breaking news
narasimhamurthy
-
వందేళ్ల క్రితమే ఒడిసిపట్టారు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు. ఆ దంపతుల్ని ‘సాక్షి’ పలకరించింది. మండువా విశేషాలు, డోలియా ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంది. తాతల కాలంలో నిర్మించారు అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్ చదివిన ఇంటి యజమాని నరసింహారావు మాట్లాడుతూ.. ‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం ద్వారా ఇంటి అడుగు భాగంలో నిర్మించిన రాతి ట్యాంక్లోకి చేరేది. అప్పట్లో ఇలా నిల్వ చేసిన నీటినే తాగేవాళ్లం. అలాగని అప్పుడు నీటి కొరత లేదు. అప్పట్లో వర్షం నీరంటే ఎలాంటి కాలుష్యం లేనిది. రాగి లేదా ఇత్తడి తొడుగు ద్వారా ఒడిసి పట్టడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నశించేది. ఆ నీటిని తాగితే ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం. డోలియా ద్వారా వచ్చిన నీరు ఇంటిల్లిపాదికీ వారం, పది రోజులు సరిపోయేది. అది అయిపోయాక చెరువు నీళ్లు తెచ్చుకునే వాళ్లం. వర్షం నీటిని ప్రకృతి వర ప్రసాదంగా భావించేవారు. నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, వినియోగం తరువాత మిగిలిన నీటిని డ్రెయిన్లలోకి పంపించేందుకు మండువా లోగిళ్లలో కనిపించే ప్రత్యేక ఏర్పాట్లు నాటి జీవన శైలికి సాక్ష్యాలు. ప్రతి లోగిలిలో 10 నుంచి 12 కుటుంబాలు నివసించేవి. మండువా చుట్టూ గదులు, వసారాలు, కొట్టు గదులు ఉండేవి. కొన్నింటిలో అయితే మేడలు (డూప్లెక్స్ ఇళ్లు) కూడా ఉండేవి. మా మనుమలు, ముని మనుమలు సెలవులకు వచ్చినప్పుడల్లా ఈ మండువాను, డోలియాను తీసేద్దామనేవారు. ఏది చేయాలన్నా నన్ను ఇంటి నుంచి బయటకు పంపేశాక చేసుకోండని గట్టిగా చెప్పడంతో దాని గురించి మాట్లాడటం మానేశారు’ అని వివరించారు. కాపాడాల్సిన బాధ్యత మాదే నరసింహారావు సతీమణి అలివేలు మంగ మాట్లాడుతూ.. ‘మా మావయ్య గారి తండ్రి 130 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు ఇది. డోలియాను ఇప్పుడు వాడటం లేదు కానీ.. ఒకప్పుడు చాలా ఉపయోగపడేది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రెండు, మూడేళ్లకు ఒకసారి మెరుగు పెట్టించి కాపాడుకుంటున్నాం. పిడుగులు పడినప్పుడు డోలియా ఉండటం వల్ల ఇంట్లో వారెవరికీ ప్రమాదం ఉండదు’ అని చెప్పారు. మండువా అంటే.. మండువా లోగిలి అంటే.. పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలువైపులా గదులుంటాయి. కనీసం 10 కుటుంబాలు నివాసం ఉండేలా.. పెద్ద విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉండేది. నాలుగు వైపులా ఒక దానిని ఆనుకుని మరొకటి చొప్పున 10 నుంచి 12 వాటాలు (పోర్షన్లు) ఉండేవి. ప్రతి వాటాలో వంట గది, విశ్రాంతి గది, పడక గది, పెరటి దొడ్డి ఉండేవి. ఒక్కొక్క పోర్షన్లో 8 నుంచి 10 గుమ్మాలను అమర్చేవారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు వందకు పైగా గుమ్మాలు ఉండేవి. లోగిలి మధ్యలో కల్యాణ మండపం ఉండేది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి ఇంటి మధ్య హాలు భాగంలో పైకప్పు లేకుండా నిర్మాణం చేసేవారు. వాన నీరు హాలులో మధ్యలో పడటానికి వీలుగా ఒక గుంట, ఆ గుంటలోంచి నీరు బయటకు పోవడానికి డ్రెయినేజీ పైపు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకునేవారు. మండువా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబాల మమతల కోవెళ్లుగా మండువా లోగిళ్లు వెలుగొందేవి. అలనాటి నిర్మాణాలకు ప్రతీక కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిలి అలనాటి నిర్మాణాలకు ప్రతీకగా రాజసాన్ని చాటుతోంది. ఇక్కడ 1830లో చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ మండువా లోగిలో మూడు తరాల వారు నివాసం సాగించారు. గోదావరి ఏటుగట్టుని అనుకుని ఉన్న ఈ గ్రామం తరచూ గోదావరి వరద ముంపునకు గురయ్యేది. ఈ దృష్ట్యా ఏటిగట్టుకు కిలోమీటరు దూరంలో ముంపు బారిన పడకుండా రెండెకరాల విస్తీర్ణంలో 10 కుటుంబాలకు చెందిన 50 మంది ఉండేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 189 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిలో అన్ని సదుపాయాలను శాస్త్రానికి, వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో 114 గుమ్మాలతో నిర్మించిన ప్రతి గది ఆధునిక హంగులను ప్రతింబిస్తుంటుంది. లోగిలి మధ్యలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం విశేషంగా అకట్టుకుంటుంది. చిట్టూరి వంశంలో మూడో తరానికి చెందిన పార్థసారథి ఈ మండువాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడా ఇంకా ఉన్నాయ్ తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కూళ్ల, ఉప్పలగుప్తం, సన్నవిల్లి, భీమనపల్లి, నంగవరం, గోడి, కూనవరం, పోతుకుర్రు, లక్కవరం, తూర్పుపాలెం, బట్టేల్లంక, కేశనపల్లి, గుడిమెళ్లంక, మోరిపోడు, గుడిమూల, సఖినేటిపల్లి, వీరవల్లిపాలెం, టేకి, పామర్రు గ్రామాల్లో మండువా ఇళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి, శివదేవుని చిక్కాల, వీరవాసరం, మల్లవరం, పోడూరు, కుమారదేవం, ఇలపర్రు, బూరుగుపల్లి, చించినాడ, తణుకు, భీమవరం, ఉండి, ఆకివీడు తదితర ప్రాంతాల్లో మండువాలు, డోలియాలను భద్రంగా చూసుకుంటున్నారు. - చిట్టూరి పార్థసారథి -
