-
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిసిన మన్యం బిడ్డ
పచ్చని కొండ కోనల్లో.. అమాయకంగా జీవించే ఆదివాసీల బిడ్డ ఘనత సాధించింది. కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఆమె.. జాతీయ వేదికపై పసిడి పతకంతో మెరిసింది. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఖేలో ఇండియా యూత్గేమ్స్లో పాల్గొని.. బంగారు పతకాన్ని సాధించింది. తనతోటి ఆదివాసీ బిడ్డలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి.. అల్లూరి జిల్లా మన్యాన్ని మురిపించింది. ఆమే కుంజా రజిత. – కూనవరం(రంపచోడవరం) కారడవిలో కుగ్రామం కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవిలో ఉన్న కుగ్రామం రామచంద్రాపురం. రజిత స్వగ్రామం. 35 ఏళ్ల కిందట పొరుగున ఉన్న చత్తీస్గఢ్ నుంచి రజిత తండ్రి మారయ్య కుటుంబం ఇక్కడకు వలస వచ్చింది. రెక్కాడితేగాని డొక్కాడని దయనీయ స్థితి మారయ్య కుటుంబానిది. కుంజా మారయ్య, భద్రమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. చివరి సంతానమే కుంజా రజిత. భర్త చనిపోయాక కుటుంబ భారం భద్రమ్మ పైనే పడింది. అడవికెళ్లి కట్టెలు మోపు తెచ్చుకొని అమ్ముకోవడం ద్వారా కుటుంబాన్ని పోషించుకునేది. రజిత ప్రతి రోజూ 12 కిలోమీటర్లు దూరం కాలిబాటన చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి లీడ్స్ పాఠశాలలో చదువుకోవడం.. తిరిగి 12 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకునేది. అలా ఒకటి నుంచి 8 వరకు అక్కడే చదివింది. సెలవుల్లో తల్లి వెంట కట్టెలకు వెళ్లి చేదోడుగా ఉండేది. చిన్నప్పటి నుంచి పరుగు పందాలంటే రజితకు భలే ఇష్టం. పరుగులో రజితలోని వేగాన్ని ఆమె పెద్దన్న జోగయ్య గమనించాడు. స్థానిక పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాడు. పతకాల పంట 2019 అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగు విభాగంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించింది. ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీలో కాంస్యం గెలుపొందింది. జాతీయ ఓపెన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణంతో మెరిసింది. హర్యానాలో మంగళవారం జరిగిన జాతీయ ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీల్లో అండర్–20 విభాగంలో 400 మీటర్ల పరుగు పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచింది. రజిత 56.07 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం దక్కించుకుంది. ఆగని పరుగు కాటుకపల్లి పాఠశాలలో 8వ తరగతి వరకే ఉండేది. అనంతరం నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 అక్కడే పూర్తి చేసింది. ఆ సమయంలో పరుగులో శిక్షణకు బీజపడింది. నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆమె శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీయట్ చదువుతూ గుంటూరు శాప్ ద్వారా గురువులు కృష్ణ మోహన్, మైకే రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. ఓ పక్క చదువు, సాధన చేస్తూనే పోటీల్లో పాల్గొనేది. అక్కడే తన ఆటలోని బలాలు, బలహీనతలు తెలుసుకుని మరింత రాటుదేలింది. అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే అత్యుత్తమ శిక్షణ అవసరమని భావించి.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగుబండి రమేష్ను సంప్రదించింది. ఆయన శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆయన పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలోని మైత్రీ ఫౌండేషన్కు దృష్టికి తీసుకెళ్లారు. వారు ఫిజియోథెరపీ, అవసరమైన దుస్తులు, బూట్లు వంటివన్నీ అందిస్తున్నారు. ఆమె ఆటతీరు, కుటుంబ పరిస్థితి గమనించిన లెక్కల మాస్టార్ నాగేంద్ర ప్రతి నెలా కొంత మొత్తం అందజేస్తున్నారు. -
అమ్మాయిని కాళ్లతో తన్నుతూ చిత్ర హింసలు.. రంగంలోకి దిగిన సీఎం
దేశంలో మహిళలు, యువతులపై వేధింపులు, చిత్ర హింసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ గిరిజన విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హింసించాడు. కాళ్లతో తన్నుతూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారి సీఎం వరకు వెళ్లింది. దీంతో యువకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రంలో స్కూల్ యూనిఫామ్లో ఉన్న గిరిజన అమ్మాయిని ఓ యువకుడు దారుణంగా కొడుతూ, కాళ్లతో తంతుంటే.. అతని స్నేహితులు వీడియోలు తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గిరిజన బాలికపై దాడి జరిగిన వీడియోని రజనీ ముర్ము అనే సామాజికవేత్త ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో సీఎం హేమంత్ సోరేన్కు చేరింది. ఈ వీడియో ద్వారా స్కూల్ డ్రెస్ ఆధారంగా ఆ అమ్మాయి పాకూర్లోని సెయింట్ స్టానిస్లాస్ హెచ్ఎస్ హతిమారా పాఠశాలలో చదువుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో దాడి చేసిన యువకుడ్ని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పాకుర్ డిప్యూటీ కమిషనర్తో పాటు ఎస్పీని సీఎం సోరెన్ ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి పాల్పడిన యువకుడు పాకుర్ జిల్లాలోని రోలమారా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. .@pakurpolice कृपया उक्त मामले की जांच कर आरोपियों पर कार्यवाई करते हुए सूचित करें।@dcpakur @JharkhandPolice https://t.co/UO6W841jqB — Hemant Soren (@HemantSorenJMM) May 22, 2022 ఇది కూడా చదవండి: ప్రేమికుల సజీవ దహనం -
Banothu Vennela: మట్టిని కాపాడుకుందాం!
మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదగగలదు. కానీ, సారం లేని మట్టిలో ఏ విత్తనమూ మొలకెత్తదు. మనిషి స్వార్థంతో చేసే కలుషిత కారకాల ద్వారా మట్టి సారం కోల్పోతోంది. భూసారాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు తలెత్తవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బానోత్ వెన్నెల అనే గిరిజన అమ్మాయి ‘సేవ్ సాయిల్’ పేరుతో ఐదు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రకు పూనుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మారుమూల గిరిజన గ్రామపరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ వెన్నెల 60 రోజుల్లో 5 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైకిల్ యాత్ర ద్వారా వేలాది మంది రైతులకు, ప్రజలకు ‘మట్టి’ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికి దాదాపు రెండు వేల కిలోమీటర్లకు చేరువైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీదుగా ఆమె సైకిల్ యాత్ర చేస్తోంది. మే1న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించిన వెన్నెల మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల మీదుగా వెళుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ రైతులను, గ్రామ పెద్దలను కలిసి ‘మట్టిని ఏ విధంగా కాపాడాలో, ఎందుకు కాపాడాలో’ వివరించి, తిరిగి తన యాత్రను కొనసాగిస్తోంది. కలల అధిరోహణ వెన్నెల చిన్నతనంలోనే ఆమె తండ్రి మోహన్ చనిపోయాడు. తల్లి భూలి కూలి పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. వెన్నెలకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పూర్తి చేసింది వెన్నెల. తల్లి కూలి పనికి వెళితే గానీ కుటుంబం నడవని పరిస్థితి. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన వెన్నెలకు పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. ఎన్ని కష్టాలైనా సరే వాటిని సాధించాలన్న పట్టుదలతో నిరంతరం సాధన చేస్తోంది. పర్వతారోహణ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇందుకోసం కొంతకాలం భువనగిరిలో రాక్ క్లైబింగ్ స్కూల్లో మౌంటెనీర్లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే పేదరికం ఆమెకు శాపంగా మారింది. సోషల్మీడియాలో జగ్గీవాస్దేవ్ ‘సేవ్ సాయిల్’ కథనాలు విని స్ఫూర్తి పొందిన వెన్నెల భవిష్యత్తు భూసారాన్ని పెంచడానికి తన వంతుగా సమాజాన్ని జాగృతం చేయాలనుకుంది. రెండు నెలల పాటు ఒంటరిగా సైకిల్పై వెళ్లే యాత్రకు పూనుకుంది. తల్లి చెవి కమ్మలతో సైకిల్... ఒంటరి యాత్రకు తల్లిని ఒప్పించింది. కానీ, సైకిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు. తిరిగి తల్లినే బతిమాలుకుంది. తల్లి చెవి కమ్మలు అమ్మి, ఆమె ఇచ్చిన డబ్బులతో సైకిల్ కొనుగోలు చేసింది. మే 1 న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించింది. ప్రస్తుతం కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. 60 రోజుల్లో 5,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించాలని లక్ష్యం పెట్టుకుంది. రాత్రిపూట ఉండాల్సిన పరిస్థితులు, యాత్రలో సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ‘ఇప్పటి వరకు ఆరు గరŠల్స్ హాస్టల్లో రాత్రిళ్లు బస చేశాను. మిగతా చోట్ల. పోలీస్ స్టేషన్లలో ఉన్నాను. ఈ రోజు (రాత్రి) కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. 10 రోజులు యాత్ర పూర్తయ్యాక ఈషా ఫౌండేషన్ వాళ్లు కలిశారు. ఒక అమ్మాయిగా ఇలాంటి సాహసమైన పనిని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. రోజూ వంద కిలోమీటర్లు ‘రోజుకు వంద కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నాను. దారిలో రైతులు, గ్రామస్తులను కలుస్తున్నాను. భూసారం గురించి, వారు చేస్తున్న పంటల పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నాను. చాలా వరకు భూమిలో సేంద్రీయత కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. ఇది ఇలాగే తగ్గితే భవిష్యత్తులో పంటల దిగుబడులకు, మనుషుల మనుగడకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మేలుకోవాలి. 2050 నాటికి కనీసం 3 నుంచి 6 శాతం తిరిగి భూసారం పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు సేంద్రీయ పద్ధతులను అవలంభించి భూసారాన్ని కాపాడాలి. లేదంటే ఇబ్బందులు తప్పవని దారిపొడవునా కలిసిన వారికల్లా వివరిస్తున్నాను’ అని తెలిపింది వెన్నెల. నిన్నటితో దాదాపు రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తయ్యింది. ఎక్కడా ఏ ఇబ్బందులూ లేవని, గ్రామస్తుల ఇళ్లలోనే వారి ఆహ్వానం మేరకు భోజనం సదుపాయం కూడా పొందుతున్నాను’ అని తెలిపింది వెన్నెల. మట్టిబిడ్డగా మట్టి కోసం... మాది పేద కుటుంబం. అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచి పెద్ద చేస్తోంది. ఎవరెస్ట్ అధిరోహించాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించాలి. అందుకే కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు భూ సారాన్ని కాపాడమంటూ సైకిల్ యాత్ర చేపట్టా. యాత్ర ద్వారా ఎంతో మంది చైతన్యం అవుతున్నారు. మట్టి బిడ్డగా మట్టికోసం చేస్తున్న ఈ యాత్ర సక్సస్ అవుతుంది. దీని తరువాత కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్వతారోహణ మీద దృష్టి పెడతా. – బానోత్ వెన్నెల, సర్దాపూర్ తండా, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
‘జై భీమ్’ సినిమా సీన్ను రీపిట్ చేసిన తమిళనాడు యువతి..!
