Srirangam Assembly constituency
-
జాబితా సరిదిద్దాల్సిందే!
సాక్షి, చెన్నై: శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గంలో తిష్ట వేసి గెలుపు కోసం ఓటర్ల ప్రసన్నంలో దూసుకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో తీవ్ర గందరగోళం ఉందని, అధికార పక్షం కనుసన్నల్లో దొంగ ఓటర్లను ఆ జాబితాలో ఇరికించారని డీఎంకే అభ్యర్థి ఆనంద్ ఆరోపించారు. మద్రాసు హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఎన్నికల యంత్రాంగం గత నెల 5, 26 తేదీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించిందని గుర్తు చేశారు. ఐదో తేదీ విడుదల చేసిన జాబితాకు, మలి జాబితాకు మధ్య తీవ్ర గందరగోళం నెలకొందని వివరించారు. ఒకే చిరునామాలో వేర్వేరు వ్యక్తుల పేర్లను చేర్పించారని, ఆ వ్యక్తులెవ్వరూ నియోజకవర్గంలో ఆ చిరునామాల్లో నివసించడం లేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల్లో గెలుపొందాలన్న లక్ష్యంతో అధికార పక్షం అధికారుల్ని బెదిరించి దొంగ ఓటర్లను చేర్పించినట్టుగా అనుమానం కలుగుతోందన్నారు. ఈ ఓటర్ల జాబితాను సరిదిద్ది, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో కొత్తగా ఓటర్ల జాబితాను ప్రకటించే విధంగా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని విన్నవించారు. సరిదిద్దాల్సిందే : ఆనంద్ పిటిషన్ను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్కిషన్కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ తరపున న్యాయవాది విల్సన్ హాజరై ఓటర్ల జాబితాలోని గందరగోళం, అవకతవకలను ఆధారాలతో సహా తన వాదనలో బెంచ్ దృష్టికి తెచ్చారు. ఇది వరకు పిటిషనర్ఎన్నికల కమిషన్ ముందు వీటిని సమర్పించారని, వారు ఖాతరు చేయని దృష్ట్యా, కోర్టును ఆశ్రయించామని సూచించారు. వాటిని పరిశీలించినానంతరం ఎన్నికల కమిషన్ తరపున హాజరైన న్యాయవాది నిరంజన్ వాదనను బెంచ్ విన్నది. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఓటర్ల జాబితా పునఃపరిశీలనకు సిద్ధంగా ఉన్నామని సూచించారు. దీంతో ఓటర్ల జాబితాను పునః పరిశీలించడం కాదని, సరిదిద్దాల్సిందేనని బెంచ్ ఆదేశించింది. ఎన్నికలకు రెండు రోజుల ముందుగా కొత్త జాబితాను ప్రకటించాలని, త్వరితగతిన అన్ని తప్పుల్ని సరిదిద్దాలని ఉత్తర్వులు జారీ చేసింది. నేరుగా రాలేకున్నా : శ్రీరంగంలో ఉప సమరం వేడెక్కడంతో గెలుపు తమదంటే తమదన్న ధీమాతో అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరంగం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ, తన ఆవేదనను వెళ్లగక్కుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లేఖ రాశారు. గత ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి మూడో సారిగా సీఎం పగ్గాలు అందేలా చేశారని గుర్తు చేశారు. మీ ఆశీసులతో శ్రీరంగం నుంచి గెలుపొందిన తాను సీఎం అయ్యాక, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేశానని వివరించారు. ఈ సమయంలో శ్రీరంగం నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడాన్ని తమరు జీర్ణించుకోలేకున్నారన్న విషయం తనకు తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర, విధి ఆడిన చదరంగంలో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడి ఉందని పేర్కొన్నారు. తన ప్రతినిధిగా, తమ అభ్యర్థి వలర్మతి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని, ఆమెకు మద్దతుగా ప్రచారానికి తాను రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే తాను నేరుగా నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాస్తున్న ఈ లేఖను ఓటర్లు తన విజ్ఞప్తిగా పరిగణించాలని, తమ అభ్యర్థి వలర్మతిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
