breaking news
Papineni Shiv Shankar
-
జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు
‘‘కవిత్వానికి కవి ఇవ్వాల్సిందేమిటి? బహుశః తన రక్తమాంసాలివ్వాలి. సొంత భాషనివ్వాలి. అంతిమంగా తన ప్రాణమివ్వాలి. కవితకి భావాలు, భావ చిత్రాలు, అలంకారాలు ఇవ్వటం వేరు. ఇవి బాహ్య విషయాలు మాత్రమే. కవి రక్తమాంసాల్ని హరించినప్పుడే కవిత జవజీవాలు పొందుతుంది. ఒక మహా శిల్పం రూపొందించిన తర్వాత అంతిమంగా దానికి ప్రాణరేఖ చెక్కే శిల్పిలాంటి వాడే కవి. ప్రతి గొప్ప కవిత ప్రాణమున్న వ్యక్తే’’ – పాపినేని శివశంకర్ పది కాలాలపాటు నిలబడే కవిత్వం గురించి శివశంకర్ వ్యాఖ్యానం ఇది. ఈ వాక్యాలు చెప్పడానికి శివశంకర్ గమనింపు ఏమిటి? ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? ఎన్ని అధ్యయనం చేసి ఉండాలి? నాలుగు పుస్తకాలకు సమీక్షలు రాసి ప్రముఖ విమర్శకులుగా చెలామణీ అవుతున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య విమర్శకు ‘శివశంకర్’ ఏమి ఇచ్చాడు? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ‘సాహిత్యం– మౌలిక భావనలు’ సిద్ధాంత గ్రంథం, ద్రవాధునికతను తెలుగు సాహిత్యానికి అన్వయించడం, నిశాంత పేరు మీద అందించిన సాహిత్య తాత్విక వ్యాసాలను మనం పరిశీలించినప్పుడు... కొన్ని అన్వయాలను, కొన్ని భావనలను, ధిక్కారం నిసర్గత లాంటి సాహిత్య సారాంశాన్ని తవ్వితీసే సాధనాలను రూపొందించటానికి కృషి చేసినట్టు తెలుస్తుంది. ‘మనిషి–ప్రకృతి–సమాజం’ అనే త్రికానికి సంబంధించిన సారాంశాన్ని రచయిత అర్థం చేసుకొని, ఆవిష్కరించగలగాలి. విలువలేని సాహిత్యాన్ని తూర్పారబట్టగలగాలని అంటారు. ‘విమర్శకుడు’ అనగానే పనిగట్టుకొని లోపాలు వెతకడం కాదు. మంచిచెడుల వివేచన ఉండాలి. సంయమనం ఉండాలి. వస్తువు, శిల్పం, అభివ్యక్తి, రూపం లాంటి నాలుగు పడికట్టు మాటలతో రచనని చూడటం శివశంకర్కి తెలియదు. కవిత్వీకరణకు సంబంధించి ప్రాచీనులు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అనే మూడు హేతువులు అవసరం అన్నారు. ఇవాళ కవిత్వం రాస్తున్నవారికి ప్రాథమికంగా మూడు మౌలిక విషయాలను శివశంకర్ సూచిస్తున్నారు. ( మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) 1. భావబలం, 2. భావనాబలం, 3. భాషాబలం. కవిత్వ విమర్శకుడిగా ఆయన చేసిన మరికొన్ని పరిశీలనలు చూస్తే. 1. కవిత్వం వైయుక్తికాన్ని సామాజిక దృక్పథం నుంచి విలువ కట్టే ఆలోచనా ధోరణి ప్రవేశించింది. 2. ఇవాళ కవిత్వంలో కనబడే ఒక ప్రధాన లక్షణం బహుముఖీనత. ఇక్కడ మహాకవి పదవులు, ఏక నాయకత్వాలు లేవు. ఏక సమయంలో ఎన్నో గొంతులు కలివిడిగా, విడివిడిగా వినిపిస్తున్నాయి. వస్తువు విస్తృతమైనది. కవిత్వాకాశ వైశాల్యం పెరిగింది. 