దేశంలోని చాలా అట్టడుగు వర్గాల గిరిజనుల నుంచి ఆడపిల్లలు ‘నీట్’ రాసి క్వాలిఫై కావడం గురించి విన్నామా? కాని తమిళనాడులో సంగవి చరిత్ర సృష్టించింది. కేవలం 10 వేల మంది ఉండే గిరిజన తెగ ‘మలసార్’ నుంచి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకుంది. ఆమె రేపో మాపో డాక్టర్ కోర్సులో చేరనుంది. అది ఒక్కటే కాదు... ఆమె తన ‘ఎస్.టి సర్టిఫికెట్’ కోసం ప్రభుత్వం కదిలే స్థాయిలో పోరాడింది. ఆమె చదువు గురించిన పట్టుదల ఇప్పుడు మొత్తం ఆ తెగకు మేలు చేసేలా కదలిక తీసుకువచ్చింది. ఆఫ్రికాను ఒకప్పుడు చీకటి ఖండం అనేవారుగాని మన దేశంలో నేటికీ అలాంటి చీకటి ఖండాల వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు కోయంబత్తూరుకు ఆనుకునే ఉన్న ఎం.నంజప్పనూర్ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ప్రభుత్వానికి తెలియదు. నగర వాసులకూ తెలియదు. ఎందుకంటే అక్కడ తరాలుగా జీవిస్తున్నది మలసార్ అనే తెగకు చెందిన గిరిజనులు కాబట్టి. కేరళ, తమిళనాడులో మాత్రమే కనిపించే ఈ తెగ మొత్తం కలిపి 10 వేల మంది ఉండరు. వీళ్లది లిపి లేని భాష. నాలుగు ఆకులు, ప్లాస్టిక్ పట్టలు కట్టి పైకప్పుగా వేసుకుని జీవించే వీరి గురించి ప్రభుత్వం ఇప్పుడు తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం ఆ తెగలో ఇంటర్ పాసైన సంగవి అనే అమ్మాయి. ‘నీట్ – 2021’లో ఆ అమ్మాయి 202 మార్కులు సంపాదించింది. ఎస్.టి కేటగిరిలో అర్హత మార్కులు 108– 121 కాగా వాటిని దాటి 202 మార్కులు తెచ్చుకోవడం విశేషమే. ఇలా మలసార్ తెగ నుంచి ఈ ఎగ్జామ్ రాసి ఈ స్థాయిలో క్వాలిఫై అయిన మొదటి అమ్మాయి సంగవే. అందుకే ఇప్పుడు తమిళనాడు గిరిజన శాఖ మంత్రితో మొదలు అధికారులు ఆమెను కలిసి అభినందిస్తున్నారు. సర్టిఫికెట్ కోసం పోరాటం ఇప్పుడు ఓ.టి.టిలో ప్లే అవుతున్న ‘జైభీమ్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో పాములు పట్టుకుని బతికే గిరిజన తెగ వాసులు తమకు ఎస్.టి సర్టిఫికెట్ ఇమ్మని, చదువుకుంటామని అధికారి దగ్గరకు వస్తారు. దానికి అధికారి ‘మీరు ఎక్కడ ఉంటారు.. మీ అమ్మా నాన్నలకు అలాంటి సర్టిఫికెట్ ఉందా... మీ కులం పేరుతో మీకు పట్టాలు ఉన్నాయా.. రేషన్ కార్డులు ఉన్నాయా.. అవి లేకుండా కుల ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వము’ అంటాడు. ఇప్పుడు సంగవి గురించి అధికారులు అదే అన్నారు. టెన్త్ వరకూ ఏ కుల సర్టిఫికెట్ లేకుండానే చదువుకున్న సంగవి ఇంటర్ కూడా అలాగే చదివి 2018లో నీట్ రాసి క్వాలిఫై కాలేదు. దాంతో పాలిటెక్నిక్లో చేరింది. ఎస్టి కోటాలో సీట్ ఇచ్చి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడానికి 10 రోజులు టైమ్ ఇచ్చారు సంగవికి. 10 రోజుల్లో ఆ సర్టిఫికెట్ను ఇవ్వడానికి అధికారులు అంగీకరించకపోవడంతో సంగవి చదువు మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దాదాపు సంవత్సరం పాటు సంగవి తన కేస్ట్ సర్టిఫికెట్ కోసం పోరాటం చేసింది. చివరకు 2020 కరోనా సమయంలో కొందరు ఎన్జివో కార్యకర్తలు వారి బస్తీకి వెళ్లినప్పుడు సంగవి గురించి విని ఆమె పోరాటాన్ని పత్రికలకు తెలియచేశారు. దాంతో ఏకంగా మంత్రే ఆమెను కలిసి సర్టిఫికెట్ అందజేశాడు. ఆ తర్వాత ఆమెకు నీట్ రాయాలని ఉందని తెలుసుకున్న ఆ ఎన్జివో కార్యకర్తలు కోచింగ్ ఏర్పాటు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు ఈ మార్కులు. తండ్రి కోరిక మలసార్ తెగలో తరతరాలుగా ఎవరూ చదువుకోలేదు. పది వరకు చదవడం గొప్ప. కాని సంగవి తండ్రి మునియప్ప ‘నువ్వు డాక్టర్వి కావాలమ్మా’ అని అనేవాడు. సంగవి ఇంటర్ చదువు ముగిశాక గత సంవత్సరం అతడు మరణించాడు. తల్లి వసంతమణికి చూపు సరిగా కనిపించదు. వాళ్లు ఉంటున్న ఇల్లు వానకు ఏ మాత్రం పనికి రాదు. అలాంటి ఇంట్లో ఉంటూ తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలని పంతం పట్టింది సంగవి. ‘నా కోరిక విని నన్ను కోచింగ్లో చేర్చారు ఎన్జివో వాళ్లు. కోచింగ్ సెంటర్ వాళ్లు మెటీరియల్ ఇస్తే నేను దానిని ప్లాస్టిక్ కవర్లలో దాచి కాపాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాన పడితే నా పుస్తకాలు తడిచిపోవడం ఆనవాయితీ’ అంది సంగవి. ఎస్టి సర్టిఫికెట్ కోసం సంగవి చేసిన పోరాటం వల్ల తమిళనాడులోని సంచార గిరిజనులకు ఒకటి రెండు రోజుల్లోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు సంగవికి మార్కులు రావడం వల్ల వారి పేటను సందర్శిస్తున్న అధికారులు ఆ పేటకు ఇళ్ల పట్టాలు ఇస్తామని రోడ్లు వేస్తామని హామీ ఇచ్చి వెళుతున్నారు. తీరని కష్టాలు నీట్లో సంగవికి వచ్చిన మార్కులకు ఎస్.టి కోటా వల్ల కాని తమిళనాడు ప్రభుత్వం ఆయా వర్గాలకు కేటాయించిన ప్రత్యేక రిజర్వేషన్ల వల్లగాని తప్పక సీట్ వస్తుందని భావిస్తున్నారు. ‘అయితే ఆ చదువు నేను చదవాలి. దానికి కొంత ఖర్చు అవుతుంది కదా. స్టాలిన్ సార్ నన్ను ఆదుకుంటారని భావిస్తున్నా’ అని సంగవి అంది. చదువు ఇంకా అందని వర్గాలు చదువే గెలుపు అని తెలుసుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయం గ్రహించారు. వారి చదువే వారిని గెలిపిస్తుంది. అలాంటి చదువు వల్లే అట్టడుగు వర్గాలు తప్పక వికాసంలోకి వస్తాయి. ‘మావాళ్లంతా ఇప్పుడు నన్ను చూసి చదువుకోవాలనుకుంటున్నారు’ అంటున్న సంగవి మాట ఆ ఆశనే కల్పిస్తోంది. -
మానవత్వం కూడా లేదా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన బాలిక అమానుషంగా అత్యాచారానికి, హత్యకు గురైతే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేంత మానవత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండాపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. తన బంధువు తండ్రి మరణిస్తే ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి వచ్చి పరామర్శించిన కేసీఆర్ బాలిక కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు. దొరలకో న్యాయం, దళిత, గిరిజనులకు మరో న్యాయమా అని నిలదీశారు. ఇక్కడి సింగరేణి కాలనీలోని బాధిత కుటుంబాన్ని రేవంత్ సోమవారం పరామర్శించారు. దేవరకొండ, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి రేవంత్ చేతుల మీదుగా రూ.1.5 లక్షలను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఘటన జరిగితే ఆయనగానీ, సింగరేణి కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న మంత్రి కేటీఆర్గానీ, నగర మంత్రులుగానీ ఎందుకు స్పందించటం లేదన్నారు. నిందితుడ్ని పట్టుకోవడం పోలీసులకు చేతకావట్లేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్కు మంత్రి కేటీఆర్, మద్యానికి సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇదిలాఉండగా, గాంధీభవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలానికి చెందిన సామాజిక కార్యకర్త గుజ్జుల మహేష్.. రేవంత్రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలసి కాంగ్రెస్లో చేరారు. కేసీఆర్ గుండెల్లో దడపుట్టించాలి ‘సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవసభ ఆరంభం మాత్రమే. గజ్వేల్ను కొల్లగొట్టాలి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు దండుకట్టి దండోరా మోగించి కేసీఆర్ గుండెల్లో దడపుట్టించాలి’ అని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ బలవంతుడు కాదని, నక్కజిత్తుల మనిషి అని విమర్శించారు. సోమవారం గాంధీభవన్లో రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏడున్నరేళ్లుగా సీఎం కేసీఆర్ చేతిలో దళితులు, గిరిజనులు దగా పడుతూనే ఉన్నారన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన కేసీఆర్.. ఆ విగ్రహం పెట్టకపోగా కాంగ్రెస్ నేత వీహెచ్ తెచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్స్టేషన్లో పెట్టారని మండిపడ్డారు. దీనిపై వీహెచ్ పోరుకు పార్టీ మద్దతు ఉంటుందని, గజ్వేల్ సభలో దీనిపై తీర్మానం చేస్తామన్నారు. ఇందిరను గెలిపిస్తే పరిశ్రమలొచ్చాయి గతంలో మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీని అక్కడి ప్రజలు గెలిపిస్తే పెద్దసంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని, లక్షల మందికి ఉపాధి కలిగిందని రేవంత్రెడ్డి అన్నారు. ‘కొండపోచమ్మ, మల్లన్నసాగర్ జలాశయాల్లో దళిత, గిరిజనుల ఆకాంక్షలు జలసమాధి అయ్యా యి. కేసీఆర్కు ఇవన్నీ తెలియాలంటే గజ్వేల్ సభను లక్షమందికి తగ్గకుండా నిర్వహించాలి. తెలంగాణలో సోనియమ్మ రాజ్యం రావాలంటే గజ్వేల్ కోటను బద్దలుకొట్టాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేడర్లో నమ్మకం వస్తోంది: జానారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేడర్కు కలుగుతోందని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు. దళితబంధుతో పాటు బీసీలకు బీసీబంధు ఇవ్వాలని మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా కేసీఆర్ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని మధుయాష్కీగౌడ్ అన్నారు. గజ్వేల్ సభను విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని దామోదర రాజనర్సింహ ఆరోపించారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, పొదెం వీరయ్య, నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్రెడ్డి, ఆర్.దామోదర్రెడ్డి, సురేశ్ షెట్కార్, సంభాని చంద్రశేఖర్, జాఫర్ జావేద్, జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్సెల్ వైస్చైర్మన్ ఎం.కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ క్రీడా వేదికపై తూగో జిల్లా ఆదివాసి బిడ్డ