దొంగ అరెస్ట్
మడకశిర : మడకశిర పోలీసులు మంగళవారం నరసింహమూర్తి అలియాస్ గుండు అనే దొంగను అరెస్ట్ చేశారు. ఇతని నుంచి రూ.4 లక్షలు విలువ చేసే 130 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శుభకుమార్, అమరాపురం ఎస్ఐ వెంకటస్వామిలు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని పావగడ నియోజకవర్గం మూగుదాళబెట్టకు చెందిన కాపు నరసింహమూర్తి ఆలియాస్ గుండు అమరాపురం మండలం గుణేహళ్లి, ఆలదపల్లి, పేలుబండ, గుడిబండ మండలం హెచ్ఆర్ హట్టి గ్రామాల్లో పగటి పూట తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కొన్ని నెలలుగా గాలింపు చేపట్టారు. మంగళవారం ఉదయం 10గంటల సమయంలో కాపు నరసింహమూర్తి తను దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించడానికి మోటారుసైకిల్లో వెళుతుండగా అమరాపురం మండలం చిట్నడుకు క్రాస్వద్ద ఎస్ఐ వెంకటస్వామి తన సిబ్బందితో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మొత్తం 4కేసుల్లో 130 గ్రాముల బంగారు ఆభరణాలను ఇతడు దొంగిలించినట్లు సీఐ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా.. మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారన్నారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
రొళ్ల( మడకశిర) : రొళ్ల మండల పరిధిలోని హేటిహళ్లి సమీపంలో నరసింహమూర్తి (42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అటుగా వెళ్లిన రైతులు మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో రొళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ నాగన్న ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అగళి మండలం, ముత్తెపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి గురువారం రాత్రి సీసీగిరిలో జరిగిన డ్రామా చూసేందుకు వెళ్లాడు. శవమై పడి ఉండడాన్ని ఆదివారం కనుగొన్నారు. నరసింహమూర్తి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
ఇంటర్ విద్యార్థి అదశ్యం
చిలమత్తూరు : స్థానిక ప్రభుత్వ డీవీఅండ్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని టేకులోడు పంచాయతీ ఆరుమాకులపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ, ఆదినారాయణప్ప దంపతుల కుమారుడు నరసింహమూర్తి స్థానిక జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా గత రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో మంగళవారం తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జమాల్బాషా తెలిపారు. -
వడ్డీరేట్లు తగ్గింపు శుభపరిణామం
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గురువారం న్యూఢిల్లీలో తెలిపారు. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం శుభ పరిణామని ఆయన తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుతం తీసుకున్న వడ్డీ రేట్ల తగ్గింపు మూడు నెలల క్రితమే తీసుకుంటే బాగుండేదని నరసింహమూర్తి అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల భారత్ అర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
వెంకన్న కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత?
బెంగళూరు : సామాన్యుడికి ఆయుధంగా మారిన సమాచార హక్కు చట్టం... ఇప్పుడు 'దేవుడు' తీసుకున్న అప్పు ఎంత అనే లెక్క కూడా అడుగుతోంది. 'తిరుపతి వెంకటేశ్వరస్వామి తన వివాహం కోసం కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు ఎంత? భక్తుల కానుకల ద్వారా ఇప్పటివరకూ తీర్చిన అప్పు లెక్క చెప్పండి? ఆ అప్పు ఎప్పుడు తీరుతుంది..' అని బెంగళూరుకు చెందిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త టి.నరసింహమూర్తి తిరుమల తిరుపతి దేవస్ధానానికి ప్రశ్నలు సంధించారు. బెంగళూరులో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ...'చాలా కాలంగా వెంకటేశ్వరుడి అప్పు తీర్చడం కోసం భక్తులు హుండీలో డబ్బులు వేస్తున్నారు. ఇలా ఇంకెంత కాలం వేయాలి. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా టీటీడీకి 2012 ఫిబ్రవరి 6న దరఖాస్తు చేసుకున్నాను. అయితే ఇప్పటివరకూ సమాధానం రాలేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. సమాధానం వచ్చే వరకూ పోరాటం సాగిస్తాను' అని చెప్పారు.