breaking news
Traditional crops
-
ఆ క్షేత్రమే సేంద్రియ విశ్వవిద్యాలయం!
‘నవధాన్య’.. ఈ పేరు మన దేశంలో జీవవైవిధ్యంతో కూడిన సేంద్రియ సేద్యం గురించి తెలిసిన వారికెవరికైనా చటుక్కున స్ఫురణకు వస్తుంది.. ‘నవధాన్య’ అనగానే వెంటనే మదిలో మెదిలే రూపం సుప్రసిద్ధ శాస్త్రవేత్త, సంప్రదాయ విత్తన హక్కుల పరిరక్షణ ఉద్యమకారిణి డాక్టర్ వందనా శివ.. మూడు దశాబ్దాలుగా మన దేశంలో వివిధ దేశీ ఆహార పంటలకు సంబంధించి కనీసం 6 వేల సంప్రదాయ వంగడాలను సేకరించి, కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రముఖ సంస్థ ఇది.. ‘నవధాన్య’ జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయానికి, లోతైన శాస్త్రీయ పరిశోధనలకు పట్టుగొమ్మ.. భారతీయ పాత పంటల జీవవైవిధ్య వైభవానికి తలమానికంగా విరాజిల్లుతున్న ‘నవధాన్య’, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్కు సమీపంలో, హిమాలయాల చెంతన సముద్ర తలానికి 500 మీటర్ల ఎత్తున కొలువై ఉంది.. ఇటీవల ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు డెహ్రాడూన్లోని ‘నవధాన్య’ క్షేత్రంలో పంటల వైవిధ్యాన్ని, విత్తన భాండాగారాన్ని దర్శించారు. నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ భట్తో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. నవధాన్యాలు.. అంటే తొమ్మిది రకాల విత్తనాలు. నవధాన్యాలకు మన సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. జీవవైవిధ్య పరిరక్షణకు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా డా. వందనా శివ ‘నవధాన్య’ను 1987లో డెహ్రాడూన్లో నెలకొల్పారు. 1991లో ఇది ట్రస్టుగా మారింది. వేలాది ఏళ్లుగా మన భూముల్లో విరాజిల్లుతున్న సంప్రదాయ విత్తన వంగడాలను ప్రాణప్రదంగా పరిరక్షించుకోవడం.. విత్తన జ్ఞానాన్ని పదిలపరచుకోవడం.. అంతిమంగా మన విత్తనాలతో కూడిన ఆహార స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడం.. జీవవైవిధ్య సేంద్రియ సేద్యాన్ని చిన్న రైతులకు అందించడం, వారికి సముచితమైన ఆదాయాన్ని అందించే నెట్వర్క్ను ఏర్పాటు చేయటం.. స్థూలంగా ఇవీ నవధాన్య లక్ష్యాలు. నవధాన్య ప్రధాన కేంద్రం డెహ్రాడూన్ అయినప్పటికీ దేశంలో మరో రెండు చోట్ల ఉప కేంద్రాలున్నాయి. నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ భట్ ఇలా అన్నారు.. ‘ఇప్పటికి మొత్తం 6 వేల దేశీ పంటల విత్తనాలను పరిరక్షించాం. 22 రాష్ట్రాల్లో 127 సామాజిక విత్తన నిధులను ఏర్పాటు చేశాం. వేప, బాస్మతి వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు మేధోపరమైన హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటం ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇప్పటికి సుమారు 10 లక్షల మంది చిన్న రైతులు, విత్తన సంరక్షకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సిబ్బందికి, దేశ విదేశీ కార్యకర్తలు, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చాం. 