
డంపింగ్ యార్డ్ వద్ద వృద్ధురాలు
తాడేపల్లిరూరల్: పేగుబంధాన్ని మరచి ఓ కొడుకు కన్నతల్లిని అర్ధరాత్రి వేళ డంపింగ్ యార్డ్ మధ్యలో వదిలేసి వెళ్లిన సంఘటన గురువారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ బంధాలు, అనుబంధాలు మృగ్యమవుతున్నాయని చెప్పేందుకు ఈ సంఘటన వాస్తవ దర్పణం. గురువారం తెల్లవారుజాము నుంచి ఓ వృద్ధురాలు చెత్తాచెదారం మధ్య ఉండటాన్ని పారిశుద్ధ్య కార్మికులు, చెత్త ఏరుకునే వారు గమనించి బ్రహ్మానందపురం సచివాలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు వీఆర్వో విన్నయ్య సంఘటన స్థలానికి వెళ్లి వృద్ధురాలిని ఇక్కడున్నావేంటని ప్రశ్నించగా ఆమె కళ్ల వెంబడి కన్నీరు ధారలయ్యాయి తప్ప ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆ వృద్ధురాలని వీఆర్వో విన్నయ్య సచివాలయానికి తీసుకువచ్చి అల్పాహారం అందించారు. అనంతరం ఆమెను ఆప్యాయంగా పలుకరించగా ఇది నా ఖర్మ అంటూ తలబాదుకుంది. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిన్ను చక్కగా చూసుకుంటాం నీ పేరు ఏమిటని ప్రశ్నించగా తన పేరు ఎం.రామలక్ష్మి అని తెలిపింది. వారు అరగంట సేపు ఆమెతో మాట్లాడగా విజయవాడలోని గవర్నరుపేటలో తన నివాసమని, నా భర్త పేరు కృష్ణ అని, నా కొడుకు పేరు శ్రీనివాసరావు అని వివరించింది. బుధవారం రాత్రి 10 గంటలకు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లారని, చనిపోదామనుకున్నా ధైర్యం చాలలేదని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి తీసుకెళతామని చెప్పగా, చనిపోవడానికై నా సిద్ధంకాని అక్కడకు వెళ్లనని కన్నీటిపర్యంతమవ్వడం చూపరులను కలచివేసింది. తాడేపల్లి తహసీల్దార్ నాగిరెడ్డి ఆదేశాల మేరకు డోలాస్నగర్లోని మేరీ హోమ్స్లో వృద్ధురాలిని చేర్పించారు. ఈ సంఘటనపై పోలీసుల సహాయంతో విచారణ చేపట్టారు.
పారిశుద్ధ్య కార్మికుల సమాచారంతో రంగంలోకి రెవెన్యూ సిబ్బంది వృద్ధురాలిని మేరీ హోమ్స్కు తరలింపు