breaking news
Navincand
-
ఇంటెలిజెన్స్ చీఫ్గా నవీన్చంద్
►ఏడుగురు ఐపీఎస్లకు స్థానచలనం ►సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యా సాక్షి, హైదరాబాద్: అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా కీలకమైన స్థానాల్లో ఉన్న సీనియర్లను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న బి.శివధర్రెడ్డిని బదిలీ చేసింది. ఆయన స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న నవీన్చంద్ను కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. శివధర్రెడ్డికి ఐజీ పర్సనల్ పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడున్న సందీప్ శాండిల్యాను సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు. వరంగల్ రేంజీ డీఐజీ టి.ప్రభాకర్రావును డీఐజీ ఇంటెలిజెన్స్గా, ఆ పోస్టులో ఉన్న ఎన్.శివశంకర్రెడ్డిని సీఐడీ విభాగంలో డీఐజీగా నియమించారు. ప్రస్తుతం సీఐడీ డీఐజీగా ఉన్న రవివర్మకు వరంగల్ రేంజీ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. సీఐడీ ఎస్పీగా ఉన్న కె.రమేశ్నాయుడును రాచకొండ కమిషనరేట్లో ట్రాఫిక్ డీసీపీగా నియమించారు. -
సైబరాబాద్ కొత్త బాస్లు వీరే
సిటీబ్యూరో: సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్గా నవీన్చంద్, ఈస్ట్ పోలీసు కమిషనర్గా మహేష్ మురళీధర్ భగవత్లు నియమితులయ్యారు. 2012 నవంబర్ 15న సైబరాబాద్ కమిషనరేట్ను ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుచేయగా, విస్తరిస్తున్న ఐటీ రంగం, జనాభా పెరుగుదల, నేరాలు పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం దాన్ని సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ ఈ నెల 23న జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్గా 1996 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన నవీన్ చంద్ను, ఈస్ట్ పోలీసు కమిషనర్గా 1995 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మహేష్ మురళీధర్ భగవత్లను నియమించింది. ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్న సీవీ ఆనంద్ వ్యక్తిగత విదేశీ పర్యటన నిమిత్తం సెలవుకు దరఖాస్తు చేయడంతో ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రేహౌండ్స్ డీఐజీగా పనిచేస్తున్న 1999 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎం.స్టీఫెన్ రవీంద్రను వెస్ట్ సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్గా, ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్గా ఉన్న టీవీ శశిధర్రెడ్డిని కొత్తగా ఏర్పాటు చేసిన ఈస్ట్ సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్గా నియమించింది. మరికొద్ది రోజుల్లో ఇతర ఖాళీలపై స్పష్టత... సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్ పోలీసు కమిషనరేట్లకు ట్రాఫిక్ డీసీపీలను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఏఆర్ శ్రీనివాస్ను రెండింట్లో ఏదో ఒక జోన్గా కేటాయించినా, రెండో జోన్కు ఇంకొక ట్రాఫిక్ డీసీపీని నియమించాల్సి ఉంది. వీటితో పాటు క్రైమ్ డీసీపీలను కూడా భర్తీ చేయాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన భువనగిరి జోన్తో పాటు చాలా రోజుల నుంచి ఐపీఎస్ల కొరతతో ఖాళీగా ఉంటూ ఇన్చార్జి డీసీపీలతో నెట్టుకొస్తున్న మల్కాజిగిరి, బాలానగర్ జోన్లకు కూడా డీసీపీలను నియమించాల్సి రానుంది. త్వరలోనే ఈ ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. గచ్చిబౌలి నుంచే పాలన... ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం వున్న గచ్చిబౌలిలోనే సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్స్ కార్యాలయాలు కొనసాగనున్నాయి. ఒకటి, రెండు అంతస్తుల నుంచి వెస్ట్ కమిషనరేట్ కార్యకలాపాలు, నిర్మాణ పనులు పూర్తయిన మూడు, నాలుగు అంతస్తుల్లో ఈస్ట్ కమిషనరేట్ కార్యకలాపాలు కొనసాగించనున్నారు. ఆపై వెస్ట్ కమిషనరేట్ ఇక్కడే కొనసాగగా... ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయాన్ని అనువైన ప్రాంతానికి తరలించనున్నారు. దీని కోసం అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమికంగా రెండూ ఇక్కడే కొనసాగినా...సాధ్యమైనంత తొందరగా ఈస్ట్ కమిషనరేట్ను తరలించాలన్న ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఉప్పల్లో అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు. మహేష్ భగవత్ ప్రొఫైల్... మహారాష్ట్రకు చెందిన మహేష్ భగవత్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా పోలీసు సర్వీస్లో మంచి పేరు తెచ్చుకున్నారు. విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు 2004లో ఇండియన్ ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలెంటరీ అందుకున్నారు. ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేసిన మహేష్ భగవత్ ఆ తర్వాత అదే జిల్లాకు ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత నల్గొండ, కడపలో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో సౌత్జోన్ డీసీపీగా, సైబరాబాద్లో అల్వాల్ డీసీపీగా పనిచేశారు. సీఐడీలో మహిళల అక్రమ రవాణా నిరోధక బృందాలను నేతృత్వం వహించారు. డీఐజీగా ఏలూరు, నగర పోలీసు కమిషనరేట్లో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నవీన్చంద్ నేపథ్యమిదీ... నవీన్ చంద్ది కరీంనగర్ జిల్లా. హైకోర్టులో అడ్వకేట్గా పనిచేశారు. క్రిమినల్ లాయర్గా మంచి పేరు తెచ్చకున్నారు. 1987లో డీఎస్పీగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. తొలి పోస్టింగ్ నర్సంపేట డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లోని సుల్తాన్ బజార్ ఏసీపీ, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఏసీపీ, ఎస్ఐబీలో అడిషనల్ ఎస్పీగా, ట్రాఫిక్లో అడిషనల్ డీసీపీగా, గ్రేహౌండ్స్లో నాన్క్యాడర్ ఎస్పీగా, 1996లో ఐపీఎస్, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం ఎస్పీ, డీఐజీగా విజిలెన్స్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ, హైదరాబాద్ రేంజ్ డీఐజీ, 2013లో ఐజీ, రాయలసీమ జోన్ ఐజీ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత డీజీపీ కార్యాలయంలో పీ అండ్ ఎల్ విభాగం ఐజీ, ఐపీఎస్ల విభజన పూర్తయి తెలంగాణకు వచ్చిన తర్వాత వరంగల్, హైదరాబాద్ జోన్లకు ఐజీగా ఏడాదిన్నర పాటు పనిచేశారు. -
సైబరాబాద్ /2
విభజన ఉత్తర్వులు జారీ కొత్త కమిషనర్లుగా నవీన్చంద్, భగవత్ ఖరారు? 14 ఏళ్లలో నలుగురు కమిషనర్లు.. సిటీబ్యూరో: విస్తరిస్తున్న ఐటీ రంగం, పాలనా పరమైన సౌలభ్యం కోసం 2002లో ఏర్పాటైన సైబరాబాద్ కమిషనరేట్ రెండుగా విడిపోయింది. దీన్ని ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి సైబరాబాద్కు మహేందర్రెడ్డి తొలి, సీవీ ఆనంద్ తుది కమిషనర్లుగా సేవలందించారు. ఈ పద్నాలుగేళ్ల కాలంలో నలుగురు ఐపీఎస్ అధికారులు పోలీసు కమిషనర్లుగా పనిచేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావడం ద్వారా అభివృద్ధి, జనాభా పెరుగుదలతో పాటు నేరాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి వేరు చేసిన ప్రాంతాలతో 2002 నవంబర్ 15న ‘సైబరాబాద్ కమిషనరేట్’ను (ఐటీ పరిశ్రమల వల్ల ఈ పేరు వచ్చింది) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003 ఫిబ్రవరిలో తొలి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ పోలీసు కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో ఆరు సబ్డివిజన్లు ఉండగా, వీటిలో ఐదు బాలానగర్, మల్కాజిగిరి, సరూర్నగర్, రాజేంద్రనగర్, అల్వాల్ డివిజన్ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో కలిపారు. ఈ డివిజన్ల పరిధిలో 34 పోలీసు స్టేషన్లు ఉండేవి. అయితే 19 ఠాణాలతో కూడిన వికారాబాద్ డివిజన్ను రంగారెడ్డి జిల్లా రూరల్గా మార్చి ఎస్పీ అధికారిని నియమించారు. స్వరూపం మారుతూ.. మహేందర్ రెడ్డి డీఐజీ హోదాలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. 2004లో కమిషనర్ పోస్టును ఐజీ హోదాకు అప్గ్రేడ్ చేశారు. ఆ సమయంలో పదోన్నతి రావడంతో మహేందర్ రెడ్డిని కొనసాగించారు. కమిషనరేట్ పరిధి పెంచేందుకు 2004లో ఎల్బీనగర్, అల్వాల్, బాలానగర్ జోన్లను ఏర్పాటు చేశారు. వీటికి డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. అలాగే ఒక క్రైమ్ డీసీపీ, ట్రాఫిక్ డీసీపీని కూడా నియమించారు. 2006-07లో ఐదు డివిజన్లకు తోడు మరో నాలుగు కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. 2011-12లో రెండు డివిజన్లు కొత్తవి ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 11 డివిజన్లకు చేరింది. 2013లో శంషాబాద్, మాదాపూర్ జోన్లను ఏర్పాటు చేసి కమిషనరేట్ పరిధిని మరింత పెంచారు. అదే సమయంలో జాయింట్ సీపీ పోస్టును కూడా మంజూరు చేశారు. ఠాణాల పెంపు ఇలా: సైబరాబాద్ కమిషనరేట్లో 2003లో 36 ఠాణాలు ఉండగా, 2007లో మరో నాలుగు ఠాణాలు ఏర్పాటయ్యాయి. 2012-13లో మీర్పేట, చైతన్యపురి, పేట్ బషీరాబాద్, మియాపూర్ ఠాణాలు, 2014 చివర్లో జవహర్నగర్, జగద్గిరిగుట్ట, 2015 జనవరిలో ఆదిభట్ల ఠాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో సైబరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్ స్టేషన్ల సంఖ్య 45కు, ట్రాఫిక్ ఠాణాలు 12కు చేరాయి. సైబరాబాద్కు తొలి కమిషనర్గా డీఐజీ హోదాలో మహేందర్రెడ్డి, ఆఖరి కమిషనర్గా అదనపు డీజీ హోదాలో సీవీ ఆనంద్ పనిచేశారు.