చతుర్ముఖ సమరం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో ఖాళీ అయిన శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పక్షాలు గెలుపు కోసం పరుగులు తీస్తున్నాయి. ఈ ఎన్నికలను పీఎంకే, ఎండీఎంకే, టీఎంసీలు బహిష్కరించాయి. బీజేపీకి మద్దతుగా డీఎండీకే నిలవడంతో వారి మధ్య స్నేహ బంధం పదిలం అన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవు. దీంతో ఈ ఉప ఎన్నికలో చతుర్మఖ సమరం నెలకొంది. అన్నాడీఎంకే అభ్యర్థిగా వలర్మతి, డీఎంకే అభ్యర్థిగా ఆనంద్ ఇప్పటికే తమ నామినేషన్లను దాఖలు చేశారు. బీజేపీ తమ అభ్యర్థిని ఆలస్యంగానే ప్రకటించింది. శనివారం ఆ పార్టీ అభ్యర్థి సుబ్రమణియన్ తన నామినేషన్ను తాలుకా కార్యాలయంలో ఎన్నికల అధికారికి సమర్పించారు. సీపీఎం అభ్యర్థి అన్నాదురై తన నామినేషన్ను చివరి రోజైన 27న దాఖలు చేయడానికి నిర్ణయించారు. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, సీపీఎంలు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అయింది. ఒక వేళ ఇతర పార్టీలు పోటీ చేయాలన్నా అందుకు తగ్గ సమయం లేదు. ఆది, సోమ సెలవు దినం కావడంతో చివరి రోజున ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్న పార్టీలు ఇక్కడ లేవు. దీంతో ఈ ఉప ఎన్నిక చతుర్మఖ సమరంగా మారింది. అయితే, ప్రధాన పోటీ అన్నది అన్నాడీఎంకే, డీఎంకే మధ్య సాగుతుంది. బీజేపీ అభ్యర్థి ఏ మేరకు పోటీ ఇస్తారన్నది అనుమానమే. ఆయన అలా నామినేషన్ దాఖలు చేశారో ఏమోగానీ, ఇలా ఆయన పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేరారుు ఫిర్యాదు : సుబ్రమణియన్ పేరును ప్రకటించడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లు తమ పనితనాన్ని ప్రదర్శించే పనిలో పడ్డారు. పలు విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న సుబ్రమణియన్పై గతంలో మోసం కేసు నమోదైందని, క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ఆరోపణలు బయలు దేరాయి. కే సుల్ని ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీ తమ అభ్యర్థిగా ఎంపిక చేయడం శోచనీయమంటూ విమర్శలు, ఫిర్యాదులు మొదలయ్యూరుు. తమ అభ్యర్థికి చిక్కులు తప్పవేమోనన్న బెంగ కమలనాథుల్లో బయలు దేరి ఉన్నది.ప్రచార హోరు : నామినేషన్ల దాఖలుతో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు ఓట్ల వేటలో పరుగులు తీస్తున్నారు. తమ అభ్యర్థి వలర్మతికి మద్దతుగా పలువురు మంత్రులు నియోజకవర్గంలో తిష్ట వేశారు. ఆయా ప్రాంతాల్లోని నేతలతో మంతనాలు జరుపుతూ, ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక ఓపెన్ టాప్ వాహనంలో తిరుగుతూ, ఇంటింటా వెళ్లి ఓటర్లను ఆకర్షించడంలో వలర్మతి బిజీగా ఉన్నారు. ఇక డీఎంకే అభ్యర్థి ఆనంద్ తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకునే పనిలో పడ్డారు. జయలలిత చేతిలో గతంలో ఓటమి చవి చూసిన తన మీద ఈ సారైనా కరుణ చూపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రచార బాట పట్టారు. నియోజకవర్గంలో ఓపెన్ టాప్ వాహనంలో తిరుగుతూ, ఓటర్లను ఆకర్షించే రీతిలో ప్రసంగాల్లో స్టాలిన్ నిమగ్నమయ్యారు. నామినేషన్ దాఖలుతో ఓట్ల వేటలో బీజేపీ అభ్యర్థి సుబ్రమణియన్ నిమగ్నమయ్యారు. నామినేషన్ వేయకున్నా, కార్మికులతో మంతనాలు జరుపుతూ, ఓట్ల వేటకు సీపీఎం అభ్యర్థి అన్నాదురై సిద్ధమయ్యారు. -
ఉప నగారా
