breaking news
pandum
-
బస్తర్లో అభివృద్ధి పొద్దు పొడిచింది
జగ్దల్పూర్: ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాత్మక చర్యలతో మావోల భయానక వాతావరణం సమసిపోయి అభివృద్ధి పొద్దు పొడిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. శనివారం బస్తర్ జిల్లా కేంద్రమైన జగ్దల్పూర్లో మూడ్రోజుల డివిజనల్ స్థాయి సంప్రదాయ బస్తర్ పండుమ్ వేడుకను ఆమె ప్రారంభించి అక్కడి కళాకారులు, వందలాది మంది ప్రేక్షకులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ హింసను విడనాడి ప్రజా స్రవంతిలో కలిసిపోయిన వాళ్లు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంచండి. మరెప్పుడూ మళ్లీ ఆ అశాంతియుత మార్గం వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండండి. బస్తర్ సహజ సౌందర్యం, గణమైన సాంస్కృతిక సంప్రదాయాలు అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇలాంటి ప్రాంతం దశాబ్దాలుగా మావోయిజం కారణంగా అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. నక్సలిజం అనేది ఇక్కడి యువత, గిరిజనులు, దళితులను అన్నిరకాలుగా నష్టపోయేలా చేసింది. మావోయిస్ట్ కార్యకలాపాల్లో నిమగ్నమైన వాళ్లు సైతం ఇప్పుడు హింసను విడనాడారు. దీంతో ఇక్కడ మళ్లీ శాంతివనాలు వృద్ధిచెందుతున్నాయి. భయం, అవిశ్వాస మబ్బులు మటుమాయం కావడానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాత్మక వైఖరే కారణం. పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. వాళ్లు గౌరవప్రదంగా బతికేందుకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇక్కడి గ్రామాలు సాధికారత సాధించేందుకు నియాద్ నెల్లనార్ సహా ఛత్తీస్గడ్ ప్రభుత్వం ఎంతో సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. గ్రామాలకు కొత్తగా విద్యుత్, రహదారులు, తాగునీటి సదుపాయాలొచ్చాయి. ఇదెంతా మనసుకు హత్తుకునే సజీవచిత్రంగా తోస్తోంది. ప్రభుత్వ కృషి, ప్రజల తోడ్పాటుతో బస్తర్లో కొత్త అభివృద్ధి శకం మొదలవుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ పీఎం జన్మన్, ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష యోజన వంటి పథకాలు దన్నుగా నిలుస్తున్నాయి. గిరిజన చిన్నారులకు విద్యను మరింత చేరువ చేసేందుకు వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాట్లూ పూర్తయి అవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి’’ అని రాష్ట్రపతి అన్నారు. -
వార్డు మెంబర్ దారుణ హత్య
ఆదిలాబాద్(ఖానాపూర్): ఆదిలాబాద్ జిల్లాలో పాండు (25) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడనే సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఖానాపూర్ మండలం పెంబి శివారులో ఉన్న నరసింహస్వామి గుట్ట వద్ద పాండు (25) అనే వ్యక్తి ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఆయన శెట్టిపల్లి వార్డు సభ్యుడిగా ఉండేవారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పాండును గొంతుకోసి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


