మెజార్టీ మార్క్ దక్కేనా..
ఫలితాలపై ప్రధాన పార్టీల్లో టెన్షన్ ఎవరికి వారే అంచనాలు పీఠం కై వసం చేసుకుంటామంటున్న కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్, ఎంఐఎంలకు దక్కే స్థానాలపై సర్వత్రా ఆసక్తి మొదలైన క్యాంప్ రాజకీయాలు
సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ము గిసింది. బ్యాలెట్ బాక్సుల్లో ఓటు భద్రమైంది. శుక్రవారం రిజల్ట్డే.. గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా.. ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందనే విషయంలో స్పష్టతకు రాని ఏజెన్సీలు.. పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే అనేది స్పష్టం.. పూర్తిస్థాయి బలం రాకపోతే.. అవసరమైతే ఇతర పార్టీలతో పొ త్తంటున్న హస్తం.. ఏదైన పార్టీ సహకరిస్తామంటే కాదనమంటున్న కమలం, ఎక్స్ అఫీషియో ఓట్లు మాకు కీలకం అంటుండటం కూడా ఆసక్తి కలిగి స్తుంది. ఇక బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయి.. ఏఐఎఫ్బీ, స్వతంత్ర అభ్యర్థులు ఎంత మంది విజయం సాధిస్తారు.. ప్రధాన పార్టీలకు పాలకవర్గం ఏర్పాటులో వీరి పాత్ర ఏమైనా కీలకమవుతుందా.. ఇలాంటి పరిస్థితుల్లో అందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపైకి మళ్లింది. మరోవైపు ఆయా పార్టీలు తమ అంచనాల ప్రకారం ముందుకెళ్తుండటం, క్యాంపు రాజకీయాలకు తెర లేపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మెజార్టీపై ధీమా
ఆదిలాబాద్ మున్సిపాలిటీకి జరిగిన ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధిస్తామని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ 28 నుంచి 32 స్థానాలు సాధిస్తామని చెబుతుండగా, బీజేపీ 27కు పైగా గెలుస్తామని పేర్కొంటోంది. సర్వేఏజెన్సీలు మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజా ర్టీ వస్తుందనే విషయంలో అంచనాకు రాకపోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం, బీఆర్ఎస్లు ఎన్ని వార్డుల్లో గెలుపొందుతాయి, ఆయా పార్టీలు ఎక్కువ స్థానాల్లో గెలుపొందితే పాలకవర్గం ఏర్పాటులో వారి పాత్ర కీలకం కానుంది. ఒకవేళ ఈ పార్టీల మద్దతు తీసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్కు దూరంగా నిలిస్తే ఏఐఎఫ్బీ, స్వతంత్ర అభ్యర్థుల నుంచి గెలిచే వారి పాత్ర కీలకం కానుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
క్యాంప్ రాజకీయాలు షురూ..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 5గంటలకు ముగిసే ముందే ఆయా వార్డుల వారీగా ప్రధాన పార్టీలు ఏయే వార్డుల్లో గెలుస్తున్నామనే అంచనాలు వేసుకోవడం జరిగింది. కొన్ని వా ర్డుల్లో తీవ్ర పోటీ నెలకొనడం, అక్కడ ఫలితం ఎలా వస్తుంది.. ఇప్పుడు తప్పనిసరిగా గెలుస్తామని అనుకుంటున్న స్థానాలకు అక్కడ వచ్చే ఫలితాలు మరింత అదనంగా తోడవడం ద్వారా పీఠం కై వసంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదురుకావా అనే సందేహాలు కూడా పార్టీలో లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో క్యాంప్ రాజకీయాలపై బుధవారం రాత్రే ఏదైన నిర్ణయం తీసుకునే అవకాశం ఆయా పార్టీల్లో ప్రచారం సాగుతుంది. గురువారం ఉదయం నుంచే వీటికి తెరలేచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మొత్తంగా ఈ పరిణామాలు మున్సిపల్ ఫలితాల కంటే ముందు ఆసక్తిగా మారాయి.