కూనవరం(తూగో జిల్లా): కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు..అడవిరాముడు చిత్రం కోసం వేటూరి రాసిన ఈ గీతం ఓ స్ఫూర్తి మంత్రం..నిజమే..కొండ కోనల్లో కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఓ అడవిబిడ్డ ఎంతో కష్టపడింది. పరుగులో రాణించేందుకు అహరహం శ్రమించింది. ఇప్పుడు కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. పట్టుదల..కఠోర సాధనతో ఈ బాలిక విజయపథాన రివ్వున దూసుకెళుతోంది. కుటుంబ సభ్యులతో రజిత కుగ్రామం నుంచి.. కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురం. చుట్టూ దట్టమైన అడవి తప్ప మరేమీ కనిపించదు. 35 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వలసవచ్చింది మారయ్య కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితి. కుంజా మారయ్య..భద్రమ్మ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు ..ఇద్దరు ఆడపిల్లలు. ఇందులో ఆఖరి బిడ్డ రజిత. భర్త చనిపోయాక భద్రమ్మ అడవికి వెళ్లి కట్టెలు సేకరించడం ద్వారా పిల్లల్ని పోషిస్తోంది. రజిత రోజూ చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి చదువుకునేది. 1 నుంచి 8వ తరగతి వరకు అక్కడ చదివింది. సెలవులు ఇచ్చినప్పుడు తల్లి వెంట కట్టెలు తెచ్చి చేదోడు వాదోడుగా నిలిచేది. పరుగులో తొలినుంచి ఈమెలో వేగాన్ని పెద్దన్న జోగయ్య గమనించాడు. చిన్నా చితకా పరుగుపందెం పోటీల్లో పాల్గొని ముందు నిలిచేది. ఆగని పరుగు.. నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 తరగతులు చదివింది. అప్పుడే నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీడియెట్ చదువుతూ గుంటూరులో శాప్ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకె రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. 2019లో అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో విశేష ప్రతిభ కనబర్చింది. ఈ నెల 17న కెన్యాలోని నైరోబిలో జరిగే అండర్–20 జూనియర్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికైంది. తగిన ప్రోత్సాహముంటే దేశ కీర్తిని చాటేలా ప్రతిభ నిరూపించుకుంటానని రజిత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. -
జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి..
సాక్షి, పెద్దవూర(నల్లగొండ): మండలంలోని ఏనెమీది తండాకు చెందిన మూడవత్ హిమబిందు శనివారం హైకోర్టు ప్రకటించిన ఫలితాల్లో జడ్జిగా ఎంపికైంది. పట్టుదలతో చదివితే సాధించలేనిదంటూ ఏమీ లేదని గిరిజన బిడ్డ నిరూపింంది. ఆమె కటిక పేదరికంలో పుట్టినా ఆమె విజయానికి పేదరికం అడ్డుతగలలేదు. ఆమె 2019లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత హైకోర్టులో బార్ అసోసియేషన్ సభ్యత్వం పొంది ప్రాక్టిస్చేసింది. శనివారం హైకోర్టు ప్రకటించిన ఫలితాల్లో హిమబిందు జడ్జిగా ఎంపికైనట్లు ఆమె మంగళవారం తెలిపారు. హిమబిందు జడ్జిగా ఎంపికవ్వడంపై తల్లిదుండ్రులు, గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి పైశాచికత్వం
భోపాల్: మధ్యప్రదేశ్లో 19 ఏళ్ల యువతిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కర్రలతో చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన సొంత తండ్రి, సోదరులే యువతిపై అమానుష దాడికి పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగుచూశాయి. వివరాలు.. గిరిజన తెగకు చెందిన ఒక యువతి మూడు నెలల క్రితం ఇంట్లోవాళ్లకు చెప్పకుండా తమ బంధువుల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి యువతి తండ్రి, సోదరులు ఆమెపై కోపంతో రగిలిపోతున్నారు. కాగా సదరు యువతి తన వాళ్లను చూసేందుకు జూన్ 28న తన సొంతూరుకు వచ్చింది. ఆమె వచ్చిన విషయం తెలుసుకున్న తండ్రి ఊరి పొలిమేరలోనే అడ్డుకొని దాడికి దిగాడు. అంతటితో ఊరుకోకుండా కన్నకూతురనే జాలి లేకుండా ఆమె జట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి ఒక చెట్టుకు కట్టేశాడు. అనంతరం యువతి సోదరులు ఆమెను కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన ఫోన్లో బంధించాడు. ఆ వీడియోలో యువతిని చితకబాదుతుంటే నవ్వుతూ చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా ఆమెను కాపాడడానికి ముందుకు రాలేదు.ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఆమె తండ్రితో పాటు సోదరులను అరెస్ట్ చేశారు. -
మాయమాటలతో మభ్యపెట్టి అత్యాచారం.. షాక్కు గురై గుండెపోటు
మరిపెడ రూరల్: ఓ యువకుడు మాయమాటలతో మభ్యపెట్టి గిరిజన బాలికపై అత్యాచారం చేశాడు. అయితే.. ఊహించని షాక్కు గురైన ఆమె గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మోడు లక్పతి, వసంత దంపతుల కుమార్తె ఉష (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి లక్పతికి మహబూబాబాద్ జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద కిరాణ దుకాణం ఉంది. ఇటీవల ఆయన కాలు విరగడంతో షాపులో ఉన్న సరుకులు తీసుకురావాలని శనివారం కూతురు ఉషను పంపించాడు. అదే సమయంలో ధర్మారం గ్రామానికి చెందిన ధరంసోత్ రాజేశ్ దుకాణం వద్దకు వచ్చాడు. ఉషకు మాయమాటలు చెప్పి సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన స్నేహితుడు, సీతారాం తండాకు చెందిన శ్రీనుకు ఫోన్ చేసి నీళ్లు తీసుకురావాలని సూచించాడు. అతను తన స్నేహితుడైన శంకర్తో కలసి వచ్చే సరికి ఉష స్పృహ తప్పి ఉంది. దీంతో ముగ్గురు కలసి ఆమెను పురుషోత్తమాయగూడెంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. అతను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. ఈలోపు విషయం తెలిసి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. వెంటనే మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా.. ఉష అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు అమాయకురాలైన తమ బిడ్డకు మాయమాటలు చెప్పి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఉష తల్లిదండ్రులు లక్పతి, వసంత బోరున విలపించారు. ఈ ఘటనలో రాజేశ్తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. కాగా, ఉషపై రాజేశ్ ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడా..?, మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఉష మృతదేహాన్ని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం తొర్రూరు డీఎస్పీ వెంకటరమణతో కలసి ఘటనా స్థలం వద్ద విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాజేశ్, ఉష ఇద్దరూ గుట్టల వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. నిందితుడిపై పోక్సోతో పాటు 376, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కలెక్టర్ గౌతం కూడామృతురాలి బంధువులను ఓదార్చారు. అయితే, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, పోలీసులు నచ్చచెప్పి పంపించారు. కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విచారణ జరపండి.. ఎస్పీకి మహిళా కమిషన్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం సీతారాం తండాకు చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమరి్పంచాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. -
బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
