గోమాత సేవలో నిమగ్నం
సాటి మనుషులను పట్టించుకోని ప్రస్తుత సమాజంలో కొంతమంది మూగజీవా లపై మానవత్వం ప్రదర్శిస్తున్నారు. వాటి భావాలను అర్థం చేసుకొని ఆకలి, దప్పికలు తీరుస్తున్నారు. ఆపదొస్తే ఆప్తులుగా నిలుస్తూ కారుణ్యం ప్రదర్శిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆదర్శంగా నిలుస్తున్న ఆయా స్వచ్ఛంద సంస్థలపై ప్రత్యేక కథనం.
– ఆదిలాబాద్
దాహార్తి తీరుస్తున్న.. గోమాత సేవా సమితి
వేసవి ఎండలకు మనుషులే అల్లాడిపోతుంటారు. మూగజీవాల పరిస్థితి చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో ఏళ్లుగా వాటి దాహార్తి తీర్చడంతో పాటు గ్రాసం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లా కేంద్రంలోని గోమాత సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ. 2010లో ఈ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ వ్యాప్తంగా పశువులు ఎక్కువగా సంచరించే ప్రదేశాలను గుర్తించి 15 నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా వేసవిలో అందులో నీటితో పాటు పచ్చిగడ్డిని సైతం అందుబాటులో ఉంచుతున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. కోవిడ్ సమయంలో ఎన్నో ఆంక్షల నడుమ గ్రాసం తీసుకువచ్చి వాటి ఆకలి తీర్చామని పేర్కొంటున్నారు. దాతలు స్పందిస్తే మరిన్ని అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు.
దాతలు ముందుకు రావాలి..
గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా మూగజీవాలకు సేవ చేస్తున్నాం. పట్టణవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేశాం. అందులో నీటితో పాటు గ్రాసం అందుబాటులో ఉంచుతున్నాం. కోవిడ్ సమయంలో సైతం వాటికి ఆహారం అందించాం. ఎవరైనా దాతలు ముందుకు వస్తే మరిన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – గణేశ్ వర్మ,
గోమాత సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు


