breaking news
rivalvor
-
అప్పు కట్టలేదని ఇంట్లోకి చొరబడి..
బెంగళూరు : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వనందుకు రుణదాత అనుచరులతో వచ్చి రివాల్వర్తో బెదిరించిన ఘటన మాలూరు తాలూకాలోని జయమంగల గ్రామంలో చోటు చేసుకుంది. తుపాకీతో హల్చల్ చేయడం చూసి గ్రామస్థులు మూకుమ్మడిగా తిరగబడడంతో తోకముడిచారు. తాలూకాలోని లక్కూరు ఫిర్కా జయమంగల గ్రామంలో బోళేగౌడ అనే వ్యక్తి బెంగుళూరుకు చెందిన హేమంత్ అలియాస్ మున్నాభాయ్ అనే వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. వడ్డీలు, అప్పు చెల్లించలేదంటూ ఆ వ్యక్తి తన అనుచరులు అయిన సురేష్, మంజునాథ్, నబీద్ అనే వారితో జయమంగల గ్రామంలోని బోళేగౌడ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న బోళేగౌడ భార్య కామాక్షమ్మ, కూతురు అంజలీదేవి తలుపులు తెరిచారు. వెంటనే వారు లోపలికి చొరబడి అప్పు కట్టకుంటే చంపేస్తామని రివాల్వర్తో బెదిరించారు. ఇంట్లో భర్త లేడని చెప్పినా వినిపించుకోకుండా వారితో గొడవ పడ్డారు. ఈ సమయంలో కామాక్షమ్మ, కూతురు అంజలీదేవి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఇండ్ల వారు అక్కడికి రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై అనంతరం బోళేగౌడ కుటుంబం మాలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లైసెన్స్డ్ రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రివాల్వర్తో సీఐ హల్చల్.. ఉద్యోగులపై దాడి
కుత్బుల్లాపూర్: జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బందిపై ఓ సీఐ రివాల్వర్తో హల్చల్ సృష్టించాడు. ఎన్నికల విధులకు వచ్చిన ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు చేయి చేసుకున్న ఘటన కుత్బుల్లాపూర్లో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ చింతల్ ఇక్ఫాయ్ స్కూల్కు ఎన్నికల విధుల కోసం ఉన్నతాధికారులు కొంతమంది ఉద్యోగులను నియమించుకున్నారు. వారిలో కొంత మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సోమవారం సాయంత్రం అధికారులు ఆదేశించారు. దీంతో వేతనాల విషయంలో అధికారులకు, ఉద్యోగులకు వివాదం రావడంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో బాలానగర్ సీఐ భిక్షపతిరావు రంగప్రవేశం చేశాడు. ఆందోళనకు దిగిన వారిలో ఓ ముగ్గురిని కొట్టాడు. రివాల్వర్ చేత్తో పట్టుకుని అక్కడున్న వారిని భయాందోళనకు గురి చేశాడు. తాము ఆహారం లేకుండా ఉదయం నుంచి పనిచేసి భత్యం కోసం డిమాండ్ చేస్తుంటే పోలీసులు వ్యవహరించిన దురుసు తీరు పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.