బోథ్: దళిత బాలికపై ఓ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్లోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక 8 వ తరగతి చదువుతోంది. ఆదివారం తనను చూడటానికి వచ్చిన తల్లితో.. ఉపాధ్యాయుడు, ఇన్చార్జి వార్డెన్ వసంత్రావ్ కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని సదరు బాలిక వాపోయింది. దీంతో సోమవారం బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఉపాధ్యాయుడిని నిలదీశారు. అతడిపై దాడికి యత్నించారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. ఎమ్మార్పీఎస్ ధర్నా: విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కీచక ఉపాధ్యాయుడు వసంత్రావును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుడాల స్వామి డిమాండ్ చేశారు. వారం రోజుల్లో విచారణ చేపట్టి సంబంధిత ఉపాధ్యాయుడిపై తగు చర్యలు తీసుకుంటామని పీవో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అలాగే.. ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. విచారణ చేపట్టిన జేసీ సంధ్యారాణి: పల్లె ప్రగతిలో భాగంగా బోథ్ మండల కేంద్రంలో పర్యటిస్తున్న జేసీ సంధ్యారాణికి విషయం తెలియడంతో వెంటనే పాఠశాలకు వెళ్లి బాధిత బాలికతో పాటు, తోటి బాలికలను విచారించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రవర్తనపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవార్డు’ అందుకున్న అంజలి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దారావత్ అంజలి ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్–ఇస్కా ట్రావెల్ అవార్డు’శనివారం అందుకుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వార్షిక సమావేశం బెంగళూరులో నిర్వహించారు. జాతీ య బాలల సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇచ్చే ఇన్ఫోసిస్ ఫౌండేషన్–ఇస్కా ట్రావెల్ అవార్డు అంజలికి దక్కింది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఆదా ఈజునాథ్, ఇస్కా అధికారులు అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సీఎస్.రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంజలికి గైడ్ టీచర్గా భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు డాక్టర్ వి.గురునాథరావు వ్యవహరించారు. . -
బాలికపై లైంగికదాడి, హత్య
రాయగడ: జిల్లాలోని మారుమూల చంద్రపూర్ సమితిలో ఆదివాసీ బాలికపై ఓ మృగాడు లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. సమితిలోని చిచ్చపంగి గామానికి చెందిన ఆదివాసీ బాలికను చంద్రపూర్ సమితి కేంద్రంలోని హాస్టల్లో విడిచిపెడతానని అదే గ్రామానికి చెందిన యువకుడు నమ్మించి 21వ తేదీన బైక్పై తీసుకువెళ్లాడు. సమితి కేంద్రానికి చేరే దారిలో అదే గ్రామం అడవిలో బాలికపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేశాడు. తమ కూతురు శనివారం నుంచికనిపించడం లేదని బాలిక కుటుంబసభ్యులు చంద్రపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన కుటుంబసభ్యులు, గ్రామప్రజలు రెండు రోజులుగా చంద్రపూర్ ఆదర్శ విద్యాలయం హాస్టల్ భవనం, పోలీస్స్టేషన్ వద్ద నిరసనలు చేశారు. చంద్రపూర్లోని ప్రధాన రహదారులను దిగ్బంధించారు. అయితే గ్రామానికి చెందిన అడవిలో బాలిక మృతదేహాన్ని మంగళవారం గుర్తించిన గ్రామస్తులు బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు గుర్తించారు. బాలిక మృతదేహాన్ని గుర్తించిన ప్రజల సమాచారం మేరకు వచ్చిన పోలీసు వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకుని నిరసన మరింత ఉద్ధృతం చేశారు. అయితే పోలీసులు, సైంటిఫిక్ టీమ్, పోలీసుడాగ్తో తక్షణమే దర్యాప్తు చేసి గ్రామానికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి పట్టివేత
అన్నవరం (ప్రత్తిపాడు): వైఎస్సార్ జిల్లా సుండుపల్లె పోలీస్ స్టేషన్ పరిధి రెడ్డివారిపల్లెకు చెందిన గిరిజన బాలికపై గత నెల 27న లైంగిక దాడికి పాల్పడి పరారీలో ఉన్న అర్చకుడు రవి అలియాస్ సత్యనారాయణను తూర్పు గోదావరి జిల్లా అన్నవరం పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు ఓ కాల్ చేసుకోవాలంటూ పలువురి ఫోన్లు తీసుకుని, తన సన్నిహితుడికి ఫోన్ చేసేవాడు. అతడి ఫోన్ను ట్రాప్ చేసిన పోలీసులు చివరి కాల్ అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి వచ్చిందని గుర్తించి నిందితుడి వివరాలు అన్నవరం పోలీసులకు పంపించారు. స్పందించిన అన్నవరం పోలీసులు రైల్వే స్టేషన్కు చేరుకుని శనివారం రాత్రి 7.30కు విజయవాడ వైపు వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా రవిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సుండుపల్లె పోలీసులకు అప్పగించారు. -
వివాహితుడితో ప్రేమ.. బాలిక ఆత్మహత్య
విశాఖపట్నం,జి.మాడుగుల(పాడేరు): ఓ గిరిజన బాలిక ఆత్మహత్య చేసున్న విషయం ఆలస్యంగా తెలిసింది. మండలంలో లువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామానికి చెందిన మసాడ విలియంకుమార్(27)కు ఓ యువతితో కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. విలియం కుమార్ అదే గ్రామానికి చెందిన గిరిజన బాలిక కొండపల్లి లక్ష్మి(15)తో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఈ విషయంలో విలియంకుమార్, అతని భార్యకు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. పలుమార్లు భార్యాభర్తలు గొడవపడినట్టు గ్రామస్తులు తెలిపారు. బుధవారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం వద్దని, మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విలి యంకుమార్ భార్య...లక్ష్మిని హెచ్చరిస్తూ గొడవ పడింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ప్రియరాలు ఆత్మహత్య చేసుకోవడంతో విలియంకుమార్ కూడా గురువారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న విలియంకుమార్ను స్థానికులు పాడేరు జిల్లా స్థాయి ఆస్పత్రికి తరలించారు. విలియంకుమార్కు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్ఐ రామారావు తెలిపారు. -
గిరిజన బాలికపై లైంగికదాడికి యత్నం
మనుబోలు: ఓ గిరిజన బాలిక(10)పై నలుగురు యువకులు లైంగికదాడి యత్నానికి పాల్పడిన సంఘటన మనుబోలు కోదండరామపురం ఎస్సీవాడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సీవాడకు చెందిన ఓ బాలిక ఆడుకుంటుండగా నలుగురు యువకులు నోట్లో గుడ్డ కుక్కి తీసుకెళ్లి, అసంపూర్తిగా కట్టి వదిలేసిన ఓ ఇంట్లో అత్యాచార యత్నానికి పాల్పడుతుండగా స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో పారిపోయారు. లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డ వారిలో స్థానిక ఎస్సీవాడకు చెందిన ముగ్గురు, గూడూరుకు చెందిన ఒక యువకుడు ఉన్నట్లు సమాచారం. బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డ వారు బెదిరించి, డబ్బు ఆశ చూపి రాజీ చేసుకున్నట్లు సమాచారం. -
గిరిజన బాలికపై అత్యాచారం
బషీరాబాద్: కామ పిశాచులు చెలరేగిపోతున్నారు. మొన్న వరంగల్లో తొమ్మిది నెలల పసికూనపై అఘాయిత్యం మరవక ముందే తాజాగా జిల్లా పరిధిలోని బషీరాబాద్ మండలం బోజ్యానాయక్తండాలో మరో ఘటన వెలుగుచూసింది. పదకొండేళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్పేట మండలం ఊరెనికితండాకు చెందిన గిరిజన దంపతులు బతుకుదెరువు కోసం కొంతకాలం కిందట పూణెకు వెళ్లారు. తమ ముగ్గురు పిల్లలను చదివించడానికి బషీరాబాద్ మండలం బోజ్యానాయక్తండాలోని అమ్మమ్మ ఇంట్లో ఉంచారు. మొదటి కుమార్తె (11) 6వ తరగతి చదువుతోంది. అయితే ఈ నెల 19వ తేదీన బడికి వెళ్లిన బాలిక ఇంటికి వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన తాక్య్రనాయక్ (50) లారీ డ్రైవర్గా, నాపరాతి గనుల్లో కార్మికుడిగా పని చేస్తుంటాడు. తంబాకు (పొగాకు) తీసుకురమ్మని దుకాణానికి పంపించాడు. దుకాణానికి వెళ్లి వచ్చిన బాలికను ఇంట్లోకి లాకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని చిన్నారి ఇంట్లో చెప్పింది. వెంటనే కుటుంబసభ్యులు పుణెలోని బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు తండాకు వచ్చి జరిగిన ఘటనపై పెద్ద మనుషులతో మాట్లాడారు. అప్పటికే అత్యాచారం చేసిన తాక్య్రనాయక్ పరారయ్యాడు. జరిగిన ఘటనపై బషీరాబాద్ పోలీసులకు ఈ నెల 23వ తేదీన బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, పట్ణణ సీఐ రవి నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని సోమవారం పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మొదటి నుంచి వక్రబుద్ధి.. బోజ్యానాయక్తండాకు చెందిన తాక్య్రనాయక్ మొదటి నుంచి వక్రబుద్ధితోనే ఉన్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిసింది. మొదటి భార్య చనిపోగానే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వదిలేయడంతో అక్క కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా రెండేళ్లుగా ఇతడికి దూరంగా ఉంటోంది. దీంతో లారీ డ్రైవర్గా, నాపరతి గనుల్లో లేబర్గా పనిచేస్తు తండాలో ఉంటున్నాడని పోలీసుల విచారణలో తేలింది. -
నీట గెలిచిన నిప్పు
