మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు | - | Sakshi
Sakshi News home page

మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు

Jul 6 2025 6:47 AM | Updated on Jul 6 2025 6:47 AM

మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు

మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన అనీస్‌ రైల్వేస్టేషన్‌ ఎదుట నుంచి వెళ్తున్న మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. పలువురు షీ టీంకు సమాచారం అందించగా.. అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

అడవిపంది దాడిలో ఒకరికి తీవ్రగాయాలు

ఇచ్చోడ: అడవిపంది దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని దేవుల్‌నాయక్‌ తండాకు చెందిన రాథోడ్‌ గంభీర్‌సింగ్‌ శనివారం వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నాడు. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అడవి పంది ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా తప్పించుకునే క్రమంలో జారిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గంభీర్‌సింగ్‌ను అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

సోన్‌: పురుగుల మందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాదాపూర్‌కు చెందిన సల్ల భోజవ్వ (54)కు కుమారుడు నరేశ్‌ ఉన్నారు. నరేశ్‌కు పెళ్లి చేసింది. పదేళ్ల క్రితం భర్త నరేశ్‌తో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భోజవ్వ బాధపడుతుండేది. కోడలు రావడం లేదని మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. కుమారుడు నరేశ్‌ గమనించి నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. కుమారుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు.

అనుమానాస్పదంగా యువకుడి మృతి

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి అమ్మాగార్డెన్స్‌ ప్రాంతానికి చెందిన తడక దినేశ్‌ (29) అనుమానాస్పదంగా మృతిచెందాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ నిద్రమాత్రలు లభించాయని, ఆ మాత్రలు వేసుకుని దినేశ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పట్టణ ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement