ఆదిలాబాద్టౌన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి పోలీసులు భారీ ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి10 గంటల వరకు 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టారు. 1,558 వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు 79 మంది (డ్రంకెన్ డ్రైవ్), నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలు 61, మైనర్ డ్రైవింగ్కు సంబంధించి 9 కేసులు నమోదయ్యాయి. అలాగే అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న 200 మంది వ్యక్తుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు, ప్రజల భద్రతకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.