కింద నీటిలో చూస్తూ ధనుస్సుతోపైన మత్స్యయంత్రాన్ని కొడతాడు అర్జునుడు!నాలుగు చినుకులు పడితే నీట మునిగేఇంటిలో ఉంటూ సివిల్స్లో ర్యాంక్ కొట్టింది శ్రీధన్య. పేదరికాన్ని ఈదేందుకు చదువును లైఫ్బోట్గా చేసుకున్న ఈ అమ్మాయి ఒక కష్టం పడలేదు. అలాగని ఇష్టమైన కలను కనడమూ మానలేదు! ‘‘సాధారణంగా వరదలు అంటే అందరూ భయపడతారు. అయితే మాకు వరదలు చాలా సాధారణం. ఒకవిధంగా చెప్పాలంటే వానాకాలంలో నిత్యం ఇంట్లో తిష్టవేసుకుని కూర్చునే తిథుల్లాంటివి’’ అంటారు శ్రీధన్య తల్లి కమల. శ్రీధన్య కేరళలో ఆదివాసీ తెగ నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన మొట్టమొదటి విద్యార్థిని. ‘‘మా అమ్మాయి చదువుకునే పుస్తకాలు కనీసం రెండు సంచులైనా గత ఏడాది వచ్చిన వరదల్లో కొట్టుకుపోయాయి. అయినా సరే.. ఆమె జీవితాశయాన్ని, సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న ఆమె ఆశను అవి ఆపలేకపోయాయి’’ అని కమల కొద్దిపాటి గర్వంతో కూడిన సంతోషంతో చెబుతారు. గత ఆగస్ట్లో కేరళలో సంభవించిన వరదలు ఈ శతాబ్దిలోనే అత్యంత భయంకరమైనవిగా పేరు పొందాయి. ఈ వరద బీభత్సం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో బాటు వీరుండే ఇడియమ్వాయల్నూ కుదిపి వేసింది. గాలీవానా, దానికితోడు వరద తాకిడికి జనజీవనం అతలాకుతలమైంది. ఈ వరదల గురించి అడిగినప్పుడు కమల ముఖంలో కొద్దిపాటి విచారం ప్రస్ఫుటమయింది. ‘‘వరదలు మాకు కొత్తేమీ కాదు. ఇంచుమించు ప్రతి రుతువులోనూ వస్తుంటాయి. మా ఇంటి కప్పులు కారకుండా ప్లాస్టిక్ సామాను అడ్డుపెట్టడం తప్ప మరేమీ తేడా లేదు’’ అన్నారావిడ నిర్లిప్తంగా నవ్వుతూ. కేరళలోని ఒక వెనుకబడిన జిల్లాలో, అదీ ఆదివాసీలు అధికంగా కనిపించే ఓ కుగ్రామంలో వరదల గురించి ఇటువంటి మాటలు వినరావడం మామూలే. అయితే కమల ఈ మాటలు చెప్పారంటే, కచ్చితంగా ఆలోచించి తీరాల్సిందే. ఎందుకంటే, ఆమె సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత సాధించిన మొట్టమొదటి విద్యార్థిని శ్రీధన్య తల్లి కాబట్టి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా సెలక్టయిన 759 పేర్లు ఉన్న జాబితాలో శ్రీధన్యది నాలుగు వందల పదవ ర్యాంకు. చినుకు పడితే కప్పునుంచి నీళ్లు కారి, చిత్తడి చిత్తడి అయ్యే ఇంటిలో ఉండే శ్రీధన్య ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైందని తెలిస్తే మాత్రం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆమె తలిదండ్రులిద్దరూ రోజు కూలీలే, రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులే కావడం వల్ల తమ ముగ్గురు పిల్లలూ చాలీ చాలని గుడ్డిదీపపు వెలుగులో కళ్లు చికిలించి మరీ చదువుకుంటుంటే వారిని బాధతో చూడటం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయులు వారు. ఆ పాటి గుడ్డిదీపాలు కూడా నాలుగైదేళ్ల నుంచే ఆ ఇంటిలో వెలుగుతున్నాయి. అంతకుముందు ఆముదం దీపాలే ఆ ఇంటి చీకట్లను పారద్రోలడానికి విశ్వప్రయత్నం చేసేవి. ఆ ఇంటిలోనే పాత చీరలు, ఉన్ని ఉండలే గోడలుగా పార్టిషన్ చేసుకుని దానిని తన గదిగా మార్చుకుంది శ్రీధన్య. అందులోనే ఆమె చదువు. బాల్యంలో కూడా శ్రీధన్య, ఆమె అక్క, తమ్ముడు ముగ్గురూ కాలినడకనే బడికి వెళ్లేవారు. దాదాపు 4 కిలోమీటర్లకు పైగా నడిచి మరీ స్కూలుకి చేరుకునేవారు. టెంత్ క్లాస్ వరకూ ఆ స్కూల్లోనే చదివిన శ్రీధన్య.. ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ కూడా తన ప్రతిభతో ఉచితంగా చదువుకోగలిగింది. ‘‘ఒక్క శ్రీధన్యే కాదు, మా పిల్లలందరినీ కూడా సరస్వతీ దేవి చల్లగా చూసింది. చదువులో వాళ్లు తెచ్చుకున్న మార్కులే వాళ్లకి స్కాలర్షిప్లు సంపాదించి పెట్టేవి. వాటితోనే మా కుటుంబం నాలుగు మెతుకులు తినగలిగింది. నిజానికి మా పిల్లలని చెప్పుకోవడం కాదు గానీ, వాళ్లని చదివించడానికి మేము చేసిందేమీ లేదండీ, వాళ్లే కష్టపడి చదువుకున్నారు’’ అన్నారు శ్రీధన్య తండ్రి సురేశ్. ‘‘కాలేజీకి పంపించేందుకు నా దగ్గర పైసా కూడా డబ్బులేనివాడిని. ఇక నేను తనకి ల్యాప్టాప్ ఏమి కొనిపెడతాను? అది కూడా శ్రీధన్యే తన స్కాలర్ షిప్పుతోనే కొనుక్కుంది. కోళికోడ్లోని దేవగిరి కాలేజీలో చేరి, హాస్టల్ ఫీజు, మెస్సు బిల్లులు కూడా తనే కట్టుకుంది. ఈ ర్యాంకు సాధించిందంటే అంతా ఆమె కష్టమే. అసలు ఇప్పుడు తన రిజల్ట్ వచ్చాక అభినందనలకు ప్రతిస్పందనగా నమస్కరించాలన్నా ఆమె చేతులు సహకరించడం లేదు. ఎందుకంటే, ఆమె తన ల్యాప్టాప్కు ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో షాక్ కొట్టింది. మోచేతి దాకా కాస్త బలహీనపడింది’’ అంటూ కంటతడి పెట్టుకున్నారు సురేష్. ఇక శ్రీధన్య తమ్ముడు విశాల్.. ‘‘ఎన్ని కష్టాలున్నా వాటినుంచి బయటపడటం ఎలాగో తనను చూసే నేర్చుకున్నాను’’ అంటాడు. ‘‘తను ఎంత సున్నిత మనస్కురాలంటే, తనకు ఎంత ఇబ్బంది ఉన్నా గానీ, మేము బాధపడతామని నోరు విప్పి చెప్పుకోలేదెప్పుడూ. అంతేకాదు, తను ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది’’ అంటాడు.కురిచ్య తెగ సంప్రదాయం ప్రకారం శ్రీధన్య ఇంటి ముందు విల్లు, బాణాలు ఎక్కుపెట్టి ఉంటాయి. ఆ సమీపంలోనే స్ఫూర్తి కోసం టార్గెట్ బోర్డ్ అమర్చుకుంది శ్రీధన్య. చివరికి తన లక్ష్యాన్ని సాధించింది కృష్ణ కార్తీక కల నిజమైంది కనిష్క్ కటారియా, శ్రుతి జయంత్ దేశ్ముఖ్.. ఈ ఇద్దరు గత ఐదురోజులుగా వార్తపత్రికల్లో, టీవీల్లో కనిపిస్తున్నారు. యూపీఎస్సీ గత శుక్రవారం ప్రకటించిన 2018 సివిల్ సర్వీసు ఫలితాలలో కనిష్క్, శ్రుతి టాపర్లుగా నిలిచారు. అయితే వీళ్లకంటే ఎక్కువగా ఒక నిరుపేద ఆదివాసీ ప్రతిభామూర్తి గురించి విద్యార్థిలోకం చెప్పుకుంటోంది. ఆ ప్రతిభామూర్తి పేరు శ్రీధన్య. సివిల్స్లో 410 ర్యాంకు సాధించి కేరళలోని ఆదివాసీ తెగ నుంచి తొలిసారి ఇలాంటి ఒక విజయాన్ని సాధించిన యువతిగా శ్రీధన్య పేరు మారుమోగిపోతోంది. శ్రీధన్యది వేయనాడ్ జిల్లాలోని ఉడియంవయాల్ గ్రామం. కురిచ్య తెగ. శ్రీధన్యకు ర్యాంకు వచ్చిందని తెలియగానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెను అభినందించారు. ‘‘సామాజిక పరిస్థితులతో పోరాడి సివిల్స్లో అతి పెద్ద విజయాన్ని సాధించిన శ్రీధన్యకు అభినందనలు’’ అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. కేరళ ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి కె.కె. శైలజ.. ‘‘వేయనాడ్ ప్రజలకు ఇదొక చరిత్రాత్మక క్షణం. కేరళ చరిత్రలోనే తొలిసారిగా ఒక ఆదివాసీ అమ్మాయి సివిల్స్లో విజయం సాధించింది’’ అని ప్రశంసించారు. 25 ఏళ్ల శ్రీధన్య సాధించిన ఈ ఘనతకు అందరికన్నా ఎక్కువగా సంతోషిస్తున్నది మాత్రం ఆమె కుటుంబ సభ్యులే. మూడో ప్రయత్నంగా ఆమె ఈ విజయాన్ని సాధించారు. దినసరి కూలీ కుమార్తె అయిన శ్రీధన్య అప్లయిడ్ జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సివిల్స్ మెయిన్స్లో మలయాళ సాహిత్యాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ర్యాంకుతో తనకు గుర్తింపు రావడంపై మాట్లాడుతూ, తమ తెగలోని మిగతా అమ్మాయిలకు ఈ విజయం ఒక స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. 2016లో పీజీ పూర్తయ్యాక, శ్రీధన్య రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో ప్రాజెక్టు అసిస్టెంటుగా పని చేశారు. అప్పుడే ఆమె∙సివిల్స్ వైపు మొగ్గచూపారు. నిజానికి అది ఆమె కల కూడా. ఆ కలను మొత్తానికి నిజం చేసుకున్నారు. -
చరిత్ర సృష్టించిన వయనాడ్ యువతి
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీచేస్తున్న వయనాడ్కు చెందిన గిరిజన యువతి శ్రీధన్య సురేశ్ సివిల్స్లో ర్యాంకు తెచ్చుకున్నారు. కేరళ నుంచి ఈ ప్రతిష్టాత్మక సర్వీసుకు ఎంపికైన తొలి గిరిజన యువతిగా ఆమె గుర్తింపు పొందారు. శుక్రవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 22 ఏళ్ల శ్రీధన్యకు 410వ ర్యాంక్ దక్కింది. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు. ‘ శ్రీధన్య కష్టపడేతత్వం, అంకితభావం ఆమెకు సివిల్స్ ర్యాంకు తెచ్చిపెట్టాయి. ఆమె ఎంచుకున్న రంగంలో విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్ ఆమెతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్లో ‘ తన సామాజిక వెనకబాటుతో పోరాడి శ్రీధన్య సివిల్స్లో మెరిశారు. ఆమె విజయం భవిష్యత్తులో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది’ అని పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం వద్దనుకుని.. వయనాడ్లోని పోజుతానాకు చెందిన శ్రీధన్య మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా వదిలేసింది. కేరళ గిరిజన విభాగంలో ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ‘అత్యంత వెనకబడిన జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ గిరిజన జనాభా చాలా ఉన్నా మా నుంచి ఒక్కరూ ఐఏఎస్కు ఎంపిక కాలేదు. నా విజయం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. నా పీజీ పూర్తయిన తరువాత తొలిసారి ఓ ఐఏఎస్ అధికారిని ప్రత్యక్షంగా చూశా. ఆయన కోసం ప్రజలు ఎదురుచూడటం, సిబ్బందితో ఆయన అక్కడికి రావడం సివిల్స్ సాధించాలన్న నా చిన్న నాటి కలను తట్టిలేపాయి’ అని శ్రీధన్య గుర్తుకుచేసుకున్నారు. ఆమె కాలికట్ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్ జువాలజీలో పీజీ చదివారు. -
అంపశయ్యపై ఆదివాసీ బిడ్డ