20 లక్షల ఎకరాలను సేంద్రియ వ్యవసాయంలోకి మళ్లించాం. ఈ రైతుల సాగు ఖర్చును 30%కు తగ్గించి, దిగుబడులు 3 రెట్లు పెంచాం. అంతేకాదు, 40 వేల మంది చిన్న రైతులను కూడగట్టాం. దేశంలోకెల్లా మొదటిగా ఇందుకోసం ‘ఫెయిర్ ట్రేడ్ నెట్వర్క్’ను నెలకొల్పాం. వారి సేంద్రియ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలోనే విక్రయిస్తూ, వారికి గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా చేశాం. మోహన్ సింగ్ అనే ఓ రైతు ఎకరంలో అనేక పంటలు కలిపి సాగు చేసి 2013లో రూ. 80,300 ఆదాయం పొందారు...’ అని అన్నారు. డెహ్రాడూన్లోని నవధాన్య సేంద్రియ వ్యవసాయ క్షేత్రం వయసు 30 ఏళ్లు. 45 ఎకరాల విస్తీర్ణం. చిన్న, చిన్న కమతాలలో ఎన్నో పంటలను కలిపి, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వరిలో తప్ప ఇతర పంటలన్నీ మిశ్రమ పంటలే. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు.. అన్నిటినీ కలిపే సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా అపురూపమైన ఈ వంగడాలను సాగు చేస్తూ.. విత్తనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. రైతులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను ఢిల్లీ తదితర చోట్ల విక్రయిస్తున్నారు. అమూల్యమైన ఈ దేశీ వంగడాల విత్తనాలను సంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడి విత్తన నిధిలో భద్రపరిచారు. 2017లో ఈ క్షేత్రంలో 1,722 వంగడాలున్నాయి. ఇందులో వరి 730, బాసుమతి 41, గోధుమ 212, కూరగాయలు 158, రాజ్మా 130, పప్పుధాన్యాలు 97, నూనెగింజ రకాలు 54, ఆవ 22, కొర్ర 21, మొక్కజొన్న 20, అమరంత్ 3, ఓట్స్ 19, రాగి 30, పచ్చిరొట్ట పంటలు 17, సుగంధ ద్రవ్యాలు 58, ఔషధ మొక్కలు 47.. రకాల పంటలను సాగు చేసి, ఆ విత్తనాలను విత్తన నిధిలో ఉంచారు. ఏక దళ, ద్విదళ పంటలను కలిపి సాగు చేయటం, దేశీ విత్తనాలను భద్రపరచటంతోపాటు.. సేంద్రియ సేద్యం వల్ల దిగుబడులు ఎలా ఉన్నాయి? భూసారం పెరుగుతోందా తగ్గుతోందా? రసాయనిక ఎరువులు వేసే భూముల్లో భూసారం ఎలా ఉంది? వంటి ఆసక్తికరమైన అంశాలపై శాస్త్రీయ పద్ధతిలో తులనాత్మక అధ్యయనాలు చేయటం ‘నవధాన్య’ ప్రత్యేకత. ఇందుకోసం డెహ్రాడూన్ నవధాన్య క్షేత్రంలో 2000లోనే సాయిల్ ఎకాలజీ ల్యాబ్ను నెలకొల్పి ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతున్నారు. 2014–15లో 5 రాష్ట్రాల్లో డాక్టర్ వందనా శివ ఆధ్వర్యంలో చేసిన ఒక అధ్యయనంలో రసాయనిక వ్యవసాయంలో కన్నా సేంద్రియ వ్యవసాయంలో దిగుబడులు వివిధ పంటల్లో 0.85% నుంచి 106.25% వరకు పెరిగాయని తేలింది. రసాయనిక సేద్యంలో ఒకే పంట సాగు వల్ల భూముల్లో సేంద్రియ పదార్థం నిర్దిష్ట కాలంలో 14% తగ్గిపోగా, అదేకాలంలో సేంద్రియ మిశ్రమ పంటలు సాగు చేయటం వల్ల 29–99% వరకు పెరిగిందని నవధాన్య జరిపిన మరో అధ్యయనంలో నమోదైంది. సేంద్రియ/రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే ఫలితాలను గురించి విశ్లేషించినప్పుడు భూసారం, ఉత్పాదకత, ఆదాయం వంటి విషయాల గురించే సాధారణంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే, నవధాన్య అంతటితో సంతృప్తి చెందలేదు. ఎకరానికి సేంద్రియ/రసాయనిక పద్ధతుల్లో ఎంతెంత పరిమాణంలో వివిధ రకాల పోషక పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయో కూడా సశాస్త్రీయంగా అధ్యయనం చేసి, నివేదిక(హెల్త్ పర్ యాకర్)ను ప్రచురించడం విశేషం. సేంద్రియ పద్ధతిలో మిశ్రమ పంటల సాగు(సేంద్రియ పద్ధతుల్లో పొలం అంతటా ఒకే పంటను సాగు