breaking news
Stable Outlook
-
భారత్ ఐటీ సేవల వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎకానమీలు ఎదుర్కొంటున్న సవాళ్లు మధ్యకాలానికి భారతీయ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధిని నిరోధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ పరిశోధనా నివేదిక ఒకటి తెలిపింది. నివేదిక ప్రకారం, భారత్ ఐటీ సేవల పరిశ్రమ అమెరికా మార్కెట్ నుండి 60–65 శాతం ఆదాయాన్ని, అలాగే యూరోపియన్ మార్కెట్ నుండి 20–25 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఈ కీలక ఆపరేటింగ్ మార్కెట్లలో నియంత్రణాపరమైన మార్పులు భారత్ ఐటీ పరిశ్రమకు ప్రతికూలంగా ఉంటాయి. నివేదికాంశాలను ఐసీఆర్ఏ అసిసెంట్ వైస్ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ దీపక్ జట్వానీ వెల్లడించారు. ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► సవాళ్లు ఉన్నప్పటికీ, ఐటీ రంగం అవుట్లుక్ను ‘స్టేబుల్’గానే ఉంచడం జరుగుతోంది. పలు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం దీనికి నేపథ్యం. ► ఐటీ కంపెనీలకు కీలకమైన విభాగాల్లో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇ న్సూరెన్స్) ఒకటి. ఈ విభాగంలో వృద్ధి ఇటీవలి త్రైమాసికాల్లో ఇతర విభాగాల కంటే ఎక్కువగా పడిపోయింది. బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలు భారీగా పెరక్కపోడానికి ఇదీ ఒక కారణమే. ► ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, తయారీ, ఆరోగ్య సంరక్షణ విభాగాల కన్నా తనఖా, రిటైల్ రంగాలు ప్రభావింతం అయ్యే అవకాశం ఉంది. ► పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల వలసలతో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీనితో డిమాండ్–సరఫరాల మధ్య వ్యత్యాసం కనబడుతోంది. ప్రత్యేకించి డిజిటల్ టెక్ విభాగంలో ఈ సమస్య ఉంది. -
అంతర్జాతీయ సవాళ్లతో భారత్కు భయం అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరిస్థితుల వంటి అంశాలు భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు విఘాతం కలిగించకపోవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో పేర్కొంది. దేశ రేటింగ్ విషయంలో ‘స్టేబుల్ అవుట్లుక్’ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం ఎకానమీ పురోగమిస్తే, 2022–23లో ఇది 7.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. రానున్న 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.3 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. భారత్కు మూడీస్ ప్రస్తుతం దిగువస్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీఏఏ3’ హోదాను ఇస్తోంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ‘చెత్త’ రేటింగ్కన్నా ఇది ఒక మెట్టు ఎక్కువ. గత ఏడాది అక్టోబర్లో రేటింగ్ అవుట్లుక్ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’క మార్చింది. తాజాగా మూడీస్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► భారతదేశం క్రెడిట్ ప్రొఫైల్... పలు స్థాయిల్లో పటిష్టతలను ప్రతిబింబిస్తోంది. పెద్ద, వైవిధ్యభరిత, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ, అధిక వృద్ధి సామర్థ్యం, అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోగలిగిన పరిస్థితులు, ప్రభుత్వ రుణానికి స్థిర మైన దేశీయ ఫైనాన్సింగ్ బేస్ వంటి కీలక అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ► రష్యా–ఉక్రెయిన్ సైనిక ఘర్షణలుసహా అంతర్జాతీయంగా