ఒరిస్సా : ఈ దీనురాలి ఆవేదన ఏ దూర తీరాలకు చేరగలదు. ఏ భగవంతునికి ఈ దీనురాలు తన మొరను నివేదించుకోగలదు. ఈ దీనురాలి కష్టం ఏ అధికారి హృదయాన్ని కదిలించగలదు. వింతరోగంతో బాధ పడుతున్న ఈ దీనురాలిని చూస్తున్న పలువురి హృదయాలు ద్రవిస్తున్నాయి తప్ప ఆమెకు న్యాయం జరిగే మార్గం కానరావడం లేదు.నిరుపేద కుటుంబంలో జన్మించడమే పాపమైతే, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తోబుట్టువు సాయంతో జీవనం సాగిస్తున్న ఆదివాసీ బాలికకు తెలియని వింతరోగం సోకింది. దీంతో చేతులు చచ్చుబడిపోయి పొంగిపోయి ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉంది. తన అక్క గ్రామంలోని ఇళ్లలో పాచిపనిచేస్తూ జీవనం సాగిస్తుండగా పరిస్థితి విషమించడంతో పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడు కరువయ్యారని వాపోయారు. రాయగడ జిల్లా పద్మపూర్ సమితి పేరుపంగ గ్రామానికి చెందిన మీతశొబొరొ అనే బాలిక జన్మించిన తర్వాత తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆమె అక్క పాచిపని చేస్తూ సోదరిని పోషించుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల విధి వక్రించి మీతశొబొరొకు చేతికి సంబంధించిన ప్రమాదకరమైన జబ్బు సోకింది. దీనికి కటక్ పెద్దాస్పత్రిలో ఆపరేషన్ చేయిస్తే నయం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో పలువురు రాజకీయ నాయకులు, జిల్లా అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కలెక్టర్ దయదలిచి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాలికకు కావలసిన ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
మనుషులు కాదు మృగాళ్లు
నాయుడుపేటటౌన్: ఆభం శుభం తెలియని చిన్నారులను మానవ మృగాళ్లు చిదిమేస్తున్నారు. వావివరుసలు, వయసు తారతమ్య భేదాలు మరిచి లైంగిక దాడులతో దారుణాలకు తెగబడుతున్నాడు. మండల పరిధిలో రెండు రోజుల్లో రెండు దారుణాలు వెలుగుచూశాయి. నాయుడుపేట మండలంలో ఓ గిరిజన బాలికను అడవుల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. పట్టపగలు పట్టణంలో ఓ ఇంట్లో ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు కామాంతో కళ్లుముసుకుపోయి లైంగిక దాడి జరిపిన ఘటన శనివారం జరిగింది. నాయుడుపేట పట్టణంలో పడమటి వీధిలో గురుస్వామి ఆచారి అనే 58 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో గురుస్వామి ఇంటి ముందు ఆటలాడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నం చేస్తుండగా ఇంట్లోకి వెళ్లిన చిన్నారి నాయనమ్మ ఘటన చూచి కోపోద్రిక్తురాలై పాపను తీసుకుని బటయకు వచ్చి చుట్టు పక్కల వారికి చెప్పింది. దీంతో గురుస్వామిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ విషయమై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై రవినాయక్ ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గురుస్వామి చేసేది అక్రమ వ్యాపారాలే గురుస్వామి ఆచారి మద్యం షాపుల్లో పనిచేస్తూ అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నాడు. పలుమార్లు అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం అధిక రేట్లకు రేషన్ బియ్యం, కిరోసిన్తో పాటు అర్ధరాత్రి సమయల్లో మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గురుస్వామి భార్య మృతి చెందడంతో ఇంట్లోనే ఆసాంఘిక కార్యక్రమాలు సైతం జరుపుతున్నట్లు చెబుతున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఇలాంటి మానవ మృగానికి మరణ శిక్ష విధించాలని స్థానికులు కోరుతున్నారు. గిరిజన బాలికపై లైంగిక దాడి నమ్మకంగా ఇంటి వద్ద దింపుతానని మాయమాటలు చెప్పి బైక్పై తీసుకు వెళ్లి గిరిజన బాలికపై లైంగిక దాడి జరిపిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 17 ఏళ్ల బాలిక కుటుంబ పోషణ కోసం నాయుడుపేటలోని శ్రీకాళహస్తి బైపాస్రోడ్డులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్లో కోద్ది రోజుల క్రితం పనిలోకి చేరింది. ప్రతి రోజు బాలిక విధులు ముగించుకుని సాయంత్రం బస్సులో శ్రీకాళహస్తికి వెళ్తుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం విధులు ముగించుకుని శ్రీకాళహస్తికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లింది. అయితే శ్రీకాళహస్తికి వెళ్లే బస్సు వెళ్లిపోవడంతో ఆమెను నాయుడుపేటలో పనిలో చేర్చిన పెళ్లకూరు మండలం మొదుగులపాళెంకు చెందిన మల్లికార్జునకు స్నేహితుడైన అదే మండలం సీఎన్పేటకు చెందిన ఆరూరు పవన్కళ్యాణకు ఫోన్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ బాలికను మోటారు బైక్లో శ్రీకాళహస్తికి తీసుకు వెళ్లేందుకు పయనమయ్యాడు. అయితే పవన్కాళ్యాణ్ ఆ బాలికను పెళ్లకూరు మండలం శిరసనంబేడు వైపు మోటారు బైక్లో తీసుకెళ్లడంతో నిలదీసింది. అయితే అతడు షార్ట్కట్గా వెళ్లొచ్చునని చెప్పి నమ్మించి నేరుగా శిరసనంబేడు అడవుల్లోకి దౌర్జన్యంగా తీసుకువెళ్లాడు. అప్పటికీ ఆ యువతి ప్రతిఘటించినప్పటికీ ఆమెపై దాడికి పాల్పడి భయపెట్టి అరిస్తే చంపేస్తానని బెదిరించి లైంగిక దాడి చేశాడు. తిరిగి బైక్ తీసుకుని శిరసనంబేడు సమీపంలోని రహదారిపైకి వచ్చే సరికి స్థానికులు గుర్తించి బాలికను రక్షించి నాయుడుపేటలో ఉన్న పెట్రోల్ బంకు వద్దకు తీసుకువచ్చి వదిలారు. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు శుక్రవారం రాత్రి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై సీఐ మల్లికార్జునరావుతో పాటు ఎస్సై రవినాయక్ నిందితుడిపై అత్యాచారంతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రెచ్చిపోయిన మానవమృగాలు
పినపాక: ఓ గిరిజన బాలికపై 14 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు శనివారం రాత్రి ఈ విషయం విలేకరులకు తెలిపింది. పినపాక మండలం జానంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన బాలిక(15) ఎనిమిదో తరగతి చదువుతూ 4 నెలల క్రితం మధ్యలోనే మానేసింది. తల్లి వెంకటమ్మతో కలసి కూలి పనులకు వెళుతోంది. ఈ నెల 11న తన పుట్టిన రోజు సందర్భంగా చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కునేందుకు షాపు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి జానంపేట అమరారం శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వారితోపాటు మరో నలుగురు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి మరో నలుగురు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై దుగినేపల్లి పంచాయతీ శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లి అక్కడా మరో నలుగురు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను అమరారంలోని ఒక ఇంట్లో ఉంచారు. 12న ఉద యం ఐదు గంటలకు మెలకువ వచ్చిన బాలిక జానంపేట నుంచి నేరుగా భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన వెంకటమ్మ 14న ఏడూళ్ల బయ్యారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో కలిసి పినపాక మండలం పాండురంగాపురం వచ్చి విషయం తల్లికి చెప్పింది. ఈ ఘటనపై ఏఎస్ఐ కె.లక్ష్మయ్యను వివరణ కోరగా.. బాలిక ఆచూకీ కనిపించడం లేదని వెంక టమ్మ 14న ఫిర్యాదు చేసిందని, దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబాను వివరణ కోరగా కేసు వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
విద్యార్థినిని చితకబాదారు!
అమ్రాబాద్ (అచ్చంపేట): గిరిజన మినీ గురుకులంలో చదువుతున్న ఓ చిన్నారిని సిబ్బంది చితకబాదారు. ఈ సంఘటన మండలంలోని ఎల్మపల్లి గిరిజన మినీ గురుకులంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. మండలంలోని ఉప్పునుంతల(బీకే) గ్రామానికి చెందిన సింధు మినీ గురుకులంలో రెండో తరగతి చదువుతుంది. శనివారం తల్లి బుజ్జి తన కూతుర్ని పండగ కోసం తీసుకువెళ్లడానికి గురుకుల పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని వీపుపై గాయాలు కనిపించడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయమై చిన్నారి అర్ధరాత్రి మూత్రం చేసేందుకు వెళ్లగా సిబ్బంది కొట్టారని పేర్కొంది. ఎవరికైనా చెబితే మళ్లీ కొడతారేమోనని చెప్పలేదని వాపోయింది. చిన్నారి బాలిక అని చూడకుండా ఇలా చితకబాదడం ఏమిటని విద్యార్థిని తల్లి వాపోయింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. అయితే సింధు వీపుపై చితకబాదిన గాయాలు ఉన్నమాట వాస్తవమేనని ఎవరు.. ఎందుకు కొట్టారో తెలియదని హెచ్ఎం శోభ పేర్కొంది. ఈ విషయమై సీఐ రమేష్కొత్వాల్ స్పందిస్తూ ఈ విషయమై ఫిర్యాదు రాలేదని, విచారణ చేయాలని ఎస్ఐ రాంబాబుకు సూచించారు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున మన్ననూర్ బాలికల గురుకుల పాఠశాలలోకి ఓ యువకుడు ప్రవేశించిన ఘటన మరవక ముందే గురుకులంలో చిన్నారిని చితకబాదడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. -
మూగరోదనపై మౌనమేల..?