చేయడం కూడా అనర్థమే) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికే మేలు కలగడమే కాదు.. అధిక పరిమాణంలో పోషక పదార్థాల దిగుబడి, తద్వారా ఆకలిని, పౌష్టికాహార లోపాన్ని పారదోలటం కూడా ఈ వ్యవసాయ పద్ధతితోనే సాధ్యమవుతుందని ఈ అధ్యయనం రుజువు చేసిందని చెప్పొచ్చు. ‘దేశీ వరి వంగడాల్లోనూ ఔషధ గుణాలున్నాయి. అయితే, చిరుధాన్యాలను ప్రధానాహారంగా తినటం ద్వారా పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అధిగమించవచ్చు. చిరుధాన్యాల పైనుంచి మన దృష్టి మళ్లించేందుకే బ్రిటిష్ పాలకులు వీటికి జంతువుల పేర్లతో (ఉదా.. కొర్రలకు ఫాక్స్టెయిల్ మిల్లెట్, ఉలవలకు హార్స్గ్రామ్..) పేరు పెట్టి ఉంటారు. ఇది కుట్ర పూరితంగానే జరిగింది..’ అని నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భట్ వ్యాఖ్యానించారు. జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తన పరిరక్షణ, చిన్న రైతును ఫోకస్లోకి తేవడంలో 30 ఏళ్ల క్రితమే ముందు నడచిన సంస్థగా అత్యంత శ్లాఘనీయమైన కృషి చేస్తున్న ‘నవధాన్య’ దిన దిన ప్రవర్థమానం కావాలని ‘సాక్షి సాగుబడి’ ఆకాంక్షిస్తోంది! సేంద్రియ సేద్యం భూమికి బలం! ఐదు అంతకన్నా ఎక్కువ ఏళ్ల నుంచి సేంద్రియ, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్న పొలాల్లో భూసారం స్థితిగతులు ఎలా మారాయన్న అంశంపై డెహ్రాడూన్లోని నవధాన్య జీవవైవిధ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ గత ఏడాది ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. ఈ రెండు రకాల వ్యవసాయ పద్ధతుల వల్ల ఆయా భూముల్లో సూక్ష్మజీవరాశి, పోషకాల స్థాయిల్లో ఎలాంటి మార్పులొచ్చాయో ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల్లోని వివిధ భూముల్లో శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. సేంద్రియ వ్యవసాయ భూముల సారం పెరిగిందని, రసాయనిక వ్యవసాయ భూముల్లో సారం తగ్గిపోయిందని తేలింది(శివ 2017). ఈ పట్టిక చూస్తే సేంద్రియ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం, నత్రజని, పొటాషియం తదితర పోషకాలు పెరిగిన సంగతి, రసాయనిక వ్యవసాయ భూముల్లో తగ్గిపోయిన సంగతి అర్థమవుతుంది. నేలతల్లికి వందనం.! సముద్ర తలం నుంచి 500 మీటర్ల ఎత్తులో నవధాన్య డెహ్రాడూన్ వ్యవసాయ క్షేత్రం ఉంది. జీవవైవిధ్య సేంద్రియ సేద్యం 30 ఏళ్లుగా చేస్తున్న ఆ భూమి జీవజీవాలతో సుసంపన్నంగా విరాజిల్లుతోంది. సేంద్రియ కర్బనం 1.6(తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం 0.5–0.2 మధ్యలో ఉన్నట్లు ఒక అంచనా!), సేంద్రియ పదార్థం 6.5, ఉదజని సూచిక 7గా ఉందని నవధాన్య సాయిల్ ఎకాలజీ ల్యాబ్ నిర్వాహకురాలు భువనేశ్వరి తెలిపారు. 1996లో ఇక్కడ 120 అడుగుల్లో భూగర్భ జలాలు ఉండేవి. 20 ఏళ్లలో నీటి మట్టం 40 అడుగులకు పెరిగాయి. భూమిలో సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థం పెరుగుతున్న కొద్దీ నీటì తేమను పట్టుకునే శక్తి భూమికి పెరుగుతుంది. తద్వారా నీటి వినియోగం తగ్గిపోతుంది. ఆ విధంగా ఈ క్షేత్రంలో పంటల సాగుకు 20 ఏళ్లలో నీటి వినియోగం 60% తగ్గిందని భట్ వివరించారు. నవధాన్య క్షేత్రం వరి పంట డెహ్రాడూన్ నవధాన్య క్షేత్రంలో వానపాముల విసర్జితాల కనువిందు విత్తన నిధిలో వేలాడదీసిన విత్తన కంకులు డబ్బాల్లో భద్రపరచిన విత్తనాలు డెహ్రాడూన్లోని నవధాన్య వ్యవసాయ క్షేత్రం విశిష్టతలను వివరిస్తున్న నవధాన్య ప్రతినిధి భువనేశ్వరి www.navdanya.org -
