breaking news
Remunerative Price
-
'నిల్వ ఉన్న పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలి'
-
మీ గొంతుకనవుతా..
మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో అడుగడుగునా సమస్యలు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతులు.. ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్నాయని విద్యార్థులు..పెన్షన్లు వస్తాయో..రావో తెలియట్లేదని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు..ఇలా ఊళ్లో ఏ ఇంటి తలుపు తట్టినా కష్టాలూ..కన్నీళ్లే. ఆ గ్రామాన్ని ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆదివారం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా గ్రామస్తులను పలుకరించారు. వారి బాధలకు చలించిపోయారు. ‘మీ గళాన్నవుతా.. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ఏకరువు పెడతానంటూ’ వారికి భరోసా ఇచ్చారు. మల్లు భట్టి విక్రమార్క : అమ్మా నమస్తే..నేను మీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను.. గుర్తుపట్టారా? సైదమ్మ : అయ్యా గుర్తుపట్టాను. పింఛన్ రావట్లేదయ్యా. పోయినసారి మీరు గెలిచినప్పుడు పింఛన్ వచ్చేదయ్యా. మళ్లీ మీరే ఇప్పించి ఆదుకోవాల నాయనా. భట్టి : అవ్వా బాగున్నావా ? నేను మీ ఎమ్మెల్యేను. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. పెన్షన్ వస్తుందా? సర్వే అప్పుడు పేర్లు రాయించారా? దేవరగట్ల నర్సమ్మ : నాయనా నిన్ను మర్చిపోలేదు. మూడు నెలలుగా పింఛన్ రావట్లేదు. అప్పుడు రాసుకొని పోయిండ్రు..ఇదిగో అదిగో అంటుండ్రు. మీరైనా అధికారులకు చెప్పి ఇప్పించడయ్యా. భట్టి : ఏం తమ్ముడు ఎలా ఉన్నావ్..? రాంబాబు (వికలాంగుడు) : సార్ నమస్తే. గతంలో పెన్షన్ వచ్చింది. వికలాంగుల పింఛన్ పెంచినమని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు ఇవ్వట్లేదు. భట్టి : తమ్ముళ్లు ఏం పనిచేస్తున్నారు.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా? కొర్లపాటి గురవయ్య : సార్.. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. డిగ్రీలు, పీజీలు చదువుకుని నిరుద్యోగులుగా మిగిలిపోయాం. ఆర్థిక ఇబ్బందులతో కూలిపనులకు వెళుతున్నాం. అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇప్పించండి. భట్టి : తమ్ముడూ ఏం చేస్తున్నావ్? ఇంట్లో అందరూ బాగున్నారా? అప్పారావు : సార్ ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. బీఎడ్ చేసిన.. ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. భట్టి : పైపులు ఎక్కడికి.. పొలానికి వెళ్తున్నారా? సాగర్నీరు వస్తుందా? పంటలు మంచిగా ఉన్నాయా? లక్ష్మయ్య : ఏం బాగుసార్.. మొక్కజొన్న పంట వేశా. నీరందక ఇబ్బందులు పడుతున్నం. కనీసం గొడ్లు తాగడానికి కూడా నీళ్లు లేవు. కాలువనీరు రావట్లేదు. అర్ధరాత్రి ఇచ్చే కరెంటుతో తడిసిన పొలమే తడుస్తున్నది. భట్టి : అమ్మా ..మీకు ఇందిరమ్మ బిల్లు మంజూరైందా? నాగమణి : ఇల్లు కట్టుకుని 8 నెలలకు పైన అయింది. ఎన్నికలొచ్చినయని బిల్లు ఆపారు. అప్పుచేసి ఇల్లు కట్టుకున్నాం. మీరైనా ఇప్పించండి. భట్టి : ఏం పాప..ఏం చదువుతున్నావ్? మీ ఊరి సమస్యలు చెప్పమ్మా? ప్రత్యూష : సార్ మా ఊళ్లో రోడ్లు సరిగాలేవు. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు రాలేదు. కాలేజి యాజమాన్యం ఫీజు కట్టమంటోంది. భట్టి : అయ్యగారు బాగున్నారా..? ఎన్నికలప్పుడు మీ గుడికి వచ్చా.. సమస్యలు ఏమైనా ఉన్నాయా? విద్యాసాగర్శర్మ : అప్పట్లో ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి. ఇప్పుడు రావట్లేదు. పూజారులు ఇబ్బందుల్లో ఉన్నరు. మీరైనా న్యాయం చేయండి. భట్టి : అవ్వా పింఛన్ వస్తుందా? రాజ్యం : ఎక్కడి పింఛనయ్యా..నోటికాడిది తీసేసుకుండు..నువ్వయినా వచ్చేటట్టు చూడయ్యా. భట్టి : మీ ఇంటి బిల్లు వచ్చిందామ్మా? కళావతి : అయ్యా ఇంటి బిల్లు రాలేదు..పింఛన్ ఇయ్యట్లేదు..మీరే వచ్చేలా చూడండయ్యా. భట్టి : బాగున్నారా..? ఒకచోట కూర్చున్నరు.. పనుల్లేవా? వెంకటేశ్వర్లు : అవునుసారు..రైతులందరం రచ్చబండపైన కూసొని బాధలు చెప్పుకుంటున్నం. మొక్కజొన్న వేస్తే ఎకరానికి పది బస్తలు పండింది. మార్కెట్కు తోలుకుపోతే గిట్టుబాటు ధర రాలే. 20 రోజులైనా చెక్కులియ్యలే. భట్టి : గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సత్యనారాయణ : ఇంతవరకు రుణమాఫీ కాలేదు. బ్యాంకులు కొత్తరుణాలు ఇయ్యట్లేదు. మార్కెట్లో పత్తి అమ్ముదామని ఖమ్మం సీసీఐకి వెళ్తే గేట్లు వేస్తున్నారు. ఒకరోజుకొంటే నాలుగు రోజులు కొనట్లేదు. కాంటాల కోసం, చెక్కుల కోసం ఎదురుచూస్తున్నం. భట్టి : ఏంటమ్మా.. పత్తి అమ్మలేదు? కృష్ణవేణి : మద్దతు ధరలేక అమ్మలేదు సారు. మూడెకరాలు వేసినం..క్వింటా రూ.2,700కు అడుగుతున్నరు. ఈ రేటుకు అమ్మితే కనీసం కూలీలకు చెల్లించే డబ్బులూ రావు. నా పుస్తెలతాడు బ్యాంకులబెట్టి గోల్డ్లోన్ తీసుకున్నం. కానీ రుణమాఫీ చేయడం లేదు. భట్టి : అమ్మా డ్వాక్రా రుణాలు ఇస్తున్నారా? రజిని : అప్పట్లో పావలావడ్డీ రుణాలు ఇచ్చిండ్రు..ఇప్పుడివ్వట్లేదు. వెలుగు ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. మా ఊళ్లో కాపుసారా బందు పెట్టండి..ఇబ్బందులు పడుతున్నం.