కై లాస్నగర్: పట్టణంలో ఆస్తి పన్ను బకాయిలు పే రుకుపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అ మలు చేసిన ఎర్లీబర్డ్ స్కీంకు ఆదిలాబాద్ మున్సిప ల్ పరిధిలో ఆశించిన స్పందన లభించలేదు. 2026 –27 ఆర్థిక సంవత్సరానికిగాను ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ వర్తింపజేసింది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పాత బకాయిలు లేనటువంటి వారిని ఈ రాయితీకి అర్హులుగా ప్రకటించింది. గత నెల 1నుంచి అమలు చేసిన ఈ స్కీం గడువు 30వ తేదీతో ముగిసింది. అయితే పట్టణవాసులు స్వచ్ఛంద పన్ను చెల్లింపుపై అంతగా ఆసక్తి చూపలేదు. గతంతో పోల్చితే పన్ను వసూలు స్వల్పంగా పెరిగినా ఆశించిన స్థాయిలో కాకపోవడం గమనార్హం.
మున్సిపల్ పరిధిలో ఇలా..
పట్టణంలో మొత్తం 49 వార్డులున్నాయి. వీటిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి బకాయిలు లేని అసెస్మెంట్లకు సంబంధించి రూ.16.5 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. ఎర్లీబర్డ్ అమల్లో భాగంగా ఈ పన్నుల వసూలు కోసం బల్దియా అధికారులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో బిల్ కలెక్టర్, అసిస్టెంట్ బిల్ కలెక్టర్ను నియమించారు. వీరు ఉదయం, సాయంత్రం తమకు కేటాయించిన వార్డుల్లో తిరుగుతూ పన్నుల వసూళ్లకు యత్నించారు. స్కీం అమలుకు గత నెల 30వరకు గడువు ఉండగా పట్టణ వ్యాప్తంగా రూ.2.34 కోట్లు వసూలయ్యాయి. కాగా, గతేడాదితో పోల్చితే కేవలం రూ.10 లక్షలు మాత్రమే అదనంగా వసూలవడం గమనార్హం.
ఆశించిన ప్రచారం లేకపోవడమేనా..
ఈ స్కీం గడువుపై క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రచా రం లేకపోవడంతో పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది. ఐదు శాతం రాయితీపై అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం అంతగా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది మున్సిపల్ కార్యాలయంతో పాటు పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లతో ప్రత్యేక ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అలాగే మైక్తో కూడిన ఆటో ద్వారా ప్రచారం కల్పించారు. ఈ సారి అలాంటి కార్యక్రమాలేవి చేపట్టలేదు. దీంతోనే ఆశించిన మేర పన్ను వసూలు కాలేదని తెలుస్తోంది.
గతేడాదితో పోల్చితే పెరిగిన వసూళ్లు
పన్నులు సకాలంలో వసూలు చేసేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. గత నెల 30వరకు పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పించాం. పట్టణ పరిధిలో 6,673 మంది ఆస్తి పన్నును స్వచ్ఛందంగా ముందస్తుగా చెల్లించారు. గతేడాదితో పోల్చితే రూ.10 లక్షలు అదనంగా వసూలయ్యాయి.
– బి.కళ్యాణ్, బల్దియా రెవెన్యూ అధికారి
ఆదిలాబాద్ పట్టణంలోని..
అసెస్మెంట్లు : 48,448
ఆస్తి పన్ను డిమాండ్ : రూ.16.5 కోట్లు
పన్ను చెల్లించిన అసెస్మెంట్లు : 6,673
వసూలైన పన్ను మొత్తం : రూ.2.34 కోట్లు