సంప్రదాయ పంటలకు స్వస్తి
వ్యవసాయంలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. ఆహార పంటలైన జొన్న, పెసర్లు, గోధుమ సాగుకు స్వస్తి చెబుతున్న రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో.. అధిక దిగుబడి.. అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఆ దిశగా ముందుకు ‘సాగు’తున్నారు. ముఖ్యంగా భూములన్నింటినీ పత్తి, సోయూబీన్ పంటలు ఆక్రమించారుు. ఫలితంగా అన్నదాతలకే ప్రస్తుతం ఇళ్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితిలో సంప్రదాయ పంటలు ప్రభను కోల్పోగా కొత్త పంటలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, లాభాలిచ్చే పంటల వైపే అన్నదాతలు మొగ్గుచూపుతుండడంతో సంప్రదాయ పంటలకు కాలం చెల్లుతోంది. అధిక దిగుబడి, లాభాలు ఇచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలు జరగకపోవడంతో పాత పంటల సాగు ఏడాదికేడాది తగ్గిపోతుండగా.. కొత్త పంటల సాగు విస్తీర్ణం అమాంతం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున సాగు చేసిన పంటలు ఇప్పుడు చిన్నబోయాయి. రబీ సీజన్లో ఐదేళ్ల క్రితం వరకు జిల్లాలో వరి, జొన్న, పెసర్లు, గొధుమ. మినుములు, ఇతర పప్పు ధాన్యాల సాగు భారీగా ఉండేది. రానురాను తగ్గిపోయూరుు. 2008-09లో లక్షా 12 వేల 23 హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన ఆహార పంటలు.. 2013-14కు వచ్చేసరికి రబీలో 61 వేల 801 హెక్టార్లకు పడిపోరుుంది. రబీలో జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 2008-9లో 18,433 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది రబీలో 10 వేల 100 హెక్టార్లకు చేరింది. ఇక చిన్నపంటలైన పొద్దుతిరుగుడు, మిరప, నువ్వులు, వేరుశెనగ, ఉల్వలు, ఉల్లి పంటలు సైతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. నేటి మొక్కజొన్న, పత్తి.. రేపటి సోయాదే.. ఒకప్పుడు జిల్లాలో నామమాత్రంగా సాగైన పత్తి, సోయాబీన్, వరి పంటలపై రైతుల్లో మోజు పెరిగింది. తక్కువ వ్యవధిలో అధిక దిగుబడి, రాబడి ఇస్తుండడంతో రైతులు మూకుమ్మడిగా ఈ పంటల సాగుకే కట్టుబడిపోయారు. బీటీ విత్తనాల రాకతో పత్తి సాగు అమాంతం పెరిగింది. ఖరీఫ్, రబీలో 2008-09లో 2,82,860 హెక్టార్లలో సాగైన పత్తి ఖరీఫ్ 2013 నాటికి 3 లక్షల 10 వేల హెక్టార్లకు పెరిగడమే ఇందుకు నిదర్శనం. సోయాబీన్ 95,895 హెక్టార్లకు గాను లక్ష 13 వేల హెక్టార్లకు చేరింది. జొన్న పంట స్థానాన్ని సోయాబీన్ ఆక్రమించగా.. పప్పు దినుసులు, నూనె గింజల స్థానంలో పత్తి పంట చొచ్చుకొచ్చింది. రెండేళ్లుగా జిల్లాలో సోయా చిక్కుడు సాగు పెరుగుతుండడంతో.. భవిష్యత్తులో భారీ స్థాయిలో ఈ పంటను సాగుచేసే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పప్పుదినుసుల్లో కంది మాత్రమే ఆదరణకు నోచుకుంటోంది. -
‘కంది’పోయింది
