కై లాస్నగర్: సాంకేతికత విస్తరిస్తున్న క్రమంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యాచరణలో భాగంగా స్థానిక టీటీడీసీలో సైబ ర్ నేరాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుకున్న వారితో పాటు ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం సైబర్ మోసాలకు గురవుతున్నారని అన్నారు. బ్యాంకు ఖాతాల వివరాలు, పాస్వర్డ్, ఓటీపీ వంటివి ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పకూడదన్నారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన, జాబ్మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పొలీస్, మహిళా, శిశు సంక్షేమ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా అందించాలి
ఆదిలాబాద్టౌన్: వినియోగదారులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్లో గల విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. పలు విభాగాలను సందర్శించి రిజిస్టర్లు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అధికారుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట విద్యుత్ శాఖ ఎస్ఈ ఆర్.శేషారావు, ఏఈలు, ఇతర అధికారులు ఉన్నారు.


