ఆదిలాబాద్: భారతదేశ సంస్కృతి విశ్వవ్యాప్తం అయ్యిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శంకర్ గుట్టపై వెలసిన బీరప్ప ఆలయ పునర్నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, నిధుల కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇందులో మాజీ మంత్రి జోగు రామన్న, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతం చేయాలి..
ఆదిలాబాద్: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పశ్చిమ బెంగాల్ తరహా తీర్పే ఇక్కడి ప్రజలు ఇస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా కేంద్రంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని కొలిపురా కాలనీలో వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని చేపట్టి, ప్రజలను కలుస్తూ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్ శైలజ, పార్టీ నాయకులు రవి, హన్మండ్లు, దినేష్ మటోలియా, శివ తదితరులున్నారు.


