డిగ్రీ తెలుగులో ఆధునిక కవులకు పెద్దపీట
* సిలబస్లో మార్పులు ఖరారు
* ఉన్నత విద్యామండలికి కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ సిలబస్ మార్పుల్లో భాగంగా ద్వితీయ భాష తెలుగులో తెలంగాణకు చెందిన ఆధునిక కవులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మల్లేష్, సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.గోపి మంగళవారం జరిగిన సమావేశంలో డిగ్రీ తెలుగు సిలబస్లో తేనున్న మార్పులను ఓకే చేశారు.
అనంతరం సిలబస్ కమిటీ నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేసింది. తెలంగాణకు చెందిన ప్రాచీన కవుల రచనలు, కథానికలకు పెద ్దపీట వేస్తూనే ఇప్పటివర కు ఏ సిలబస్లోనూ లేని తెలంగాణ కవులకు ఇందులో స్థానం కల్పించింది. వారి రచనలు, ప్రత్యేకతలను వివరిస్తూ పాఠ్యాంశాలుగా పొందుపరిచింది. ఇదే కమిటీ సిలబస్లో తీసుకురానున్న మార్పులకు అనుగుణంగా కవులు, రచయితల రచనలతో పాఠ్యాంశాలను పొందుపర్చి డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ తెలుగు పుస్తకాలను కూడా రాసింది.
ఈ పుస్తకాలు 2015-16 విద్యా సంవత్సరంలో అమల్లోకి రానున్నాయి. సమావేశం సందర్భంగా అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య మృతికి తెలంగాణ ఉన్నత విద్యామండలి సంతాపం వ్యక్తం చేసింది. సిలబస్ కమిటీ సమావేశంలోనూ ఈ మేరకు తీర్మానం చేసింది.
పాఠ్య పుస్తకాల్లో చోటు కల్పించిన ఆధునిక రచయితలు, కవులు
⇒ వేణుగంటి నర్సింహాచార్యులు (బుద్ధుని ఉపదేశం రచయిత)
⇒ శంషోద్దీన్ (కలంపేరు కౌముది, రచన అల్విదా)
⇒ పల్లా దుర్గయ్య (ఉస్మానియా యూనివర్సిటీ మొదటి పీహెచ్డీ చేశారు)
⇒ గడియారం వెంకట శేషశాస్త్రి
⇒ కవిరాజ మూర్తి (రచన, మానవ సంగీతం)
⇒ నెల్లూరి కేశవస్వామి (హైదరాబాద్ కథలు)
⇒ నీలగిరి ఇందిర (ఇది ఒక కలే)
⇒ రాఘవరావు (రుద్రమదేవిపై పూర్తిగా తెలంగాణ మాండలికంలో కథానిక)
⇒ ఇన్నాళ్లు రాజకీయ నాయకునిగానే చూసిన బూర్గుల రామకృష్ణారావును రచయితగా
(తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం)పేర్కొంది. వీరితోపాటు మరింత మంది రచనలు, కవితలకు డిగ్రీ సిలబస్లో చోటు కల్పించారు.