3. దేశీయత లేదా స్థానీయత ఇప్పటి కవిత్వంలో ఒక ముఖ్యాంశం అయింది. ‘విశ్వం నుంచి నాదాకా’ అనే సూత్రం ముందుకొచ్చింది. 4. సొంత భాషని ఎంతగా లీనం చేసుకుంటే ఆ కవి కవిత్వం అంత నిసర్గంగా ఉంటుంది. 5. కవిత్వంమంటే భాష యొక్క ఉన్నత వ్యక్తీకరణ కాదు. అందమైన అభివ్యక్తీ కాదు. పదచిత్రాలు, భావ చిత్రాల పొహళింపు కాదు. జీవితాన్ని తార్కికంగా కాదు, తాత్వికంగా వివేచించాల్సి ఉంది. ఇకపోతే జిగ్మంట్ భౌమన్ చెప్పిన లిక్విడ్ మోడల్ని ‘ద్రవాధునికత’గా శివశంకర్ మనదైన జీవన విధానాలకు అనుగుణంగా అన్వయం చేశారు. శరవేగంగా మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ‘ద్రవాధునికత’ను ఒక పరికరంగా మన ముందుంచారు. వ్యక్తి, ప్రకృతి, సమాజం.. వీటిని వ్యాపారమయం చేసిన తీరు తెలిపారు. మనం ఒక ప్రవాహంలో పడిపోయాం. అది క్షణక్షణం మారిపోయే ప్రవాహం. రూపం మార్చుకున్న ప్రవాహం. ఎక్కడా విలువలు కనిపించవు. కొత్తదనంపై తీవ్రమైన మోజు, అర్ధరాహిత్య జీవనం, అమానవీయత, మానవ దూరం.. ఇవన్నీ ద్రవాధునికతలో భాగం. (Mannu Bhandari: రాలిన రజనీగంధ) ఆయన మాటల్లో ద్రవాధునికత లక్ష్యం ఇది – ‘‘ఇవాళ ముఖ్యంగా నాగరిక, విద్యాధిక, ధనాధిక, కార్పొరేట్ వర్గ జీవన విధానంలో ద్రవాధునికత తెచ్చిన సరికొత్త మార్పు తేలిగ్గా గుర్తించగలం. అది మోగించే ప్రమాదఘంటికలు వినగలం. రకరకాల (అడ్డ)దారుల ద్వారా ఉరువైన నూతన సంపన్నవర్గం ఏర్పడింది. దానికి కరెన్సీ స్విమ్మింగ్ పూల్లో ఈదడం మహానందం. స్వసుఖ జీవనంతో తప్ప దానికి ఏ సామాజిక, వైయక్తిక విలువలతో పని లేదు.’’ ‘ద్రవాధునికత’ స్థితిని దాటేందుకు కూడా ఆయన కొన్ని పరికరాల్ని చూపారు. ప్రకృతిలో మైత్రి, సామూహికం, పురానవం, నిరహంకారం, నిబ్బరం, సృజనాత్మకత లాంటి విలువైన మార్గాలు చూపారు. ఆయన ద్రవాధునికతను ఒక పనిముట్టుగా చేసుకున్నారు. దాని సాయంతో సమాజంలోని స్థితిగతులను వ్యాఖ్యానించి, మనం ఇంకా ఎంత మంచి మనుషులుగా మారాల్సి వుంటుందో గుర్తు చేశారు. మానవ జీవితం ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి అనే వైరుధ్యాన్ని పరిష్కరించే దిశగా రచనలు సాగాలని ఈ విమర్శకుడి ఉద్దేశం. ప్రపంచీకరణ సారాంశాన్ని, పతనీకరణ సారాంశాన్ని గుర్తించి ఎరుకతో ఎలా జీవించాలో హెచ్చరిస్తున్నారు. సాహిత్యంలో జీవితం గురించే కాదు, జీవితంలో సాహిత్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన విమర్శకుడు పాపినేని. - డాక్టర్ సుంకర గోపాల్ వ్యాసకర్త తెలుగు సహాయాచార్యులు (కాకినాడలో పాపినేని శివశంకర్ ‘అద్దేపల్లి కవిత్వ విమర్శ పురస్కారం’ అందుకుంటున్న సందర్భంగా) -
తెలుగు కథకు తానా బహుమతి
