breaking news
New age entrepreneurs
-
హైదరాబాద్లో ఎక్స్ఫెనో రిక్రూట్మెంట్ డెలివరీ కేంద్రం ప్రారంభం
ఇండియన్ స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీల్లో ఒకటైన ఎక్స్ఫెనో హైదరాబాద్లో రిక్రూట్మెంట్ డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్తో పాటు విదేశాల్లో సేవలు అందించనున్నారు. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ టి-హబ్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యం అతిథిగా పాల్గొని ఆర్డీసీని ప్రారంభించారు. అలాగే టీపాజిటివ్ (బిల్డింగ్ అండ్ సస్టేనింగ్ ఏ టాలెంట్ పాజిటివ్ తెలంగాణ) పేరుతో వివిధ కంపెనీల్లోని సీఎక్స్ఓ, హెచ్ఆర్ పరిశోధన నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన సంస్థలతో పాటు, యునికార్న్లు, స్టార్టప్లు తమ కార్యకలాపాలను విస్తరించడానికి హైదరాబాద్ను ఎంచుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా టెక్ ఉద్యోగుల ఉన్న హైదరాబాద్కు ఈ నివేదిక ఎంతో ఉపయోగమని అన్నారు. ఎక్స్ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ మాట్లాడుతూ.. దేశంలో తమ టెక్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైనదని అన్నారు. తెలంగాణలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఎక్స్ఫెనో హైదరాబాద్ ఆపరేషన్స్ విభాగాధిపతి సతీష్ మన్నె అన్నారు. ‘ఉమెన్ ఇన్ ది వర్క్ఫోర్స్’ అనే అంశంపై ఇంటరాక్షన్ సెషన్ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ సహ వ్యవస్థాపకుడు అనిల్ ఏతానూర్, పెగా సిస్టమ్స్ హెచ్ఆర్ స్మృతి మాథుర్, ది స్టార్ ఇన్ మీ సహ వ్యవస్థాపకుడు ఉమా కాసోజీ, హెచ్ఆర్ఎస్ఎస్ డీఎస్ఎం గ్లోబల్ డైరెక్టర్ డా.దినేష్ మురుగేశన్ పాల్గొన్నారు. ఎక్స్ఫెనో ఇప్పటి వరకు 12,000 మంది ఇంజినీర్లను నియమించింది. ఆర్డీసీ ద్వారా స్పెషలిస్ట్ టాలెంట్ సోర్సింగ్, లీడర్షిప్ హైరింగ్, టాలెంట్ డిప్లాయ్మెంట్, మేనేజ్మెంట్ సేవలు అందిస్తుంది. టాలెంట్ ఎంగేజ్మెంట్కు సంబంధించిన అనేక ఆన్ డిమాండ్ ఆఫర్లను కూడా కల్పిస్తుంది. -
నవతరం పారిశ్రామికవేత్తలుగా యువత
* నిజామాబాద్ ఎంపీ కవిత * నైపుణ్యాభివృద్ధిపై టిఫ్తో తెలంగాణ జాగృతి ఒప్పందం సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, గ్రామీణ యువతను నవతరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాల్సి ఉందని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. యువతలో నైపుణ్యం, వ్యవస్థాపక సామర్థ్యం పెంపుదలకు సంబంధించి తెలంగాణ పారిశ్రామివేత్తల సంఘం(టిఫ్)తో తెలంగాణ జాగృతి మంగళవారం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందులో ఎంపీ కవిత మాట్లాడుతూ... ఈ ఒప్పందం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు.. పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. పారిశ్రామికాభివృద్ధి హైదరాబాద్ పరిసరాలకే పరిమితం కాకుండా.. వికేంద్రీకరణ ద్వారా జిల్లాలకు విస్తరిస్తామన్నారు. జిల్లాల్లో స్థానిక వనరులకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు కావాలని, నిజామాబాద్లో సీడ్ పార్కు, వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. కులవృత్తులు, వ్యవసాయం దెబ్బతినడంతో గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వస్తున్న రైతు బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణకు పూర్వ వైభవం సాధించడంతో పాటు.. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. జనావాసాల్లో ఉన్న సూక్ష్మ, లఘు పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పరిశ్రమలకు తాగునీరు, ఆస్తిపన్ను తదితర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సంబంధించి టిఫ్తో కలసి పనిచేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం పాత్రను కవిత ప్రస్తావించారు. ఉపాధి కల్పనపై దృష్టి పెట్టండి ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం చూడకుండా ఉపాధి కల్పనపై యువత దృష్టి సారించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి ఉపాధి కల్పిం చేలా పరిశ్రమలను స్థాపించాలన్నారు. టీ హబ్ తరహాలో తెలంగాణ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. పారి శ్రామికవృద్ధి జరిగితేనే వాణిజ్యాభివృద్ధి జరుగుతుందని సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన టీఎస్ఐపాస్, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్లు, రిచ్, టాస్క్ తదితరాల ప్రత్యేకతలను టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి వివరించారు. తెలంగాణ జాగృతితో కలసి 18 పారిశ్రామికవాడల్లో టిఫ్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తుందని టిఫ్ అధ్యక్షుడు సుధీర్రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా టిఫ్ ప్రచురించిన ‘మేకిన్ తెలంగాణ’ సంచికను ఎంపీ కవిత ఆవిష్కరించారు. సమావేశంలో టిఫ్ ప్రతినిధులు ఆనంద్రెడ్డి, సుధాకర్రెడ్డి, ఎఎల్ఎన్ రెడ్డి, హరినాథ్, లక్ష్మణరావు పాల్గొన్నారు.