యర్రగొండపాలెం, న్యూస్లైన్: కంది పంట విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. ఖర్చులు పెరగడం, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటంతో ఈ పంటను పండించేందుకు రైతులు అంతగా సుముఖత చూపడంలేదు. గతంలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న మెట్ట పొలాలు కందితో కళకళలాడుతుండేవి. ప్రస్తుతం కంది పంట ఎక్కువగా కనిపించడంలేదు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిలతో పాటు పండ్ల తోటలు పెంచేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కంది పంటకు ఎకరాకు దాదాపు రూ 10 వేల వరకు ఖర్చవుతుంది. ఈ పంట వేసిన నాటి నుంచి వర్షం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. చీడపీడల నుంచి కాపాడుకునేందుకు పురుగు మందులు కొట్టాలి. అడవి పందుల బెడద నుంచి కాపాడుకోవాలి. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటకు నష్టం వాటి ల్లుతోంది. ఇంత కష్టపడినా ఎకరాకు రూ 20 వేలకు మించి ఆదాయం రావడం లేదు. ఖర్చులు పోను రైతులకు మిగిలేది రూ 10 వేలు మాత్రమే. కంది విరగపండినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. పత్తి, మిర్చి పంటలు, పండ్ల తోటల పరిస్థితి కంది పంట పండించినట్లు ఉండదు. పెట్టుబడులు పెట్టిన కొద్దీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది 1,50,338 ఎకరాల్లో పండించాల్సి ఉండగా లక్ష ఎకరాల్లో పంట విత్తుకున్నట్లు అధికారిక సమాచారం. అంటే 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట తగ్గింది. వచ్చే ఖరీఫ్లో ఈ విస్తీర్ణం మరింతగా తగ్గే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు తెలిపారు. వాణిజ్య పంటలైన పత్తి 1,18,756 ఎకరాల సాధారణ విస్తీర్ణానికిగాను దాదాపు 2 లక్షల ఎకరాలు, మిరప 1,22,300 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, 2 లక్షల 680 ఎకరాల్లో పంటలు పండించారు. వీటికి తగినట్లే పండ్ల తోటల విస్తీర్ణం పెరిగింది. బొప్పాయి 2వేల ఎకరాలకు గాను 5 వేల ఎకరాలకు పెరిగింది. బత్తాయి, అరటి తోటల విస్తీర్ణం కూడా పెరిగాయని ఆ శాఖాధికారులు తెలిపారు. పత్తి పంటను ఖరీఫ్ ప్రారంభంలో విత్తుకున్న రైతులకు కనక వర్షం కురిపించింది. క్వింటా దాదాపు రూ 7వేల వరకు పలికింది. ప్రస్తుతం అంత ధర లేకున్నా రైతు పెట్టిన పెట్టుబడులకు రెండింతల ఆదాయం వచ్చింది. పత్తి పంటకు ఎకరాకు దాదాపు రూ 20 వేల వరకు ఖర్చవుతుంది. 15 నుంచి 20 కోతల వరకు పత్తి వస్తుంది. మొదటి, రెండు కోతల్లోనే పెట్టిన పెట్టుబడులు పోను రైతుకు ఆదాయం లభిస్తుంది. మిరప పంటకు పెట్టుబడులు పెట్టే కొద్దీ ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇటువంటి పంటల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ పంటల విస్తీర్ణం తగ్గుతోంది : శ్రీనివాసరావునాయక్, వ్యవసాయాధికారి రైతులు వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. సంప్రదాయ పంటలైన కంది, సజ్జ, ఆముదం విస్తీర్ణం తగ్గిపోయింది. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ పంటల విస్తీర్ణం మరింతగా తగ్గవచ్చు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు చెరువులు నిండి, అలుగులు పారాయి. భూగర్భ జలాలు పెరగడం వలన బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. ఈ కారణంతో వాణిజ్య పంటల విస్తీర్ణం మరింతగా పెరగొచ్చు.