breaking news
t congress MLAs
-
ఎందుకిలా జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆ పార్టీ అధిష్టానం పట్టించుకుంటోందా? గత 4–5 నెలలుగా ఒక్కొక్కరుగా చేజారుతున్న ఎమ్మెల్యేల్లో కనీసం ఎవరినైనా పిలిపించి మాట్లాడిందా? వారికి తామున్నామని భరోసా కల్పించే ప్రయత్నం చేసిందా? 12 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లి ఏకంగా పార్టీ శాసనసభాపక్షాన్నే విలీనం చేసినా రాష్ట్ర నాయకత్వానికి ధీమా వచ్చేలా ఏమైనా చర్యలు తీసుకుంటోందా? అంటే లేదనే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. కారణమేదైనా తెలంగాణ కాంగ్రెస్ను హైకమాండ్ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హైకమాండ్ వ్యవహార శైలినిబట్టి చూస్తే రాజకీయంగా ఎన్నో ఆశలతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా రెండుసార్లు ఘోర పరాభవాన్ని రుచి చూపించిన రాష్ట్రం విషయంలో చేతులెత్తేసిందా అనే అనుమానం పార్టీ నేతల్లో కలుగుతోంది. నేతల్లో భరోసా కల్పించకపోవడం వల్లే... పార్టీపై భరోసా లేకుండా పోతోందని టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెబుతుంటే మరి భరోసా లేనప్పుడు పార్టీ టికెట్ ఎలా తీసుకున్నారని ప్రశ్నించడమే తప్ప పార్టీలో వారికి అవసరమైన భరోసాను కల్పించడంలో కూడా టీపీసీసీ నాయకత్వం విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక నేతల పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీ పెద్దలు కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించకపోవడంతో పార్టీ నుంచి వెళ్లాలనుకునే వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో సమావేశమై అందరిలో భరోసా కల్పిస్తారని చెప్పినా అది జరగలేదు. హైకమాండ్ దృష్టికి వెళ్తున్నాయా..? పార్టీ రాష్ట్రశాఖలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్ దృష్టికి వెళ్లడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేల విషయాన్ని ఆదిలోనే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకమాండ్తో రాష్ట్ర పార్టీని సమన్వయం చేయడంలో అధిష్టానంపక్షాన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న ఆర్.సి.కుంతియా విఫలమయ్యారనే విమర్శలు కూడా వస్తున్నాయి. పూర్తిగా హైదరాబాద్కే పరిమితమైన ఆయన ఎప్పటికప్పుడు హైకమాండ్తో టచ్లోకి వెళ్లకుండా వ్యవహారాలను నాన్చుతున్నారని అంటున్నారు. ప్రతి విషయంలోనూ ఇదే ధోరణితో ఆయన మొదటి నుంచీ వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర పార్టీ విషయంలో హైకమాండ్ను ప్రభావితం చేసే స్థాయిలో సమన్వయం చేయడం లేదనే విమర్శలు కుంతియాపై వస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్లో ఆయన చొరవ తీసుకోకపోవడం, హైకమాండ్కు సకాలంలో చెప్పకపోవడం, టీపీసీసీ నాయకత్వానికి మార్గదర్శనం చేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు. ముందే మేలుకొని ఉంటే... వాస్తవానికి ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోశ్, ప్రభాకర్ కాంగ్రెస్ శాసనమండలిపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చిన రోజే టీపీసీసీ నాయకత్వం, ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారి ఉండేది కాదనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. ఒక జాతీయ పార్టీ తరఫున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు పార్టీ అనుమతి లేకుండా సమావేశం కావడం, సీఎల్పీ పేరుతో తీర్మానాలు చేయడం సాంకేతికంగా చెల్లవనే వాదనను బలంగా తీసుకెళ్లడంలో విఫలం కావడం, ఈ ప్రయత్నాన్ని ఎదుర్కొనే క్రమంలో కనీస పట్టుదల లోపించడంతో ఇప్పుడు అసెంబ్లీలో వెనుక బెంచీల్లో కూర్చోవాల్సి వస్తోందని పార్టీ నేతలు వాపోతున్నారు. మండలి సభ్యులు చేసిన తీర్మానంపై పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం ఈ పరిణామాన్ని ఢిల్లీ వరకు తమ పార్టీ నేతలు తీసుకెళ్లారో కూడా అర్థం కాలేదని, అదే జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతోంది. పార్టీలో ఏం జరిగినా హైకమాండ్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదని ఆయన వాపోయారు. ఇప్పుడు పార్టీ తరఫున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మరో పార్టీలోకి వెళ్లినా కనీసం పట్టించుకోలేదని, ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమేనని, హైకమాండ్ వెంటనే తాజా పరిణామాలపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ శాసనసభాపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. శాసనసభను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ అసెంబ్లీ నిబంధన 168 కింద నోటీసును స్పీకర్ కు అందజేసింది. 2016 మార్చి 29 న శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్ మెంట్ పై సభను తప్పుదారి పట్టించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్ నాటికి మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లిస్తామని సభకు సీఎం హామీ ఇచ్చారని ఆ నోటీసులో గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు ప్రతి నెలా చెల్లింపులు చేస్తామని సభలో చెప్పారని, అయితే ఈ నెల 4 వ తేదీన ఇదే అంశంపై కేసీఆర్ సభలో మాట్లాడుతూ, వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం సాధ్యం కాదని చెప్పారని, గతంలో చెప్పిందానికి ఇప్పుడు చెబుతున్నదానికి పొంతన లేదన్నారు. ఈ రకంగా శాసనసభను ముఖ్యమంత్రి తప్పుదారి పట్టించారని స్పీకర్ కు అందజేసిన నోటీసులో వారు పేర్కొన్నారు. ఈ నోటీసుపై టీ కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత కె. జానారెడ్డి ఎమ్మెల్యేలు జి. చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, ఎన్ పద్మావతీ రెడ్డి, వంశీచంద్ రెడ్డి తదితరులు సంతకాలు చేశారు. -
'తెలంగాణ... సామంతరాజులా వ్యవహరించింది'
హైదరాబాద్ : గోదావరి నదిపై తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, చిన్నారెడ్డి స్పందించారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లో జీవన్రెడ్డి, చిన్నారెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్ట్ ఎత్తు152 మీటర్ల అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి లాభం కలిగి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గడం వల్ల రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు మాత్రమే మేలు జరుగుతుందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం చక్రవర్తిలా వ్యవహరిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం సామంతరాజులా వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ను వారు డిమాండ్ చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి రంగారెడ్డి జిల్లాను తొలగించి... మెదక్ వరకే పరిమితం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ వల్ల కూడా రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి న్యాయం జరగిందన్నారు. ప్రాణిహిత - చేవెళ్ల పాత డిజైన్ ప్రకారం చేపడితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని జీవన్రెడ్డి, చిన్నారెడ్డి చెప్పారు.