిరిజన రైతులు
నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం
గిరిజన రైతుల్లో నిరాశ
రూ.80 వేలతో వీడర్కొనుక్కున్నా
గత ఖరీఫ్లో వ్యవసాయశాఖ పవర్ వీడర్ పంపిణీ చేస్తుందని ఆశపడ్డా. ఎటువంటి ప్రకటన లేకపోవడంతో సొంత నిధులు రూ.80 వేలు వెచ్చించి ఓ స్వచ్ఛందసంస్థ సహకారంతో సొంతంగా వీడర్ను గతేడాది కొనుగోలు చేశా. వ్యవసాయ పనులకు వీడర్పైనే ఆధారపడ్డా. ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేస్తే గిరిజన రైతులకు మేలు చేకూరుతుంది.
– జన్ని రామారావు, రైతు, పాడేరు