breaking news
sda
-
అన్బుమణికి అవకాశం
సాక్షి, చెన్నై:పీఎంకే సీఎం అభ్యర్థిగా అన్బుమణి రాందాసు పేరును ఆ పార్టీ మహానాడులో ప్రకటించారు. ఆయన నేతృత్వంలో ఎస్డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. పార్టీ పరంగా తన కు బాధ్యతలు పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు, ప్రజల్ని కలుసుకునేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు అన్బుమణి రాందాసు సిద్ధం అవుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కూటముల్ని మార్చి మార్చి డిపాజిట్లు గల్లంతు చేసుకోవడంతో పాటుగా తన వన్నియర్ సామాజిక వర్గం చేత కూడా చీదరించుకోవాల్సిన పరిస్థితి పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుకు ఏర్పడింది. ఇక ఎవరి గొడుగు నీడన చేరకుండా, తన నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ మేరకు సమూహ జననాయగ కూట్టని (సోషల్ డెమోక్రటిక్ అలయన్స్-ఎస్డీఏ)ను ఏర్పాటు చేశారు. చిన్నా చితకా పార్టీలను కలుపుకుంటూనే, రాష్ర్టంలో మా ర్పు తమ ద్వారానే సాధ్యం అన్న నినాదాన్ని అందుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా తమ నేతృత్వంలో ఏర్పడే కూటమికి సీఎం అభ్యర్థిగా అన్బుమణి పేరును ప్రకటిస్తూ రాందాసు నిర్ణయం తీసుకున్నారు. తీర్మానం : సేలంలో ఆదివారం రాత్రి పీఎంకే మహానాడు జరిగింది. బ్రహ్మాండ వేదికపై జరిగిన ఈ మహానాడుకు తమ బలాన్ని చాటే రీతిలో పీఎంకే వర్గాలు తరలి వచ్చాయి. ఇందులో రాందాసు ప్రసంగిస్తూ, రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని శివాలెత్తారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా పీఎంకే ఉద్యమిస్తోందని, అధికారంలోకి రాగానే, తొలి సంతకం మద్య నిషేధం మీదే ఉంటుందని ప్రకటించారు. ఒకరి గొడుగు నీడ చేరాల్సిన అవసరం ఇక పీఎంకేకు లేదని, రాష్ట్రంలో మార్పు లక్ష్యంగా పీఎంకే ముందుకు సాగుతున్నదన్నారు. తమ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తమ పార్టీ సీఎం అభ్యర్థిగా అన్బుమణి రాందాసు పేరును పార్టీ నిర్ణయించిందని, పీఎంకే సీఎం అభ్యర్థి అన్బుమణి రాందాసు అని ప్రకటిస్తూ తీర్మానం చేశారు. తన పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో అన్భుమణి ఆనందానికి అవధులు లేవు. ఆయనను పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జీకే మణి, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గుర్రు అభినందనలతో ముంచెత్తారు. తన పై బాధ్యతలు పెరగడంతో ఇక పార్టీ బలోపేతం లక్ష్యంగా రాష్ర్టవ్యాప్తంగా పర్యటించనున్నట్టు, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుతూ బలోపేతం ధ్యేయంగా, ప్రభుత్వ ఏర్పాటు కాంక్షతో ముందుకు సాగుతున్నట్టు అన్బుమణి రాందాసు ప్రకటించారు. -
ఒంటరేనా?
సాక్షి, చెన్నై :గతం నేర్పిన గుణపాఠంతో ద్రవిడ పార్టీలకు దూరంగా ఉండేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇక తమది ఒంటరి సమ రం అని చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో తన నేతృత్వంలో సమూహ జననాయగ కూట్టని (సోషియల్ డెమోక్రటిక్ అలయన్స్)ను అక్టోబరులో ప్రకటించారు. తమ కూటమిలో పోటీ చేయనున్న పదిహేను మంది అభ్యర్థుల చిట్టాను తొలి విడతగా విడుదల చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించే కార్యక్రమా ల్ని వేగవంతం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు పీఎంకే నిర్ణయించింది. దీంతో బీజేపీతో జత కట్టేందుకు మంతనాలు జరుగుతున్నట్టు, సీట్ల పందేరం ఒప్పందాలు ముగిసినట్టుగా ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారానికి బ్రేక్ వేస్తూ బుధవారం జరిగిన పీఎంకే సర్వసభ్య సమావేశంలో పార్టీ నాయకుల ద్వారా రాందాసు ప్రతిజ్ఞ చేయించడం గమనార్హం. సర్వ సభ్యసమావేశం: కామరాజర్ అరంగంలో ఉదయం సర్వ సభ్య సమావేశం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పీఎంకే వర్గాలు తరలి రావడంతో ఆ పరిసరాలు కోలాహలంతో నిండాయి. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జికే మణి, యువజన నేత అన్బుమణి రాందాసు, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గురు, పార్టీ సీనియర్లు ఏకే మూర్తి తదితరులు వేదికపై ఆశీనులయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల్ని రాందాసు స్వీకరించారు. కొందరు బీజేపీతో జత కడుదామని అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కూటమి అన్నది పార్టీ నేతృత్వంలోనే ఉంది కదా..! అన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరికొందరు సర్వ సభ్య సమావేశం దృష్టికి తెచ్చారు. ఝలక్: అభిప్రాయ సేకరణానంతరం ప్రసంగించిన రాందాసు, కేంద్రంలో ఏర్పడ బోయే ప్రభుత్వానికి పీఎంకే మద్దతు తప్పని సరి అని, ఆ కేబినెట్లో పీఎంకేకు చోటు దక్కుతుందని పేర్కొనడం విశేషం. తమ మద్దతు కోసం మరొకరు ఎదురు చూడాలే గానీ, ఇతరుల మద్దతు కోసం తాము ఎదురు చూడాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీకి ఝలక్లు ఇచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. చివరగా 17 తీర్మానాలు చేశారు. సమూహ జననాయగ కూట్టని అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని, శ్రమిస్తామని నినదిస్తూ అందరి చేత పార్టీ అధ్యక్షుడు జికే మణి ప్రతిజ్ఞ చేయించడం గమనార్హం. అయితే, ఈ ప్రతిజ్ఞ వెనుక ఆంతర్యం ఉందని పలువురు పీఎంకే నేతలు పేర్కొంటున్నారు. సీట్ల పందేరంలో బీజేపీ పట్టు వీడని దృష్ట్యా, వారికి ఝలక్ ఇవ్వడం లక్ష్యంగా ఈ ప్రతిజ్ఞ ఉండొచ్చంటున్నారు. అయితే, చివరి క్షణంలో మళ్లీ పునఃసమీక్ష జరిగేనా లేదా ఎస్డీఏ బరిలోకి దిగేనా, బీజేపీతో జత కట్టేనా..? అన్నది ఎన్నికల నాటి వరకు వేచి చూడాల్సిందే.తీర్మానాలు: అక్టోబరులో ప్రకటించిన మేరకు సమూహ జననాయగ కూట్టని అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలి. జాలర్లపై, ఈలం తమిళులపై శ్రీలంక పైశాచికత్వానికి నిరసన తెలుపుతూ తీర్మానం. రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణింపుపై ఆగ్రహం, విద్యుత్ కోతలపై మండి పాటు, ధరల పెంపుపై ఖండన. ఇసుక, గ్రానైట్ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్. మద్య నిషేధం లక్ష్యంగా ఉద్యమం ఉధృతం. ఎస్సీ, ఎస్టీ చట్టంలో సవరణలకు డిమాండ్ వంటి తీర్మానాలు చేశారు.