ఎకానమీకి ఎదురవుతున్న సవాళ్లు– ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో భారత్ రికవరీకి (కోవిడ్–19 సవాళ్ల నుంచి) విఘాతం కలిగించే అవకాశం లేదని భావిస్తున్నాం. ► ఎకానమీ, ఫైనాన్షియల్ వ్యవస్థల గురించి ప్రస్తుతం కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అవి తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ఈ కారణంగానే ఎకానమీకి ‘స్టేబుల్ అవుట్లుక్’ను కొనసాగిస్తున్నాం. ► అధిక క్యాపిటల్ (మూలధన ) నిల్వలు, లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) పటిష్టత వంటి విభాగాలకు సంబంధించి సవాళ్లు ఉన్నా... ఆ సమస్యలు ఎకానమీకి కలిగించే నష్టాలు అతి స్వల్పం. ఆయా అంశాలు మహమ్మారి నుండి ఎకానమీ రికవరీని సులభతరం చేస్తున్నాయి. ► ద్రవ్యలోటు తక్షణ సమస్య ఉన్నప్పటికీ, రానున్న సంవత్సరాలోఈ సవాళ్లు తగ్గుతాయని విశ్వసిస్తున్నాం. దీర్ఘకాలంలో సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ క్షీణించకుండా ఆయా అంశాలు ఎకానమీకి దోహదపడతాయని భావిస్తున్నాం. రేటింగ్ పెంపుదలే కాదు, తగ్గింపు అవకాశాలూ ఉన్నాయి... భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్ రంగాల్లో సంస్కరణల అమలు పటిష్టంగా జరిగాలి. ఇది ప్రైవేట్ రంగ పెట్టుబడులలో గణనీయమైన, స్థిరమైన పురోగతికి దారితీయాలి. తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధి సామర్థ్యం అంచనాలకు మించి పెరిగాలి. అలాగే ద్రవ్యపరమైన చర్యలు ప్రభుత్వ రుణ భారాలను తగ్గించాలి. రుణ చెల్లింపుల సామర్థ్యం మెరుగుదల క్రెడిట్ ప్రొఫైల్కు మద్దతు నివ్వాలి. ఈ పరిస్థితుల్లోనే సావరిన్ రేటింగ్ను అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇక బలహీన ఆర్థిక పరిస్థితులు తలెత్తినా లేక ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు తీవ్రమయినా రేటింగ్ను డౌన్గ్రేడ్ చేయడం జరుగుతుంది. మేము అంచనావేసినదానికన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయితే, అది ప్రభుత్వ రుణ భారాలను పెంచుతుంది. ఆ పరిస్థితి దేశ సార్వభౌమ ద్రవ్య పటిష్టతను మరింత దిగజార్చే వీలుంది. ఆయా అంశాలు నెగటివ్ రేటింగ్ చర్యకూ దారితీయవచ్చు. – మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ -
భారత్ రేటింగ్ ‘స్థిరం’: మూడీస్
ముంబై: భారత్ సార్వభౌమ పరపతి రేటింగ్కు ఇప్పుడున్న స్థిరమైన అంచనాను (స్టేబుల్ అవుట్లుక్) కొనసాగిస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్ దిగ్గజం మూడీస్ బుధవారం ప్రకటించింది. ‘బీఏఏ3 (స్టేబుల్ అవుట్లుక్)’ రేటింగ్లో మార్పులేవీ లేవని పేర్కొంది. ప్రధానంగా మెరుగైన ప్రైవేటు పొదుపు రేటు, భారీ, విభిన్న రంగాలతో కూడిన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు మూడీస్ విశ్లేషకుడు (సావరీన్ క్రెడిట్) అత్సి సేథ్ పేర్కొన్నారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చని తాజా నోట్లో ఆయన అంచనా వేశారు. అదే విధంగా సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2016 మార్చిచివరినాటికి 6.5 శాతానికి పెరగవచ్చని (ఈ ఏడాది మార్చి నాటికి అంచనా 4.6 శాతం) అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ అతితక్కువ స్థాయి తలసరి ఆదాయాలు, బలహీన మౌలిక సదుపాయాలను చూస్తే.. భవిష్యత్తులో వృద్ధికి మరింత ఆస్కారం ఉందని సేథ్ పేర్కొన్నారు. స్టేబుల్ అవుట్లుక్ అంటే రానున్న కాలంలో రేటింగ్ పెంపునకు(అప్గ్రేడ్) ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లే లెక్క.