breaking news
telecom firms
-
భారతి టెలికాంలో సింగపూర్ టెలీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ సింగ్టెల్ రెండు దేశాల టెలికాం దిగ్గజాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే సింగ్ టెల్ థాయ్ టెలికాం సంస్థ ఇన్ టచ్ హోల్డింగ్స్ , ఇండియాకు చెందిన భారతి టెలికం లిమిటెడ్ కంపెనీల్లో సుమారు రెండు బిలియన్ల డాలర్లతో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, థాయ్ లాండ్ టెలికాం మార్కెట్ పై భారీగానే ఆశలు పెట్టుకున్న సంస్థ ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పాగా వేయాలనే దాని వ్యూహంలో భాగంగా మొత్తం 1.8 మిలియన్ డాలర్స్ తో డీల్ కుదుర్చుకుంది. ఇన్ టచ్ లో 21 శాతం, భారతి ఎయిర్టెల్ సొంతమైన భారతి టెలీలో 7.39 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్టు సింగపూర్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో సింగ్ టెల్ పేర్కొంది. సింగె టెల్ కొనుగోలు చేస్తున్న భారతి టెలీవాటాల విలువ రూ. 4,400 కోట్లకు పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తికానుందని తెలిపింది. అంతర్గత నగదు, స్వల్పకాలిక రుణాల ద్వారా ఈ వాటాలను హస్తగతం చేసుకోనున్నట్లు సింగ్ టెల్ తెలిపింది. ఈ రెండు లావాదేవీల ద్వారా రెండు కంపెనీల్లోతమ పెట్టుబడుల వృద్ధికి, తద్వారా ఆర్థిక వృద్ధికి భారీ అవకాశాలున్న రెండుదేశాల్లోతమ కార్యకలాపాల వృద్ధి సాధ్యపడుతుందని భావిస్తున్నామని సింగ్టెల్ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చువా సాక్ చెప్పారు. ఈ రెండుదేశాల్లోని యువత జనాభా వివరాలను ఉదాహరించిన ఆమె తమ టెలికాం వ్యాపారానికి సానుకూలమైన అంశమని పేర్కొన్నారు. ఇది వెల్ ప్యాకేజ్డ్ డీల్ అని నోమురా బ్యాంక్ వ్యాఖ్యానించింది. సింగ్టెల్ ఆదాయాలకు బూస్ట్ ఇస్తుందని, కానీ థాయ్ మరియు భారత మార్కెట్లలో ఎల్లప్పుడూ నిశ్చితంగా ఉండవనేది గమనించాలని తెలిపింది. మరోవైపు సింగ్ టెల్ భారతి టెలీలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేసిందన్న వార్తలతో మార్కెట్లో షేరుకు డిమాండ్ పెరిగింది. 2 శాతానికి పైగా లాభపడింది. అయితే ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని థాయిలాండ్ స్టాక్ ఎక్సేంజీ తెలపగా , దీనిపై వ్యాఖ్యానించడానికి భారతి ఎయిర్ టెల్ నిరాకరించడం విశేషం. -
ప్రైవేటు కంపెనీలకూ ఇక కాగ్ ఆడిట్
న్యూఢిల్లీ: ఆదాయ పంపిణీ ప్రాతిపదికన సహజ వనరులను వినియోగించుకుంటున్న ప్రైవేటు కంపెనీలు కాగ్ పరిధిలోకి వస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. టెలికం కంపెనీల (టెల్కోలు) ఖాతాల ఆడిట్కు కాగ్ను ఆనుమతిస్తున్నట్లు తెలిపింది. తమపై కాగ్ ఆడిట్లు నిర్వహించరాదంటూ టెల్కోలు దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్ సారథ్యంలోని ధర్మాసనం గురువారం కొట్టివేసింది. ‘ఆదాయ పంపిణీ ప్రాతిపదికన ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు కంపెనీల అకౌంట్లపై కాగ్ తనిఖీ తప్పనిసరి. అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వానికి నష్టం చేకూర్చకుండా చూడడానికి ఇది అవసరం. స్పెక్ట్రమ్ వంటి జాతి సంపదను వినియోగించుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా దేశ ప్రజలకు, పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి..’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘భారత ప్రభుత్వం తన వనరులను ఏ విధంగా వినియోగించుకుంది, లెసైన్సు ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీలు మొత్తం వసూలయ్యాయా, లెసైన్సు ఒప్పందం ప్రకారం ఆడిట్ను కేంద్రం సరిగ్గా నిర్వహించిందా అనే అంశాలను కాగ్ పరిశీలించగలదు. జాతి ప్రయోజనాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత. సహజ వనరులను దేశ ప్రయోజనాల దృష్ట్యానే వినియోగించాలి తప్ప ప్రైవేటు రంగ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు. ప్రభుత్వం కూడా సహజ వనరులను పౌరుల కోసం కాపాడాలి తప్ప వాణిజ్య అవసరాలకు వినియోగించకూడదు. ప్రజా ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపే వనరులను ప్రభుత్వం ప్రైవేటు రంగానికి బదిలీ చేయజాలదు...’ అని కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. టెలికం కంపెనీల అకౌంట్లను కాగ్ ఆడిట్ చేయవచ్చంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారతీయ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ల సంఘం (ఏయూటీఎస్పీ), సెల్యులర్ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ), ఇతర అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.