breaking news
prasar bharti
-
12 భాషలలో 'ఓటీటీ ప్లాట్'ఫామ్ను ప్రకటించిన ప్రసార భారతి
సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక కాలంలో కాలక్షేప మాధ్యమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలు ప్రైవేట్ ఓటీటీ సంస్థలు పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పట్టికలో వేవ్స్ పేరుతో మరో ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రసారం అవుతున్న ప్రసార భారతి ఈ ఓటీటీని భారత్ నెట్వర్క్ సంస్థతో కలిసి ప్రారంభించింది. ఈ ఓటీటీలో ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాత్, పంజాబీ, అస్సామీ తదితర 12 భాషలలో 10కి పైగా వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ప్రసారం చేయనుందని వేవ్స్ ఓటీటీ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. వీటితోపాటు ఆకాశవాణి ప్రసారాలు, 65కు పైగా టీవీ ఛానళ్ల ప్రసార కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. మంకీ కింగ్ హీరో, టాకీ అవెంజర్స్, చోటా భీమ్, తెనాలి రామన్, అక్బర్ బీర్బల్ తదితర సీరియళ్లు వేవ్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయన్నారు. అలా అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించే ప్రసారాల్లో భాగంగా సంగీత, భక్తిరస కార్యక్రమాలు చోటు చేసుకుంటాయని నిర్వాహకులు తెలిపారు. -
‘ప్రసారభారతి’ తిరుగుబాటు
అప్పుడప్పుడు కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. దూరదర్శన్, ఆకాశవాణి సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే ప్రసారభారతి సంస్థ పాలకుల ఆదేశాలను ధిక్కరించిన వైనం అలాంటి ఊహకందని పరిణామమే. ప్రసారభారతి బోర్డులో ఒక సభ్యుడి నియామకంతోపాటు ఇద్దరు పాత్రికేయులను భారీ వేతనాలతో ఉద్యోగులుగా తీసుకోవాలంటూ తాజాగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలను ప్రసారభారతి బోర్డు తిరస్కరించింది. ఇలాంటి సిఫార్సులు ప్రసారభారతి చట్టాన్ని, దాని స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది. అలాగే కాంట్రాక్టు సిబ్బందిని తొలగించాలన్న సూచనకు కూడా అంగీకరించలేదు. ప్రసారభారతి పుట్టి బుద్ధెరిగి ప్రభుత్వానికి ఇలా ఎదురుతిరిగిన సందర్భం లేదు. వాస్తవానికి ఆ సంస్థ ఏర్పాటు ఉద్దేశం పాలకుల అడుగులకు మడుగులొత్తాలని కాదు... అది స్వతంత్రంగా వ్యవహరించి దూరదర్శన్, ఆకాశ వాణిలను వృత్తిపరమైన ఉన్నత సంస్థలుగా తీర్చిదిద్దాలనే. కానీ ప్రసారభారతి తన ఆవిర్భావం వెనకున్న ఉద్దేశాన్ని మరిచింది. అధికారంలో ఉన్నవారి అభీష్టాన్ని నెరవేరుస్తూ వచ్చింది. ఫలితంగా దూరదర్శన్, ఆకాశవాణి ఎప్పటిలాగే మిగిలి పోయాయి. మన దేశంలో ఉన్నతాశయాలతో ప్రారంభించిన సంస్థలు వాటికి చాలా దూరంగా ఉండిపోవడం కొత్తేమీ కాదు. పరిశ్రమల నిర్వహణ బాధ్యతలను ఆయా రంగాల్లో నిపుణులైనవారికి అప్పగించి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అనుమతించాలని పబ్లిక్ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో అది విఫలమైంది. పరిశ్రమల నిర్వహణలో రాజకీయ జోక్యం పెరగడం, ఉన్నత పదవుల్లో అయినవారిని నియమించాలంటూ ఒత్తిళ్లు తీసుకురావడం పర్యవ సానంగా చాలా పబ్లిక్ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి చివరకు మూతబడిన ఉదంతాలున్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా స్వతంత్రంగా వ్యవహరించి అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతుల్ని గడించిన సంస్థలు కూడా లేకపోలేదు. తాము అధికారంలోకొస్తే ఆకాశవాణి, దూరదర్శన్లకు ప్రభుత్వ అజ్మాయిషీ నుంచి విముక్తి కలిగిస్తామని చెప్పని పార్టీ లేదు. అత్యవసర పరిస్థితి కాలంలో సెన్సార్షిప్ అమలు చేసి ఆకాశవాణి గొంతు నులిమిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన తర్వాత తమకు అధికారమిస్తే ఇలాంటి దుస్థితి కలగకుండా చూస్తామని జనతాపార్టీ తొలిసారి హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇతర పార్టీలు సైతం అలాంటి హామీలివ్వడం, అమలు చేయకపోవడం రివాజుగా మారింది. కానీ బలహీనమైన ప్రభుత్వానికి నాయకత్వంవహించి, స్వల్పకాలం ప్రధానిగా పనిచేసిన చంద్రశేఖర్ ఆశ్చర్యకరంగా 1990లో ఈ ప్రసారభారతి బిల్లుకు మోక్షం కలిగించి అది చట్టరూపం ధరించడానికి కారకులయ్యారు. ఆ తర్వాత వచ్చిన పీవీ ప్రభుత్వం ఆ చట్టాన్ని అటకెక్కించింది. 1995లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాకే కదలిక మొదలైంది. అయినా రెండేళ్లకాలం వృథాగా గడిచిపోయింది. చివరకు ఐకె గుజ్రాల్ ప్రధానిగా వచ్చాక 1997లో ప్రసారభారతి చట్టం అమల్లోకి వచ్చింది. ప్రసారభారతి పనితీరు మొదటినుంచీ అంత సంతృప్తికరంగా ఏం లేదు. దాని పని అది చేసుకుంటే పెత్తనం చేయడానికి తమకేం మిగులుతుందని సమాచార మంత్రులుగా వచ్చినవారంతా భావించినట్టున్నారు. అందువల్లే ఆ సంస్థను తమ ఉక్కు పిడికిట్లో ఉంచుకున్నారు. దాదాపు 450 దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రసారభారతి దేశంలోనే అతి పెద్ద ప్రసార సేవల సంస్థ. వర్తమాన అవసరాలకు తగినట్టుగా ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చు కోవాలని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని అది ప్రయత్నించిన దాఖలాలు లేవు. నిధుల కొరత దీనికి ప్రధాన కారణం అన్నది నిజమైనా... అందుకోసం ప్రభుత్వంతో అవసరమైతే తలపడాలని ఎవరూ అనుకోలేదు. ప్రసారభారతి సారథులుగా నియమితులయ్యేవారు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సన్నిహితులైనవారే ఉంటారు. ఆ మొహమాటం కొద్దీ వారు నోరెత్తరు. ఏ నియామకం చేయాలన్నా ప్రభుత్వామోదం కోసం ఎదురుచూడాల్సిందే. ఎవరైనా చొరవ తీసుకుని నిపుణులైనవారిని డైరెక్టర్ జనరళ్లుగా లేక బ్యూరో చీఫ్లుగా నియమిస్తే సమాచార మంత్రిగా ఉండేవారికి ఆగ్రహం కలుగుతుంది. ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతున్నది ఇదే. ప్రసారభారతి చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాల ఆస్తులు ప్రసారభారతి సంస్థకు బదిలీ కావాలి. అదే జరిగుంటే ఆ ఆస్తుల్ని ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి, ప్రభుత్వంపై ఆధారపడే స్థితిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉండేది. ప్రసారభారతి ఏర్పాటైనప్పుడు ప్రభుత్వం నుంచి ఆ సంస్థకు 48,000మంది సిబ్బంది బదిలీకాగా, ప్రస్తుతం ఉన్నవారి సంఖ్య 32,000 మాత్రమే. వారిలో చాలా భాగం కాంట్రాక్టు కింద పనిచేస్తున్నవారే. ఆకాశవాణి, దూరదర్శన్లు ఎన్ని పరిమితుల్లో పనిచేసినా వృత్తిపరంగా ఉన్న తులైనవారిని అందించాయి. సృజనాత్మక రంగాల్లో లబ్ధప్రతిష్టులైనవారు ఆ సంస్థల్లో పనిచేశారు. వాటికి విశ్వసనీయత కలిగించారు. నిజానికి ప్రసారభారతి ఏర్పడ్డాక ఇవి రెండూ మరింత ఉన్నతంగా ఎదిగి ఉండాల్సింది. ప్రసారభారతిని బీబీసీ స్థాయిలో తీర్చిదిద్దాలని, ఆకాశవాణి, దూరదర్శన్లను అగ్రగామి సంస్థ లుగా రూపొందించాలని కలలుగన్నవారు లేకపోలేదు. కానీ వారు త్వరలోనే నీర సించిపోయారు. ఏమీ చేయలేక అచేతనంగా ఉండిపోయారు. కారణాలేమైనా ఇప్పుడు ప్రసారభారతి బోర్డు ప్రభుత్వ సిఫార్సులను, సూచనలను తిప్పికొట్టింది. మొత్తం కాంట్రాక్టు సిబ్బందిని తొలగించాలని హుకుం జారీ చేయడం, అందుకు ఉపయోగించిన భాష తమకు సమ్మతం కాదని తెలిపింది. ఈ ఉదంతంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ప్రసారభారతి స్వయంప్రతిపత్తిని గౌరవించాలి. ప్రభుత్వ కర్ర పెత్తనం వల్ల ప్రయోజనం కలగకపోగా ప్రసారభారతి, దాంతోపాటు ఆకాశ వాణి, దూరదర్శన్లు మరింతగా దెబ్బతింటాయని తెలుసుకోవాలి. -
హీరోయిన్పై వేటుకు సిద్ధం?