గిరిజన మూగ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాడిని కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు గాజువాకలో ధర్నా నిర్వహించి, బాధితురాలికి బాసటగా నిలిచారు. మరోవైపు కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్సీపీ మహిళా నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జరిగిన దురాగతాన్ని గోప్యంగా ఉంచేందుకు యత్నించిన యాజమాన్యాన్ని మాత్రం కావాలనే పోలీసులు తప్పించారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అగనంపూడి(గాజువాక): బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాడిని శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దళిత హక్కుల పోరాట సమితి, ఏపీ మహిళా çసమాఖ్య ప్రతినిధులు కూర్మన్న పాలెం జంక్షన్లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కేసు నీరు గార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ అధికారితోపాటు బస్సు డ్రైవర్ను అరెస్టు చేసిన పోలీసులు అసలు మైనర్ను విధుల్లో ఎలా చేర్చుకున్నారనే దానిపై మాత్రం దృష్టి సారించనేలేదు. సంఘటన జరిగిన సందర్భంలో కేసు రాజీ చేసేందుకు యాజమాన్య ప్రతినిధులే రాయబేరాలు కుదర్చినా వారిని ఎందుకు వదిలేసినట్టు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇద్దరినే అదుపులోకి తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్బీఎల్ ప్రతినిధులు కంపెనీ పరువు పోతుందని భావించి వారే సెక్యూరిటీ అధికారితో వెలగట్టి డబ్బులు సమకూర్చారని భోగట్టా. కాని వారి జోలికి వెళ్లకుండా కేవలం మైనర్తో పనులు చేయించుకోవడం (బాల కార్మికులతో పనులు చేయించుకోవడం)పై చిన్నపాటి కేసుతో సరిపెట్టారని ప్రచారం జరుగుతోంది. మైనర్ను పనిలోకి పెట్టుకోవడం ఒక తప్పయితే... మైనర్కు పాస్ మంజూరు కోసం ఆమె ఏ పత్రాలు సమర్పించింది అనే విషయాలు కూడా పరిగణలోకి తీసుకోలేదు. రాయబేరాలు మొత్తం హెచ్బీఎల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో జరిగా యని తోటి కార్మికులే చెబుతున్నారు. అలాంటప్పుడు కంపెనీ ప్రతినిధుల జోలికి ఎందుకు వెళ్లలేదు? కేసును పోలీసులు పక్కదారి పట్టించి నీ టరు గార్చడానికే ఇలా చేస్తున్నారనే అరోపణలు వెల్లువెతుతున్నాయి. సెజ్లోని కంపెనీల్లో మైనర్లు! దువ్వాడ సెజ్లోని కంపెనీల్లో కనీస వేతనాలు అమలు చేయడం లేదని, కాంట్రాక్టు కార్మికులకు అయితే రూ.3వేల కూడా చెల్లించే పరిస్థితి లేదని చెబతున్నారు. మైనర్లకు తక్కువ డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని భావించి వారిని ఈ పనులకు వినియోగిస్తున్నారని తెలిసింది. ఇటువంటి వాటిపై కార్మిక శాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అఘాయిత్యం కేసులో ముగ్గురి అరెస్ట్ అగనంపూడి (గాజువాక): గిరిజన బధిర బాలికపై జరిగిన అత్యాచారం కేసును నీరు గార్చేం దుకు ప్రయత్నించారనే ఆరోపణలు రావడంతో దువ్వాడ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దువ్వాడ పోలీస్టేషన్లో విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ రామోహనరావు వెల్లడించిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన సీహచ్.విశ్వనాథం దువ్వాడ సెజ్లోని హెచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత నెల 30న ఒంటరిగా తోట పనులు చేసుకుంటున్న గిరిజన,బధిర బాలికను సమీపంలోని బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారం చేశాడు. ఆమెను వివస్త్రను చేసి కోరిక తీర్చుకున్నాడు. అనంతరం బాధితురాలు ఏడుస్తూ పరుగు తీయడంతో ఆమెతోపాటు పనిచేస్తున్న మహిళలు విషయం తెలుసుకుని సెక్యూరిటీ సిబ్బందికి వివరించారు. అయితే విషయం బయటకు పొక్కితే కంపెనీతోపాటు సెజ్కు చెడ్డ పేరు వస్తుందని సెజ్ ఏఎస్వో ప్రకాశరావు, బస్సు యజమాని ఎం.అప్పలరాజు బాధితురాలికి లక్ష రూపాయలు చెల్లించారు. సంఘటన రోజు బాధితురాలు ధరించిన దుస్తులను తీసుకొని కాల్చేశారు. అయితే విషయం బయటకు పొక్కడంతో దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన విశ్వనాథం, కేసు మాఫీ చేయడానికి వెలగట్టిన సెజ్ ఏఎస్వో ప్రకాశ్రావు, బస్సు యజమాని ఎం.అప్పలరాజులను అరెస్టు చేసి న్యాయం స్థానంలో బుధవారం హాజరుపర్చారు. విశ్వనాథంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మానభంగం, నిర్భయ కేసులు, కంపెనీ యాజమాన్యంపై బాల కార్మికులతో పనిచేయించుకుంటున్న కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు. అలాగే సంఘటనకు సంబంధించి బాధితురాలి శీలానికి వెలగట్టిన లక్ష రూపాయలతోపాటు బస్సును సీజ్ చేశామని తెలిపారు. కేసును ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ ప్రవీణ్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో గాజువాక సీఐ ఇమ్యానుయేల్ రాజు పాల్గొన్నారు. రూ.20లక్షల పరిహారమివ్వాలి- వైఎస్సార్ సీపీ మహిళా నాయకుల డిమాండ్ పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. కేజీ హెచ్లో చికిత్స పొందుతున్న మైనరు బాలికను బుధవారం పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, నిందితుడికి సహకరించిన సెక్యూరిటీ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్బీఎల్ కంపెనీ యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘించి బాలికను ఎలా పనిలో పెట్టుకుందని ప్రశ్నించారు. మైనర్లచేత పని చేయించకూడదని తెలిసీ పని చేయిస్తున్న యాజమాన్యంపై కార్మిక శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికకు ప్రభుత్వం రూ.20లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని, అమ్మాయితో పాటు ఆమె కుటుంబానికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విశాఖ రైల్వే న్యూ కాలనీలో పట్టపగలు మతిస్థిమితం లేని మహిళపై తాగిన మైకంలో ఒక యువకుడు అత్యాచారం చేసిన సంఘటన మరువక ముందే మరొక సంఘటన జరగడం విచారకరమన్నారు. పటిష్టమైన పోలీసు వ్యవస్థ లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర అనుబంధ విభాగం నాయకులు పీలా వెంకట ధనలక్ష్మి, యువశ్రీ, శ్రీదేవి, మధులత, వెంటలక్ష్మి తదితరులు మైనర్ బాలికను పరామర్శించారు. -
శీలానికి వెలకట్టారని..