తెలుగు కథకు తానా అందిస్తున్న అండదండలు విస్మరణీయం కాదు. ముఖ్యంగా గత పది, పదిహేను సంవత్సరాలుగా తెలుగు కథ వికాసంలో తానా ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకుంటున్నది. ఇందుకు ‘కథా సిరీస్’ ఒక ప్రబల ఉదాహరణ. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ ప్రతి ఏటా వెలువరిస్తున్న ‘కథ’ వార్షిక సంకలనాలు సాంకేతికంగా ‘కథాసాహితి’ ప్రచురణలే అయినా మానసికంగా తానా ప్రచురణలు. వీటి కోసం తానా స్వయంగా శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక పరిపుష్టి అందించడమేగాక, ఈ మంచి పని కోసం అమెరికాలో విరాళాలు ఆకాంక్షించడం, నలుమూలల ఉన్న అమెరికా పాఠకులకు చేర్చేందుకు ప్రతులను విక్రయించడం, ప్రచారం చేయడం... తన పనులుగా భావించి చేస్తున్నది. ఇది తక్కువ సేవ కాదు. ఆ విధంగా ‘కథ’లో ప్రకటితమైన కథకులెందరో తానాకు, అమెరికాకు రుణపడి ఉన్నారు. అలాగే తెలుగు కథను ఉత్సాహపరచడానికి తానా నిర్వహించిన పోటీలు గుర్తు చేసుకోవాలి. రూ.మూడు వేలు, రూ.ఐదు వేలు పెద్ద మొత్తాలుగా ఉన్న 2001-05 సం.ల కాలంలో తెలుగు కథకు బహుమతిని ఏకంగా రూ.25,000గా ప్రకటించి కుతూహలం రేపింది తానా. అయితే కథల నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని నిరాశ పడి బహుమతి మొత్తాన్ని పలువురికి విభజించి పంచడం మినహా ‘టైటానిక్’ (సురేష్), ‘అస్తిత్వానికి అటూ ఇటూ’ (మధురాంతకం నరేంద్ర), ‘మిత్తవ’ (మంచికంటి) వంటి మంచి కథలు ఆ పోటీల వల్లే తెలుగు కథకు జతపడ్డాయి. తెలుగు కథలోనూ, రచనలోనూ నిమగ్నమైన కాట్రగడ్డ దయానంద్, ఓల్గా, పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, శ్రీరమణ తదితరులను ఆమెరికా ఆహ్వానించి వారిని తన వంతుగా గౌరవించు కోవడం తానా చేసిన మరో మంచి పని. ఆ పరంపరలో భాగంగా తానా ఇటీవలే ‘తెలుగు కథ- నేపథ్యాలు’ పేరుతో రెండు విలువైన సంకలనాలు వెలువరించింది. ఇప్పుడు మరో బహుమతిగా ఈ పుస్తకం. గురజాడ ‘దిద్దుబాటు’ కంటే ముందు తెలుగులో వెలువడిన 92 కథల సంకలనమే ‘దిద్దుబాటలు’. తెలుగులో మొదటి కథ ‘తేదీ ప్రకారం ఏది?’ అని కాకుండా ‘పరిణతి ప్రకారం ఏది?’ అనే విషయంలో పండితులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. 1910లో గురజాడ ‘దిద్దుబాటు’, ‘మీ పేరేమిటి?’ కథలు రాశారు. వస్తువు రీత్యా, శిల్పం రీత్యా, భాష రీత్యా, స్థానికత రీత్యా ఇవి ప్రపంచస్థాయి కథలు. ఆ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నించిన అంతకుముందరి కథలు ఎన్ని ఉన్నా వీటి ముద్ర చెరిగిపోదు. రాయసం వెంకట శివుడు, భండారు అచ్చమాంబ, ఆచంట సాంఖ్యాయన శర్మ, విన్నకోట లక్ష్మీ జోగమ్మ వంటి తొలి కథకుల కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. కొన్ని గ్రాంథికం, కొన్ని వ్యావహారికం, కొన్ని మిశ్రమంగా, కొన్ని సంభాషణ రూపంలో, కొన్ని ప్రాథమిక శైలిలో.... పలుకు నేర్చుకుంటున్న పాపాయి అందం వీటి నిండా ఉంది. వీటిని చూస్తే ఇంత కృషి జరిగిందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. గర్వం కూడా. 