breaking news
Random
-
అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు షురూ
-
కరోనాపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారందరికీ కరోనా టీకా బూస్టర్ డోసు ఇవ్వాలని, మహమ్మారి నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొత్త వేరియంట్ మన దేశంలోకి అడుగుపెట్టే అవకాశాలను తగ్గించడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రకటించారు. విదేశీ ప్రయాణికుల నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని తెలిపారు. ‘‘మన శత్రువు(కరోనా) కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటోంది. మనం ఇకపై మరింత పట్టుదల, అంకితభావంతో శత్రువుపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచాలి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.87 లక్షల కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మన దేశంలో మాత్రం సగటున 153 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాబోయే పండుగలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. బూస్టర్ డోసుతోపాటు కరోనా నియంత్రణ చర్యలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని విన్నవించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తల విషయంలో ప్రజల్లో చైతన్యం పెంచాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పారు. ఏమరుపాటు వద్దు కొత్త వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జినోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు‡’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరారు. కరోనా అనే విపత్తు ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై, జీవనంపై ప్రభావం చూపిస్తూనే ఉందని గుర్తుచేశారు. గత కొద్దిరోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతుందోన్నారు. చైనా, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నప్పటికీ మనదేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని వివరించారు. అయినప్పటికీ ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. 24 నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు టెస్ట్లు విదేశాల నుంచి వచ్చేవారికి ఈ నెల 24వ తేదీ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించిన వారికి ర్యాండమ్ కరోనా వైరస్ టెస్టు నిర్వహించాలంటూ పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. చాలా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి విమానంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల్లో కొందరి నుంచి ఎయిర్పోర్టులోనే నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరెవరికి టెస్టులు చేయాలన్నది వారు ప్రయాణించిన విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది. ఎంపీలంతా మాస్కులు ధరించాలి: స్పీకర్ కరోనా వ్యాప్తిపై మళ్లీ భయాందోళనలు మొదలైన నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో çసభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం సూచించారు. లోక్సభ ప్రవేశద్వారాల వద్ద మాస్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎంపీలందరూ వాటిని ధరించి, సభలో అడుగపెట్టాలని కోరారు. గురువారం పార్లమెంట్లో చాలామంది ఎంపీలు మాస్కులు ధరించారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పార్లమెంట్ సిబ్బందిని లోక్సభ సెక్రటేరియట్ ఆదేశించింది. కరోనా నియంత్రణ చర్యలు పాటించాలన్న స్పీకర్ బిర్లా సూచనను పలువురు ఎంపీలు స్వాగతించారు. -
అటకట్టు
రేషన్ డీలర్ల అక్రమాలపై కొరడా ఎట్టకేలకు రేషన్ డీలర్ల అక్రమాలకు ‘చెక్’ పడుతోంది. నెల నుంచి దుకాణాలపై వరుస విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. ‘రేషన్’ అక్రమాలపై ‘సాక్షి’ చేసిన అక్షర సమరాన్ని తప్పు పడుతూ ఖండించిన అధికారులే నేడు అవే కథనాల ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల తీరును వివరిస్తూ మేలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సరిగ్గా ‘సాక్షి’ ఎత్తి చూపిన అంశాలపైనే దృష్టి సారించిన జేసీ వెంకట్రామిరెడ్డి సారథ్యంలోని ప్రత్యేక బృందాలు... డీలర్ల ఆట కట్టిస్తున్నాయి. - 13 మందిపై వేటు.. కేసులు నమోదు - 3 బియ్యం మిల్లుల సీజ్.. రూ 6 కోట్ల బియ్యం స్వాధీనం - ఎల్ఎమ్మెస్ పాయింట్ ఇన్చార్జి సస్పెన్షన్కు సిఫారసు - ‘సాక్షి’ సాగించిన అక్షర సమరం ఎఫెక్ట్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న రేషన్ దోపిడీ కట్టడికి ఆ శాఖ అధికారులు కార్యోన్ముఖులయ్యారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి లక్షలు గడిస్తున్న వారి పని పట్టేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకునే వీలు లేకుండా పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడులు చేసి పట్టుకుంటున్నారు. పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ నెల రోజులుగా దాడులు ముమ్మరం చేశారు. మూడు ప్రత్యేక విజిలెన్స్ టీంలు ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నారు. నిత్యావసర సరుకులను నల్లబజారుకు తరలించడం, దుకాణాలు సమయపాలన పాటించకపోవడం, రికార్డుల్లో లబ్ధిదారుల సంతకం లేకపోవడం వంటి అభియోగాల మీద రేషన్ డీలర్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. 13 మంది డీలర్లు సస్పెన్షన్ రేషన్ డీలర్ల అక్రమాలు జిల్లాలో వ్యవస్థీకృతమయ్యాయి. కొందరు డీలర్లు కోట్లకు పడగలెత్తారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటువంటి డీలర్లపై నిఘా వర్గాలు దృష్టిపెట్టాయి. నెల రోజులుగా దాడులు చేస్తున్న అధికారులు... జిల్లా వ్యాప్తంగా పటాన్చెరు, నారాయణఖేడ్, కంగ్టీ, కల్హేర్, కంది, ఆందోల్, దుబ్బాక మండలాల్లో ఒక్కొక్క డీలర్ చొప్పున, తూప్రాన్లో ఇద్దరు డీలర్లను సస్పెండ్ చేసి కేసులు నమోదు చేశారు. అక్రమంగా బియ్యం కొనుగోలు చేసి రవాణా చేస్తున్న ఇద్దరిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనికి సహరిస్తున్న సిద్దిపేటలోని మూడు రైస్ మిల్లులను సివిల్ సప్లై శాఖ అధికారులు సీజ్ చేశారు. వీటిల్లోని దాదాపు రూ 6.5 కోట్ల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్ ఎల్ఎమ్మెస్ పాయింట్లో డీలర్లకు బియ్యం తక్కువగా ఇచ్చినట్టు, ఇక్కడ ఇన్చార్జి ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించి, అతని సస్పెషన్ కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. దాడులు పెరగాలి... జిల్లాలో వేళ్లూనుకుపోయిన రేషన్ అక్రమాలను కూకటివేళ్లతో సహా పెకిలించాలంటే ప్రస్తుతం జరుగుతున్న దాడులు సరిపోవని ప్రజలు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. జిల్లాలో దాదాపు 1860 దుకాణాలుండగా కేవలం మూడు ప్రత్యేక బృందాలు మాత్రమే ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు. నల్లగొండ జిల్లా తరహాలో సివిల్ సప్లై శాఖలలో దోపిడీని నిరోధించడానికి పోలీసులతో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని కోరుతున్నారు.