హీరోయిన్ కాజోల్ మీద వేటు వేసేందుకు ప్రసారభారతి సిద్ధం అవుతోంది. సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆమెను తప్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉంది. దూరదర్శన్, ఆలిండియా రేడియోలతో కూడిన ప్రసారభారతి ఒక స్వతంత్ర సంస్థ. ఇది సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. 2016 ఫిబ్రవరి నెలలో కాజోల్ను ఈ బోర్డులో పార్ట్ టైం సభ్యురాలిగా నియమించారు. అయితే గత నాలుగు సమావేశాల నుంచి ఆమె అసలు హాజరు కావడం లేదు. దాంతో ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారు. చైర్మన్కు చెప్పకుండా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే వాళ్ల సభ్యత్వాన్ని రద్దుచేయచ్చని ప్రసారభారతి నిబంధనలు చెబుతున్నాయి. ముందుగానే ఉన్న వృత్తిపరమైన కమిట్మెంట్ల వల్లే గత మూడు నాలుగు సమావేశాలకు కాజోల్ హాజరు కాలేదని ఆమె ప్రతినిధి జైవీర్ అన్నారు. అంతేకాక ఈ సంవత్సరంలో చాలాకాలం పాటు కుటుంబపరమైన వైద్య కారణాలు కూడా అందుకు ఉన్నాయన్నారు. గత కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయినందుకు ఆమె కూడా చాలా బాధపడ్డారని తెలిపారు. కానీ బోర్డులోని పలువురు సభ్యులు మాత్రం గత సమావేశంలోనే ఆమె రాకపోవడాన్ని ప్రస్తావించి, కాజోల్ను తొలగించాలని అన్నారు. ముందుగా ఆమెకు ఒక నోటీసు పంపుతామని, ఆ తర్వాత ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మంత్రిత్వశాఖ నిర్ణయిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. బోర్డు సమావేశాలకు వచ్చేందుకు సభ్యులకు విమాన చార్జీలు, హోటల్ చార్జీలు, ఇతర అలవెన్సులు ఇస్తారు. -
వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లలో టీవీ ప్రసారాలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లలో టీవీ కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ప్రసారభారతి కసరత్తు చేస్తోంది. ప్రైవేట్ మీడియా హౌజెస్ భాగస్వామ్యంతో మోబైల్ ఫోన్లలో సుమారు 20 చానెల్స్ను ప్రసారం చే యనుంది. ప్రస్తుతం మూడు విధాలుగా డిష్, కేబుల్, ఎంటినాల ద్వారా ప్రసారాలను అందజేస్తోంది. నాలుగో విధానంలో డిజిటల్ ఎంటీనాల ద్వారా 20 ప్రీ చానెళ్లను టీవీల్లో, వచ్చే ఏడాది మోబైళ్లలో ప్రసారం చేయనున్నట్లు ప్రసార భారతి ఎగ్జిక్యూటీవ్ అధికారి జవహార్ సిర్కార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముందుగా ఢిల్లీ, ముంబై నగరాల్లో మొబైళ్లలో మొదట ప్రారంభించనున్నారు. ఇందుకోసం దూరదర్శన్ డీవీబీటీ2 సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. డోంగుల్(వైర్లెస్ కనెక్షన్) ప్రవేశపెడుతారు. డీటీహెచ్ ప్లాట్ఫాం నుంచే అన్ని ఫ్రీ చానెల్స్ను ప్రసారం చేయడమే ధ్యేయమని, ఇందుకోసం ప్రైవేట్ కంపెనీలను భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. డీవీబీటీ(డిజిటల్ వీడియో బ్రాడ్కాస్ట్ టెర్రిస్టియల్) ప్రసారాలు టీవీ టవర్స్ నుంచి అందుతాయి, కానీ ఇందుకు అవసరమైన అప్లికేషన్ను మొబైల్ ఫోన్లలో ఆయా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కార్యాలయాల పనివేళల్లో టీవీలను చూడలేరు. ఇందుకు మొబైల్ ఫోన్లు, టాబ్లాయిడ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రయాణం చేసేటప్పుడు బ్యాటరీ ద్వారా పనిచేసే మొబైల్ ఫోన్లలో ఎలాంటి ఖర్చు లేకుండా టీవీ చానెళ్లను చూసుకోవచ్చు. అడ్వర్టైజ్ మెంట్ ద్వారా ఆదాయా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం భారత్లో 225 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఇంకా 185190 మిలియన్ల ఫోన్లు వినియోగించనున్నారు. ఇది కొన్ని దేశాల జనాభా కంటే సమానం.