20వ శతాబ్దపు తొలి రోజుల వచనం, వస్తువు, సామాజిక జీవనం తెలియాలంటే ఇంతకు మించిన విలువైన సాధనం మరొకటి ఉంటుందా? ఈ కథలను సేకరించడం, ఆనాటి భాషను తప్పుల్లేకుండా కంపోజ్ చేయడం, ప్రూఫ్ చూడటం, అందంగా పుస్తక రూపం ఇవ్వడం... ఈ పనుల కన్నా వీపున వంద మూటలు మోయడం సులువు. కాని సంపాదకులు వివినమూర్తి, మిత్రులు వాసిరెడ్డి నవీన్, ఎ.వి.రమణమూర్తి, చంద్ర, అక్షర సీత ఈ పని సమర్థంగా చేయగలిగారు. తెలంగాణ తొలితరం కథలను తెలంగాణవారు ప్రచురించుకున్నట్టు ఈ విలువైన సంపదను ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రచురించుకుని ఉంటే బాగుండేది కానీ మాతృభూమి రుణం కొంతైనా తీర్చుకోవడానికి తపన పడే తానాకు అవకాశం దక్కడం సంతోషించదగ్గ అంశం. దీని వల్ల తానా తెలుగు కథకు విలువైన చేర్పును సమకూర్చడమే గాక తన వదాన్యతతో పూర్వ కథకులందరినీ రుణగ్రస్తులను చేసుకోగలిగింది. కాళీపట్నం రామారావు 90వ జన్మదినం సందర్భంగా వెలువడిన ఈ సంకలనం ఆయనకు ఒక అనిర్వచ నీయమైన అమెరికా కానుక. ఇలాంటి పనులు ఎన్ని జరిగితే అంత మేలు. - నెటిజన్ కిశోర్ దిద్దుబాటలు (దిద్దుబాటుకు ముందు కథలు 92) తానా ప్రచురణ; సంపాదకులు- వివినమూర్తి, వెల: రూ.300; అమెరికాలో: 25 డాలర్లు, ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు లేదా 040 - 23244088 తానా 2015 ఉత్సవాల్లో కథావేడుక.... ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తానా ఉత్సవాల్లో భాగంగా 2015 జూలై 2-4 తేదీల్లో అమెరికా డెట్రాయిట్లో జరగనున్న వేడుకలలో తెలుగు కథకు పెద్ద గౌరవం దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఆహ్వానం అందుకున్న వారిలో సుప్రసిద్ధ కథకులు పి.సత్యవతి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, డా.వి.చంద్రశేఖరరావు, స.వెం.రమేశ్, వాసిరెడ్డి నవీన్ ఉన్నట్టు తానా తన వెబ్సైట్లో ప్రకటించింది. ఇంతమంది కథకులు తానాకు హాజరు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. ఫలితంగా అక్కడ విస్తృతంగా జరిగే కథాసదస్సులలో తెలుగు కథ రెపరెపలాడనుంది. ఇది కథాభిమానులను ఆనందపరిచే సంగతి. పి.సత్యవతి (మంత్రనగరి), నామిని (మూలింటామె), డా.వి.చంద్రశేఖరరావు (లెనిన్ ప్లేస్), స.వెం.రమేశ్ (ప్రళయకావేరి కతలు) రచనలు పాఠకులకు పరిచితాలు. వాసిరెడ్డి నవీన్ ‘కథ’ సంకలనాలు బహుళ గుర్తింపును పొందాయి. కాగా తెలంగాణ రాష్ట్రం నుంచి కవి దర్భశయనం శ్రీనివాసాచార్య (వేళ్లు మాట్లాడేవేళ) వేడుకలలో పాల్గొననున్నారు.