తలమడుగు: బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. బుధవారం రాత్రి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువల అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. పశువులను తరలిస్తున్న వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని తెలిపారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. సిబ్బంది 24 గంటలు షిఫ్ట్ విధానంలో విధులు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా పారిపోయే వాహనాల సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు. రూరల్ సీఐ ఫణిదర్, తలమడుగు ఎస్సై రాధిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