సాక్షి, చెన్నై:శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నగారా మోగింది. ఫిబ్రవరి 13న ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థుల వేటలో అన్నాడీఎంకే, బీజేపీలు నిమగ్నమయ్యాయి. అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. జయలలిత అనర్హురాలు కావడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీరంగానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తిరుచ్చి జిల్లా కావేరి నదీ తీరంలోని ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఉప ఎన్నిక నిర్వహణలో జాప్యం నెలకొనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. రాష్ట్ర ఎన్నికల అధికారి సక్సేనా ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకుని కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక రూపంలో సమర్పించారు. దీంతో ఉప ఎన్నిక నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం నిర్ణయం తీసుకుంది. ఉప నగారా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీతో పాటుగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను రాత్రి చెన్నైలో రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా విడుదల చేశారు. ఆ మేరకు శ్రీరంగం ఉప ఎన్నిక గురించి వివరించారు. ఈ నెల 19 నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం ఆరంభం కానుంది. ఈ నెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, 28న పరిశీలన, 30న ఉప సంహరణ పర్వాలు సాగనున్నాయి. ఫిబ్రవరి 13న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. 16న ఫలితాల వెల్లడి, 18తో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ముగించనున్నారు. ఎన్నికల నగారా మోగడంతో తిరుచ్చి జిల్లా పరిధిలోని శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం, తిరుచ్చి లోక్సభ నియోజకవర్గం పరిధుల్లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు లేదు. కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. అభ్యర్థుల వేటలో... : ఎన్నికల నగారా మోగడంతో శ్రీరంగంపై పార్టీలు దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. జయలలిత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో ఆ స్థానానికి తగ్గట్టుగా అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అవశ్యం ఏర్పడింది. మహిళా అభ్యర్థినే ఎంపిక చేయడానికి జయలలిత నిర్ణయించినట్టు, అన్ని రకాల పరిశీలన, అర్హతల మేరకు ఆ నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చేసే కసరత్తుల్లో ఆమె నిమగ్నమైనట్టుగా అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు బీజేపీ సిద్ధమైంది. అన్నాడీఎంకే మహిళా అభ్యర్థిని బరిలోకి దించిన పక్షంలో, తాము సైతం మహిళనే రంగంలోకి దించే విధంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ కసరత్తుల్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ విషయంగా ప్రధాన ప్రతిపక్షం డీఎండీకే, ప్రధాన పార్టీ డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ పార్టీలు ఎన్నికల బరిలో అభ్యర్థుల్ని నిలబెట్టేనా అన్నది వేచి చూడాల్సిందే. ఎన్నికల నగరా మోగడంతో శ్రీరంగ ంలో ఉప సందడి ఆరంభం అయింది. -
జయలలిత నియోజకవర్గం ఖాళీ!
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన శాసనసభ నియోజకవర్గం ఖాళీ అయిందని పేర్కొంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ పంపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె దోషిగా రుజువై శాసనసభ్యురాలిగా అనర్హతకు గురైనవిషయం తెలసిందే. ఈ నేపధ్యంలో శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీకి సంబందించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ను శనివారం ముఖ్య ఎన్నికల అధికారికి పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 27న నాలుగేళ్ల జైలు శిక్ష పడిన వెంటనే జయలలిత అనర్హతకు గురయ్యారు. కానీ, ఈ సీటును ఖాళీ అయినట్లుగా ఎన్నికల సంఘం పరిగణించేందుకు అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఎన్నికల అధికారికి అధికారిక సమాచారం అందవలసి ఉంది. **