ఆదిలాబాద్టౌన్: మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రిమ్స్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేపల ఉత్పత్తిలో కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా అధునాతన సాంకేతిక వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనూష, మత్స్య శాఖ అధికారి మోయినొద్దీన్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మత్స్యకారులు పాల్గొన్నారు.
గ్రామీణాభివృద్ధిలో పశుపోషణే కీలకం
ఆదిలాబాద్టౌన్(బేల): గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బ లోపేతంలో పశుపోషణ కీలకమని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. బేల మండలంలోని సిర్సన్న గ్రా మంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మేలు జాతి దూడలను శాసీ్త్రయ పద్ధతిలో పెంచడం ద్వా రా పాల దిగుబడి పెరుగుతుందని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న కృత్రిమ గర్భధారణ, ఆధునిక సౌకర్యాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామారా వు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్స్వామి, అధి కారులు సాయితేజ, దీప్రతన్, సర్పంచ్ పోచక్క, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
వివరాలు పక్కాగా నమోదు చేయాలి
జనగణనలో భాగంగా ప్రతీ ఇంటి వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి అధికారులతో శుక్రవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. జనగణన సన్నాహకంలో భాగంగా ఈనెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్ఎల్బీ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ పూర్తయిన తర్వాత జూన్ 9 నుంచి ఇళ్ల జాబితాను పూర్తి చేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
జొన్నల కొనుగోలుకు సర్వం సిద్ధం..
జిల్లాలోని రైతులు సాగు చేసిన జొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. క్వింటాలు మద్దతు ధర రూ.3,699తో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతాల్లోని రైతుల సౌకర్యార్థం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ సొసైటీ పరిధిలోని భీంపూర్ డీఆర్ డిపో, తలమడుగు పరిధిలోని డీఆర్ డిపో ఝరి, భోరజ్లోని పిప్పర్వాడ రైతు వేదిక, ఇచ్చోడ సొసైటీ పరిధిలోని గుడిహత్నూర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాల, బజార్హత్నూర్లోని దహెగాం రైతువేదిక, ఉట్నూర్ సొసైటీ పరిధిలోని గాదిగూడ, నార్నూర్ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.