మహబూబాబాద్ రూరల్: ఓ గిరిజన యువతిని ఓ యువకుడు ఐదేళ్లుగా ప్రేమ పేరుతో వంచించి.. శారీరకంగా లోబర్చుకొని.. చివరకు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. పోలీసులను ఆశ్రయిస్తే పలుకుబడితో పోలీసు అధికారిని మేనేజ్ చేసి, ఆ పంచాయితీని పెద్ద మనుషుల వద్దకు చేరేలా చేశాడు. వారు ఆ యువతి శీలానికి రూ.లక్ష వెలకట్టారు. తన శీలానికి వెలకడతారా? అని ప్రశ్నించినందుకు పెద్ద మనుషుల సమక్షంలోనే కొందరు ఆమెను చితకబాదారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటన శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బయ్యారం మండలం సోమ్లా తండాకు చెందిన 22 ఏళ్ల గిరిజన యువతి, బయ్యారానికి చెందిన కొండూరు కార్తీక్(25) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కార్తీక్ ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోనని నిరాకరించాడు. దీంతో ఆమె బయ్యారం పోలీసులను ఆశ్రయించింది. అక్కడి పోలీసు అధికారిని కార్తీక్ మేనేజ్ చేయగా, గ్రామ పెద్దలతో మాట్లాడుకోమని చెప్పారు. దీంతో బయ్యారం మండలం సత్యనారాయణపురం మామిడి తోటలో పంచాయితీ పెట్టారు. అక్కడ యువతి శీలానికి రూ.లక్ష వెల కట్టారు. బీఈడీ వరకు చదువుకున్న గిరిజన యువతి, నా శీలానికి వెలకడతారా? అని పెద్ద మనుషులను ప్రశ్నించడంతో అక్కడున్న పెద్ద మనుషుల్లో కొందరు ఆమెను చిదకబాదారు. మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం నిద్ర మాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన వారు చేతిపై రాసి ఉన్న ఫోన్ నంబర్ ఆధా రంగా కుటుంబసభ్యులకు సమాచారమి చ్చారు. ఆమె ప్రస్తుతం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనను కార్తీక్ మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, వారు పట్టించుకొని ఉంటే, ఇంతవరకు వచ్చేది కాదని ఆ యువతి విలపించింది. ప్రియుడితోపాటు మరో ఇద్దరిపై కేసు బయ్యారం(ఇల్లందు): ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడితోపాటు అతడికి సహకరించిన ఇద్దరిపై శనివారం బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసిన కార్తీక్తోపాటు ప్రియాంకను బెదిరించి, దాడి చేసిన టీఆర్ఎస్ నాయకుడు వేల్పుల శ్రీనివాస్, అతడి భార్య పార్వతిలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గాంధీ గిరిపుత్రిక
నాటి సినిమా రెండు నెలల క్రితం... తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి. ఒక అమ్మాయి ఒక ఇంటి ముందు కూర్చుంది. మాట లేదు. పలుకు లేదు. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. లోపల ఉండాల్సిన మనుషులు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయినా ఆ అమ్మాయి కదల్లేదు. మెదల్లేదు. అక్కడే కూర్చుంది. అక్కడే నిద్రపోయింది. అక్కడే భీష్మించింది. కారణం– ఆ ఇంటి కుర్రాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తావన చేసే సరికి కాదు పొమ్మన్నాడు. అతడే కావాలని ఆ అమ్మాయి ఆ ఇంటి ముందు పోరాటానికి కూర్చుంది. ఆ పోరాటం పేరు ‘మౌన పోరాటం’. కేవలం రెండు రోజుల్లోనే మీడియా ద్వారా ఆ అమ్మాయికి మద్దతు లభించింది. మహిళలంతా ఏకమయ్యారు. పారిపోయిన ప్రబుద్ధుణ్ణి పట్టి తెచ్చి పెళ్లి చేశారు. ఈ ఘటనే కాదు. గత ఇరవై ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. వందల మంది ఆడపిల్లలు తమను మోసం చేసిన అబ్బాయిల ఇళ్ల ముందు బైఠాయించి వారిని దారికి తెచ్చుకున్నారు. తాము న్యాయం పొందారు. వీటన్నింటికి స్ఫూర్తి ఒకే ఒక సినిమా. ఆ సినిమాయే ‘మౌనపోరాటం’. 1988. ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ గ్రామంలో సబితా బధేయి అనే పదమూడేళ్ల అమ్మాయి సాధారణ బీడీ కార్మికురాలు. బీడీ వ్యాపారి సోమనాథ్ ఆ అమ్మాయిని ప్రేమించాడు. వాళ్లిద్దరి ప్రేమ సంవత్సరం పాటు సాగింది. సబిత గర్భవతి అయ్యింది. బిడ్డకు జన్మనిచ్చింది. కాని సోమనాథ్ ఆమెనూ ఆమెకు పుట్టిన బిడ్డనూ అంగీకరించలేదు. పైగా సబితను కులట అని ఆమె బిడ్డను కులట సంతానమని అవమానించాడు. తనకు జరిగిన అవమానం కంటే తన బిడ్డకు జరిగిన అవమానాన్ని సబిత సహించలేకపోయింది. వెంటనే సోమనాథ్ ఇంటి ముందు ఒడిలో బిడ్డతో బైఠాయించింది. మౌన నిరసనకు దిగింది. మొదట ఎవరూ పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. మొత్తం 14 నెలల పాటు సోమనాథ్ ఇంటి ముందు సబిత తన ‘మౌన పోరాటం’ కొనసాగించింది. అప్పుడు కదలిక వచ్చింది. పత్రికల్లో వార్తలు వచ్చాయి. జనం కదిలారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. చినికి చినికి గాలివానై చివరకు ఇది ‘లోక్ అదాలత్’ దృష్టికి వెళ్లింది. స్వయంగా జడ్జిగారే సబిత దగ్గరకు వచ్చి ఆమె కేసును విచారించారు. తీర్పు వెలువడింది. సోమనాథ్తో చట్టప్రకారం జడ్జిగారే పెళ్లి జరిపించారు. అప్పటికి ఇది ఎవరూ ఎరగని పెద్ద విజయం. ఎందుకంటే ప్రేమ పేరుతో ఆడపిల్లలను అబ్బాయిలు మోసం చేసి ఆ తర్వాత వదిలస్తే ఆ ఆడపిల్లలు ఏడ్చి వదిలేసేవారు. లేదంటే కొంత అలజడి సృష్టించి ఊరుకునేవారు. కాని పట్టుదలగా ఇలా మౌనపోరాటంతో సాధించి గెలిచిన వారు లేరు. ఒక రకంగా ఇది అహింసాయుతమైన పెద్ద ఆయుధంగా సబిత ప్రపంచానికి అందించింది. ఇది చిన్న వార్తగా ఉండగా ఉషాకిరణ్ మూవీస్ దృష్టి దీని మీద పడింది. అది సినిమా రూపు దాల్చింది. అలా 1989లో తెలుగులో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా ‘మౌన పోరాటం’. ‘మౌనపోరాటం’ కోసం కథను కొంత స్వేచ్ఛగా అల్లుకున్నారు. కథ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగినట్టుగా చూపించారు. అమాయకురాలైన గిరిజన యువతిగా యమున, ఆమెను మోసం చేసే ఫారెస్ట్ అధికారిగా వినోద్ కుమార్ కనిపిస్తారు. అయితే మైదాన ప్రాంతం నుంచి గిరిజన ప్రాంతానికి వచ్చి, గిరిజన యువతలను పెళ్లాడి, గిరిజనుల బెనిఫిట్స్ను తాము ఆరగించే గిరిజనేతర మోసగాళ్లను కూడా కోట శ్రీనివాసరావు రూపంలో ఈ సినిమా చూపించింది. గిరిజనులు ఎప్పటికీ అమాయకులే. వారిని ‘నాగరికులే’ మోసం చేస్తుంటారు. ఈ సినిమాలో యమునను మోసం చేసిన వినోద్ కుమార్ ఆమె పట్ల క్రూరంగా వ్యవహరిస్తాడు. జైలుకు పంపుతాడు. జైలులోనే యమున బిడ్డకు జన్మనిస్తుంది. తిరిగి వచ్చి అతని ఇంటి ముందే కూర్చుంటుంది. ఎవరు ఏం అడిగినా ఏం మాట్లాడదు. మౌనమే సమాధానం. మౌనమే దీక్ష. మౌనమే న్యాయం కోసం చేసే ఆక్రందన. ఇంటి ఎదురుగా ఒక మనిషి కూర్చోవడం ఆ ఇంటి మనుషులకు ఎంత అశాంతి కలిగిస్తుందో అనుభవిస్తే తెలుస్తుంది. అందుకే అత్త, ఆడపడుచు దీనిని సహించలేకపోతారు. యమునను హింసించడానికి ఆమెపై వేడి నీళ్లు పోస్తారు. బిడ్డను వదిలించుకోవడానికి ఆ బిడ్డ నోట్లో యమున కన్నుగప్పి వడ్లగింజలు పోస్తారు. వీటన్నింటిని తట్టుకుని యమున నిలబడుతుంది. తన బిడ్డను కాపాడుకుంటుంది. చైతన్యం కలిగిన కాలేజీ ఆడపిల్లలు ఈ సినిమాలో యమునకు అండగా నిలవడాన్ని చూపి దర్శకుడు ఏ వర్గాల్లో మెసేజ్ పాస్ చేయదలుచుకున్నాడో ఆ వర్గాలకు పాస్ చేస్తాడు. నిజ జీవితంలో సబితకు మద్దతు లభించినట్టే సినిమాలో యమునకు కూడా మద్దతు లభిస్తుంది. లోక్ అదాలత్ కదిలి వస్తుంది. జడ్జిగారు వినోద్ కుమార్ను ఆమెను పెళ్లి చేసుకోమని ఆదేశిస్తూ తీర్పు చెబుతారు. యమునకు కావలసింది ఈ గెలుపే. ఆమె తాళి కట్టించుకుంటుంది. అయితే అత్తగారి ఇంటిలోకి వెళ్లదు. ‘నా భర్త ఒక సామాన్యుడిగా నా గూడేనికి వచ్చినప్పుడే అతణ్ణి భర్తగా స్వీకరిస్తాను’ అని చెప్పి వెళ్లిపోతుంది. యమున అతణ్ణి అలా నిరాకరించి ఆత్మాభిమానం చాటుకోవడం కూడా ప్రేక్షకులకు నచ్చింది. చిన్న వార్తను ఆధారంగా చేసుకొని పరుచూరి బ్రదర్స్ పకడ్బందీ రచన చేసి సినిమాను ఆర్ట్ ఫిల్మ్ ధోరణిలో పడకుండా కాపాడారు. మరో విశేషం ఏమిటంటే ఇది స్త్రీ ప్రధాన చిత్రం కనుక ఈ సినిమాకు ఒక మహిళ సంగీత దర్శకత్వం వహించడం. ఆమె ఎస్.జానకి. సంగీత దర్శకురాలిగా జానకికి ఇది తొలి సినిమా. అయితే ఆమెకు సహాయంగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పని చేసి రీ రికార్డింగ్ బాధ్యతలు నెరవేర్చారు. రాళ్లపల్లి, మల్లికార్జునరావు, సుత్తి వేలు తదితరులు కొంచెం రిలీఫ్ కోసం ఉపయోగపడ్డారు. నటుడు, రచయిత సంజీవి ఈ సినిమాలో అమాయక గిరిజనుడిగా యమున ఆరాధకుడిగా ఆకట్టుకుంటాడు. మౌన పోరాటం రిలీజయ్యాక సంచలన విజయం సాధించింది. అబ్బాయిల మోసం శృతి మించిన ఆ రోజుల్లో ఈ సినిమా ఆడవాళ్లందరికీ పెద్ద ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. నటి యమునకు, దర్శకుడు మోహన గాంధీకి ఈ సినిమా మంచిపేరు తెచ్చి పెట్టింది. అంతే కాదు ఉత్తమ తెలుగు చిత్రంగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. ఈ సినిమా వచ్చిన దాదాపు పాతికేళ్లకు హిందీ దర్శకుడు రాజ్కుమార్ హిరాణి ‘గాంధీగిరి’ పేరుతో ‘లగే రహో మున్నాభాయ్’ తీశాడు. కాని దానికి ఎంతో కాలం ముందు అదే గాంధీగిరిని మౌన పోరాటంలో చూపించిన మనమే నిజంగా గొప్పవాళ్లం. దొడ్డవాళ్లం. ఇది తెలుగు సినిమా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. – కె
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
2,308 ఎకరాల్లో పంట నష్టం
మరో రెండ్రోజులు వర్ష సూచన
యువత చేతుల్లోనే దేశ పాలన
సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ మంగళం
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి
కొను‘గోల్’.. జాప్యం
● సెగ్మెంట్లలో ఓట్లు తగ్గితే ఇబ్బందులే.. ● కొత్త, పాత నాయకుల్లో కుదరని సఖ్యత ● కేడర్లో వర్గపోరు, అంతర్గత కుమ్ములాట ● ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీ ఎన్నికలు
పోస్టల్ బ్యాలెట్ గడువు పొడగింపు
శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ క్యాంపు దోహదం
పరిహారం ఇప్పించాలని రైతుల ధర్నా
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement