ఉట్నూర్రూరల్: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలం లక్కారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ. 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాల గదుల నిర్మాణ పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులు, పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. రాబోయే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం వరకు పనులు పూర్తి చేసి, అదే రోజు ప్రారంభోత్సవం జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు గదులు మంజూరు చేసినందుకు పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లక్కారం సర్పంచ్ రేణుక, వార్డు సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


